హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ, గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్తో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“కిలాడీల కమిటీలో కేసీఆర్ చైర్మన్.. హరీష్, కేటీఆర్ సభ్యులు.. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా అందులో సభ్యుడిగా చేరారు” అంటూ సీఎం విమర్శించారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరిలో ప్రవహిస్తున్న నీటిని కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా ఎత్తిపోసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న డిమాండ్ను ఆయన తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అదే వాదనను వినిపించడం ఆశ్చర్యకరమని అన్నారు.
ఈటెల రాజేందర్పై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం గౌరవం లేదని సీఎం స్పష్టం చేశారు. సాగునీటి శాఖ మంత్రి, ఎన్డీఎస్ఏ లేదా సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే ఆయన గౌరవం మరింత పెరిగేదని పేర్కొన్నారు. హరీష్ రావు సూచనల మేరకే ఈటెల మాట్లాడటం ద్వారా తన గౌరవాన్ని తగ్గించుకున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాల చరిత్రను వివరిస్తూ రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. 2019 జూన్ 29న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని, అనంతరం 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారావు లేఖ రాశారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఆ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చి, చివరకు 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలిపారు.
అక్టోబర్ 22న ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని, నవంబర్ 1, 2023న జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA) తన ప్రాథమిక నివేదికలో ప్లానింగ్, డిజైన్, నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని స్పష్టం చేసిందన్నారు.
డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారమే ఎన్డీఎస్ఏ మేడిగడ్డను పరిశీలించిందని, ఎలాంటి రాజకీయ కారణాలు లేవని సీఎం తెలిపారు. పది నెలలపాటు క్షేత్రస్థాయిలో నిపుణుల పరిశీలన అనంతరం ఇచ్చిన తుది నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నీటి నిల్వకు సురక్షితం కావని స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు.
మేడిగడ్డలో 7వ బ్లాక్ తీవ్రంగా దెబ్బతినడంతో బ్యారేజీ సామర్థ్యం దెబ్బతిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా నిర్మాణ సమస్యలు ఉన్నాయని నివేదిక పేర్కొన్నట్లు సీఎం వివరించారు. సమగ్ర పునరుద్ధరణ, భద్రతా చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సూచించిందన్నారు.
కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు కనీసం 93.50 మీటర్ల నీటి మట్టం అవసరమని, ప్రస్తుతం మేడిగడ్డ వద్ద అది కేవలం 89.90 మీటర్లే ఉందని తెలిపారు. ప్రవాహం ఉండటం ఒక విషయం అయితే, పంపింగ్కు అవసరమైన నీటి మట్టం ఉండటం మరో విషయమని స్పష్టం చేశారు.
అన్నారం, సుందిళ్ల వద్ద కూడా గేట్లు మూసి నీటిని నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా సూచించిందని, అలాంటప్పుడు “నీళ్లు ఎత్తిపోసేయండి” అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూన్ 30న ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. ఆ కమిటీ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.
“ఈటెల రాజేందర్ గారు… మీరు ఈ కిలాడీల కమిటీని తీసుకుని ఎన్డీఎస్ఏ కమిటీ వద్దకు వెళ్లండి. వారిని ఒప్పిస్తే మేము కూడా ముందుకు వస్తాం” అంటూ సీఎం సవాల్ విసిరారు.
హరీష్ రావుపై కూడా తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు ఆయన కూడా బాధ్యత వహించాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పట్టిసీమకు 105 టీఎంసీల నీరు తరలించినప్పుడు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్న నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
చివరగా, “మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వినియోగం ప్రారంభమైతే పోలవరంకు నీళ్లు వెళ్లవని చెప్పగలరా?” అని నిలదీశారు. “ఆ గజదొంగల గుంపులో ఈటెల రాజేందర్ చేరొద్దు” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
RevanthReddy


















