విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవం–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. జనాభా పెంపు, కుటుంబ వ్యవస్థ, యువత, మానసిక ఆరోగ్యం, సామాజిక మార్పులు, రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్ను వివరించారు.
సీఎం మాట్లాడుతూ, “ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకూ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తాం” అని స్పష్టం చేశారు. పిల్లలను భారంగా కాకుండా దేశ భవిష్యత్ సంపదగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
“పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. పెద్దవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణ, నిశ్శబ్దం ఉంటుంది. ‘పిల్లలే సంపద’ అనే భావనతో నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవం–2026 చరిత్రలో నిలిచిపోతుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
జనాభా పెరగాలని తాను గతంలో చెప్పినప్పుడు విమర్శలు వచ్చాయని, ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కూడా జనాభా తగ్గుదల వల్ల ఎదురవుతున్న సమస్యలను గుర్తిస్తున్నాయని తెలిపారు.
“జనాభా పెరగాలన్న నా వాదనను మొదట్లో అందరూ విమర్శించారు. ఇప్పుడు ఒక్కొక్కరూ అదే ఆలోచన వైపు వస్తున్నారు” అని సీఎం వ్యాఖ్యానించారు.
మూడో బిడ్డకు ఆర్థిక ప్రోత్సాహకాలపై వచ్చిన విమర్శలకు స్పందించిన చంద్రబాబు, ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందన్నారు. ‘సంజీవని ప్రాజెక్టు’ కింద ప్రతి నాలుగో శనివారం ప్రజల్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలు సేకరించి, విస్తృతంగా చర్చించిన తర్వాతే తుది పాలసీని ఖరారు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణలో బెయిల్పై విడుదలైన పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, మెంటల్ హెల్త్ ప్రస్తుతం సమాజంలో అత్యంత కీలక సమస్యగా మారిందన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం కూడా అనవసర అనర్థాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో వచ్చిన మార్పులపై సరదాగా స్పందిస్తూ, “నాడు వరకట్నం ఉండేది… నేడు ఎదురుకట్నం వచ్చింది. మా ఇంట్లో నాకంటే నా భార్య ఆదాయం ఎక్కువ… మా కొడుకు కంటే మా కోడలి ఆదాయం ఎక్కువ” అంటూ వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు కమిషన్ల కోసం నిర్మించారని విమర్శలు ఎదుర్కొన్న పట్టిసీమ ప్రాజెక్టు, ప్రస్తుతం కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలుస్తోందన్నారు.
“ఆనాడు దూరదృష్టితో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు… నేడు కరవును సమర్థవంతంగా ఎదుర్కొంటూ రైతాంగాన్ని ఆదుకుంటోంది. అదే విజన్కు నిదర్శనం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా, ‘దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్’ అనే మహోన్నత సందేశాన్ని ఆచరణలోకి తీసుకొస్తూ, జనాభా నియంత్రణ అనే పాత ఆలోచనకు ముగింపు పలికి, జనాభా సంరక్షణ అనే నూతన దిశగా దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజుతో ప్రారంభిస్తున్నాం.


















