సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. మరో 22 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
సోమవారం సిగాచి పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి కొందరు కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఘటన జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 16 మంది తుదిశ్వాస విడిచారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 11 మందిని ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో అక్కడ హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయి.
ఈ దుర్ఘటనలో సిగాచి ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆయన తన కారులో ప్లాంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే పేలుడు సంభవించడంతో ఆ ప్రమాద ధాటికి ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది.
ప్రమాద బాధితులు, వారి కుటుంబసభ్యుల సహాయార్థం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల వివరాల కోసం 08455276155 నంబరును సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రులు స్పందించారు. ప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.
గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే పౌడర్ను తయారు చేస్తారని, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయని ఆయన వివరించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్షించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. కార్మికులు అధిక పని గంటలపై ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే… పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే, ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఈ పెను విస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. సమీపంలోని మరో భవనానికి కూడా బీటలు వారాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుని భయానక వాతావరణం నెలకొంది.
పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని బండి సంజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అంది, వారు త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ వివరించారు.