రాష్ట్రంలో సుపరిపాలన, వేగవంతమైన పరిపాలనా సంస్కరణలు, ప్రజలకు పారదర్శక సేవలందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ-ఆఫీస్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి శాఖలో ఆన్లైన్ సేవలను బలోపేతం చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సేవల్లో జాప్యానికి తావు లేకుండా డిజిటల్ పరిపాలనను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని, ప్రతి ఉద్యోగి పనితీరును ఆన్లైన్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. పనితీరులో ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే వాటిని సరిదిద్దే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరగాలంటే సేవలు వేగంగా, నాణ్యతతో అందాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా కోస్తా జిల్లాల్లో ఆక్వా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి, పోర్టుల ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న సహజ ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని సీఎం తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, చీమకుర్తి గ్రానైట్ వంటి విలువైన ఖనిజాలకు వాల్యూ అడిషన్ చేసే పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. కేవలం ముడి ఖనిజాలను ఎగుమతి చేయడం కాకుండా, వాటితో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కోసం ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెంచడం, స్థూల రాష్ట్ర ఆర్థికోత్పత్తి (జీఎస్డీపీ)లో గణనీయమైన వృద్ధిని సాధించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రతి శాఖ ఈ విజన్కు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
పరిపాలనలో నిరంతర సమీక్ష ఎంతో అవసరమని పేర్కొన్న సీఎం, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తూ జిల్లాల పనితీరును సమీక్షిస్తున్నామని తెలిపారు. అలాగే జీఎస్డీపీ పురోగతి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని చెప్పారు. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా పనితీరును అంచనా వేస్తున్నామని వివరించారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు, 57 కేబినెట్ సమావేశాలు నిర్వహించి పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, తయారీ యూనిట్లు, సేవారంగ సంస్థలు స్థాపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని సీఎం పేర్కొన్నారు. ఆ కాలంలో అనేక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
ప్రభుత్వం రూపొందించే ప్రతి విధానం చివరకు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి ఫైల్ను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో అవినీతికి తావు లేకుండా పారదర్శక పరిపాలనను అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఆక్వా, ఖనిజ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక పురోగతి కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యం సాధ్యమవుతుందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
శ్రీశైలం మల్లన్న, తిరుపతి వేంకటేశ్వరుడిని కలిపే అద్భుత ఘట్టం.. ఈ ఏడాదిలోనే సాకారం! – సీఎం చంద్రబాబు
EGovernance


















