ఈ నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సమావేశాలుగా కాకుండా, దేశ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత, రాజ్యసభలో సంఖ్యాబలం కొరత కారణంగా నిలిచిపోయిన అనేక కీలక బిల్లులను ఈసారి ఆమోదింపజేయాలనే లక్ష్యంతో కేంద్రంలోని యన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో యన్డీఏ బలం గణనీయంగా పెరగడం, ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయనే వార్తలు, కొన్ని ప్రాంతీయ పార్టీల తటస్థ వైఖరి వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా వివిధ పార్టీల ఎంపీలు విడిపోయి ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు కోసం స్పీకర్ ను కలవడం విన్నపాలు చేయడం జరిగింది. అయితే స్పీకర్ వాటిని పరిశీలించి నిర్ణయం వెల్లడించలేదు. వీరంతా యన్డీఏకి మద్దతు ఇవ్వబోతున్నారనే వార్తల విషయంలో అధికారిక నిర్ణయాలు, స్పీకర్ గుర్తింపు లేదా ఆయా పార్టీల అధికారిక ప్రకటనలు కీలకం.ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం యన్డీఏ కూటమి బలం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం స్వతంత్రంగా రాజ్యసభలో రెండింట మూడొంతుల (2/3) మెజారిటీని కలిగి ఉందని చెప్పలేనప్పటికీ, ఆ సంఖ్యకు చాలా దగ్గరగా చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం యన్డీఏ బలం సుమారు 150 నుంచి 152 మంది సభ్యుల వరకు చేరినట్లు అంచనాలు ఉన్నాయి. పూర్తి సభ్యుల సంఖ్య, ఖాళీలు వంటి అంశాలను బట్టి రెండింట మూడొంతుల మెజారిటీకి అవసరమైన సంఖ్య మారుతుంది. సాధారణంగా 245 సభ్యుల సభను పరిగణనలోకి తీసుకుంటే సుమారు 163 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. అందువల్ల యన్డీఏ ఇంకా స్వతంత్రంగా ఆ సంఖ్యను దాటలేదు.అయితే ఏ కూటమికీ చెందకుండా తటస్థంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తే ఆ సంఖ్యను సులభంగా చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్కు చెందిన సభ్యుల సహకారం లభిస్తే ప్రభుత్వం మరింత బలపడే అవకాశముందని చర్చ జరుగుతోంది.
లోక్సభలో యన్డీఏ ఇప్పటికే స్పష్టమైన మెజారిటీతో అధికారంలో ఉంది. దీనికి అదనంగా ప్రతిపక్ష పార్టీల్లో అంతర్గత విభేదాలు పెరగడం , విడిపోవడం , కొన్ని ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం ప్రభుత్వంకు అవసరమైన సందర్భాల్లో మరింత సంఖ్యాబలాన్ని సమీకరించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇటీవల మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొన్ని రాజకీయ పరిణామాలు ఈ చర్చలకు మరింత ఊతమిచ్చాయి.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)లో అంతర్గత అసంతృప్తి పెరిగి పార్టీకి చెందిన కొందరు లోక్సభ సభ్యులు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్గా గుర్తించాలని స్పీకర్ను కోరినట్లగా తెలుస్తోంది.ఈ అంశంపై తుది అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ పరిణామం ప్రతిపక్ష ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లోనూ అసంతృప్తి నెలకొని కొందరు ఎంపీలు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు కోరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాలపై అధికారిక ధృవీకరణ లేదా పార్లమెంట్ నుంచి తుది నిర్ణయం వెలువడలేదు. అందువల్ల వీటిని నిర్ధారిత రాజకీయ పరిణామాలుగా కాకుండా, ఊహాత్మక రాజకీయ పరిణామాలుగా మాత్రమే చూడాలి.
తమిళనాడులో డియంకె ఎంపీలు కాంగ్రెస్ సభ్యుల నుంచి వేరుగా కూర్చునేందుకు ప్రత్యేక సీటింగ్ బ్లాక్ కోరినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇది కూటమి రాజకీయాల్లో వ్యూహాత్మక చర్య మాత్రమేనా? లేక ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలకు సంకేతమా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.సీటింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా రాజకీయ విడిపోవడాన్ని సూచించవని కూడా గుర్తుంచుకోవాలిఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన వార్తలను కలిపి చూస్తే ప్రతిపక్ష కూటమిలో సమన్వయం బలహీనపడుతోందనే అభిప్రాయం కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్రలో పార్టీ అంతర్గత సమస్యలు, పశ్చిమ బెంగాల్లో అసంతృప్తి వార్తలు, తమిళనాడులో ప్రత్యేక పార్లమెంటరీ గుర్తింపు చర్చలు ఇవన్నీ కలిసి జాతీయ రాజకీయాల్లో పునర్వ్యవస్థీకరణకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రచారాలను ఖండిస్తున్నాయి ,అతిశయోక్తిగా అభివర్ణిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిణామాలపై తుది రాజకీయ ప్రభావం పార్లమెంట్ సమావేశాల తర్వాతే స్పష్టమవుతుంది.
రెండింటమూడొంతుల మెజారిటీ ఎందుకు కీలకం?
సాధారణ బిల్లులకు సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో సాధారణ మెజారిటీ సరిపోతుంది.
అయితే రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటువంటి బిల్లులు ఆమోదం పొందాలంటే సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికి పైగానే మద్దతు ఉండాలి. హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం రెండింటమూడొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం, తటస్థ పార్టీలు ఓటింగ్లో ప్రభుత్వానికి సహకరించడం వంటి అంశాలు కూడా కీలకంగా మారతాయి.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ముందుకు తీసుకురావచ్చని చర్చ జరుగుతున్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
జమిలి ఎన్నికల బిల్లు,యూనిఫాం సివిల్ కోడ్ బిల్ల, మహిళా రిజర్వేషన్ అమలుకు అవసరమైన తదుపరి చర్యలు ,జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రాజ్యాంగ సవరణలు అవసరమయ్యే అంశాలుఅయితే వీటిలో ఏ బిల్లులు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారు, ఏవి తరువాతి దశకు వెళ్తాయి అనే విషయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుంది.గత పదేళ్లలో యన్డీఏ ప్రభుత్వంకు లోక్సభలో బలమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో కొన్ని కీలక చట్టాల విషయంలో సవాళ్లను ఎదుర్కొంది.
ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు యన్డీఏ బలం పెరుగుతుండగా, మరోవైపు ప్రతిపక్ష కూటమిలో సమన్వయం తగ్గుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.అయితే రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారుతుంటాయి.ఊహాగానాలు అధికారిక నిర్ణయాలు రెండూ ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఎంపీల చీలికలు, మద్దతు మార్పులు వంటి అంశాలు అధికారికంగా ఖరారైన తర్వాతే వాటి ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయడం సాధ్యమవుతుంది.
ఈసారి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు(Parliament Monsoon Session 2026) సాధారణ సమావేశాలుగా కాకుండా, దేశ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక సమావేశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభలో యన్డీఏ సంఖ్యాబలం పెరగడం, తటస్థ పార్టీల వైఖరి, ప్రతిపక్ష కూటమిలో కనిపిస్తున్న విభేదాల నేపథ్యంలో ప్రభుత్వం గతంలో నిలిచిపోయిన కీలక సంస్కరణలపై ముందడుగు వేయాలని భావిస్తోందనే చర్చ బలపడుతోంది.అయితే చివరికి నిర్ణయాత్మక అంశం పార్లమెంట్లో జరిగే వాస్తవ ఓటింగ్, సభ్యుల హాజరు, ఆయా పార్టీల అధికారిక వైఖరే అవుతుంది. అందువల్ల రాజకీయ ఊహాగానాల కంటే పార్లమెంటరీ ప్రక్రియలో జరిగే పరిణామాలే దేశ భవిష్యత్ చట్ట నిర్మాణాన్ని నిర్ణయించనున్నాయి.
నిలిచిపోయిన అనేక కీలక సంస్కరణలను ఈసారి పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రంలోని యన్డీఏ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో యన్డీఏకి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, రాజకీయంగా అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అందువల్ల ఈ వర్షాకాల సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదానికే కాదు, రానున్న సంవత్సరాల జాతీయ రాజకీయాల దిశను నిర్ణయించే పరీక్షగా నిలిచే అవకాశముంది. ప్రభుత్వం తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేస్తుందా? లేక ప్రతిపక్షం చివరి నిమిషంలో ఐక్యతను ప్రదర్శిస్తుందా? అన్నదే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాన ప్రశ్నగా మారింది. శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ముగిసేనాటికి వీటన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. Parliament
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి


















