కర్ణాటక కాంగ్రెస్లో ‘సీఎం’ కలకలం
కర్ణాటక రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నారన్న ప్రచారం జోరందుకొంది.ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో గుప్పుమంటున్నాయి . దీంతో భారీ రాజకీయ చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకు నాయకత్వ మార్పు దిశగా కీలక కసరత్తు జరుగుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన వరుస హైకమాండ్ సమావేశాలు జరగడం సిద్దరామయ్య గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వచ్చిన సమాచారం బయటకు ప్రచారం కావడం వల్ల ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది పలువురు భావిస్తున్నారు. డి.కె.శివకుమార్ ఢిల్లీలో కొనసాగించిన మంతనాలు ఇవన్నీ కలిపి “కర్ణాటకలో సీఎం మార్పు ” కు బలం చేకూరుస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారికంగా మాత్రం ఇప్పటికీ “నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ లేదు” అనే వైఖరినే కొనసాగిస్తోంది.
గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల వరుస సమావేశాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ వేర్వేరుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ కూడా కీలకంగా పాల్గొన్నారు. అధికారికంగా సమావేశాలను “రాజ్యసభ ఎన్నికలు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంశాలు, పార్టీ వ్యవహారాల సమీక్ష”గా పేర్కొన్నప్పటికీ, రాజకీయ వర్గాలు మాత్రం అసలు చర్చ నాయకత్వ మార్పుపైనే జరిగిందని భావిస్తున్నాయి. సమావేశం దాదాపు ఆరు గంటలకు పైగా సాగడం, అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీఎం పదవిపై సిద్దరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించగా, డి.కె. ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.అప్పటినుంచే “రెండున్నరేళ్ల తర్వాత డీకేకు సీఎం పదవి” అనే అనధికార ఒప్పందం జరిగిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతోంది. పార్టీ అధికారికంగా ఎప్పుడూ దీనిని అంగీకరించకపోయినా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ ఫార్ములానే ఇప్పుడు అమలులోకి వస్తోందన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.ఇప్పటి వరకు వచ్చిన అత్యంత కీలక పరిణామాల్లో సిద్దరామయ్య గవర్నర్ తివారీ చాంద్ గ్లెహట్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన అంశం బయట ప్రచారం జోరుగా సాగుతోంది. సియంవోవర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా సంస్థలు మే 28న గవర్నర్ను కలిసేందుకు సమయం కోరినట్లు ఈ పరిణామం రాజీనామా ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిందని రిపోర్ట్ చేశాయి.అయితే రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన లేదు.
కాంగ్రెస్ కూడా మార్పును అధికారికంగా ప్రకటించలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డి.కె. శివకుమార్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ ఆర్గనైజేషన్పై బలమైన పట్టు. ఎమ్మెల్యేల సమీకరణ సామర్థ్యం. ఆర్థిక, వ్యూహాత్మక నిర్వహణ. వోక్కలిగ సమాజంలో ప్రభావం వంటి అంశాలు డి కె కు కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు.
డిమాండ్(యస్ ) బిజేపి పొత్తు తర్వాత వోక్కలిగ రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కాంగ్రెస్కు డి కె అవసరం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సిద్దరామయ్య ను ఒప్పించి రాజీఫార్ములా ప్రకారం మార్పు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్పు చేయాలని చూస్తున్నారు
అందుకే సిద్దరామయ్యను “గౌరవప్రద నిష్క్రమణ” వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం బలపడుతోంది.
ఆయన్ను రాజ్యసభకు పంపించి జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యత ఇవ్వొచ్చన్నది దీని వెనుక వ్యూహం కొడుక్కు మంత్రి పదవి ఇచ్చి గౌరవం కాపాడవచ్చు. వర్గపోరు తగ్గించవచ్చు.
హైకమాండ్ సమతుల్యత సాధించవచ్చు అనే లెక్కలు కాంగ్రెస్లో నడుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై కూడా అధికారిక ధృవీకరణ లేదు.
ఈ మొత్తం పరిణామాల మధ్య హోంమంత్రి పరమేశ్వర్ పేరు కూడా అప్పుడప్పుడు చర్చల్లోకి వస్తోంది. ఒకవేళ ఇరువర్గాల మధ్య రాజీ కుదరకపోతేదళిత నాయకుడిగా వివాదాలకు దూరంగా ఉండే నేతగా
తటస్థ అభ్యర్థిగా పరమేశ్వర్ను ముందుకు తేవచ్చన్న చర్చ కాంగ్రెస్లో నడుస్తోంది. అయితే ప్రస్తుతం డి కె శివకుమార్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది . కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. బహిరంగంగా మాత్రం ఆయన “సీఎం మార్పుపై చర్చే లేదు” అని ప్రకటించడం గమనార్హం.
మే 30న ప్రమాణస్వీకారం నిజమేనా?
రాజకీయ వర్గాల్లో “మే 30న డి కె శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం” అన్న ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయలేదు. గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి షెడ్యూల్ రాలేదు .దీంతో ఈ వార్తలు ఇప్పటికైతే రాజకీయ వర్గాల అంచనాలుగానే భావిస్తున్నారు. సిద్ధరామయ్య రాజీనామా ఖాయం అయిందని చెప్పేందుకు ఇంకా అధికారిక ఆధారాలు లేవు. కానీ ఢిల్లీలో జరిగిన వరుస చర్చలు, గవర్నర్ అపాయింట్మెంట్ అంశం, డి కె వర్గం కదలికలు ఇవన్నీ కలిపి చూస్తే కర్ణాటక కాంగ్రెస్లో పెద్ద రాజకీయ మార్పుకు రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయ వాతావరణం మాత్రం వేడి వాడి గా కనిపిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు లో స్పష్టమైన చిత్రం కోసం కొంత సమయం వేచిచూడాల్సిందే.
చందమూరి నరసింహరెడ్డి.
ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.
కదిరి.


















