*క్రీడాస్ఫూర్తికి కదిరి చిరునామా…*
చదువులతో పాటు క్రీడల్లోనూ జాతీయ స్థాయికి ఎదుగుతున్న చిన్నారులు.
నేటి సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువగా చదువులు, ర్యాంకులు, పోటీ పరీక్షల చుట్టూనే తిరుగుతూ కాలం గడుపుతున్నారు. ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అత్యంత అవసరమైన క్రీడలు, వ్యాయామం పట్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన క్రీడా వసతులు కూడా పరిమితంగానే ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో కూడా అంతంత మాత్రమే వసతులున్నాయి .అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కదిరి పట్టణంలోని సి.ఆర్.సి కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కందికుంట ఇండోర్ స్టేడియం ఎంతోమంది చిన్నారుల కలలకు వేదికగా మారింది. ఇక్కడ కూడా తగిన సౌకర్యాలు లేవు.అయినా పట్టువదలక మెుక్కవోని ధైర్యం తో ముందుకు సాగడం విశేషం. మెంటార్ లేరు . కోచ్ లేరు . తగిన క్రీడా వసతులు లేవు. అయినా పిల్లలు బాడ్మింటన్ లో దూసుకుపోతున్నారు.
బుడిబుడి అడుగులతో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన చిన్నారులు నేడు రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో హేమాహేమీలతో పోటీ పడుతూ విజేతలుగా, రన్నరప్లుగా నిలుస్తూ కదిరి పేరును దేశవ్యాప్తంగా చాటుతున్నారు. కఠినమైన సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, సి.ఆర్.సి కమిటీ సహకారం కలిసి ఈ విజయ గాథను సృష్టిస్తున్నాయి.
ఈ క్రీడాకారుల ఎదుగుదలలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న సహకారం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారుల కోచింగ్,కాక్స్, ఇతర క్రీడా అవసరాల కోసం ఆయన వ్యక్తిగతంగా ప్రతి నెల రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తూ యువ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి, ప్రోత్సాహం నిజంగా అభినందనీయం. ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం వల్ల ఎంతోమంది చిన్నారులకు నూతన ఉత్సాహం కలుగుతోందని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఈ విజయయాత్ర వెనుక నిలిచిన సి.ఆర్.సి కమిటీ సభ్యుల సేవలు కూడా ప్రశంసనీయం. సరైన వేదిక, అవసరమైన సదుపాయాలు, క్రీడా వాతావరణం కల్పిస్తూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటికి తోడు వెంకట హర్షిత్ సాయి తండ్రి నాగభూషణం తన ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వదులుకొని చిత్తశుద్ధితో పిల్లలకు కోచింగ్ ఇస్తూ ప్రోత్సాహం అందించడం విశేషం.
*జాతీయ స్థాయిలో మెరిసిన హర్షిత్ వెంకట సాయి*
ఇటీవల గోవాలో నిర్వహించిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్న అంగజాల హర్షిత్ వెంకట సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. డబుల్స్ విభాగంలో దేశంలో నెంబర్-1 విజేతగా నిలవడమే కాకుండా, భారత ర్యాంకింగ్స్లో 4వ స్థానాన్ని సాధించడం విశేషం. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న హర్షిత్ సాయి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
హర్షిత్ వెంకట సాయి
2022లో బెంగళూరులో నిర్వహించిన పీఎన్బీ మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అండర్-9 విభాగంలో ఆల్ ఇండియా విజేత.
2024లో ఒంగోలులో జరిగిన ఏపీ రాష్ట్ర మినీ ఛాంపియన్షిప్ అండర్-11విభాగంలో రాష్ట్ర నంబర్-1. మే 2026లో గోవాలో జరిగిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ నేషనల్ టోర్నమెంట్లో డబుల్స్లో 1వ స్థానం, సింగిల్స్లో క్వార్టర్ ఫైనలిస్ట్.ప్రస్తుతం భారత ర్యాంకింగ్స్లో 4వ స్థానం సంపాదించాడు.
హర్షిత్ విజయాల వెనుక అతని తండ్రి నాగభూషణ, తల్లి అందించిన అండదండలు ఎంతో గొప్పవి. పిల్లల ప్రతిభను గుర్తించి, నిరంతరం ప్రోత్సహిస్తూ క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిందే.
*విజయపథంలో కాటం ఈశ్వర్ సాయి*
చిన్న వయసులోనే జాతీయ, రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న మరో క్రీడాకారుడు కాటం ఈశ్వర్ సాయి. ముఖ్యంగా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో అతను చూపుతున్న ప్రతిభ విశేషం. ఈశ్వర్ సాయి
2023లో ఆల్ ఇండియా అండర్-13 విభాగంలో డబుల్స్లో రన్నరప్. కర్ణాటక రాష్ట్ర ఛాంపియన్షిప్లలో పలుమార్లు విజేతగా నిలిచాడు. 2025లో బాలుర సింగిల్స్లో రన్నరప్. అండర్-15 విభాగంలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అనేక టైటిల్స్ సాధించారు.
68వ జాతీయ పాఠశాల క్రీడల్లో అండర్-14 బాలుర విభాగంలో రన్నరప్.
అండర్-17 విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ లో 35 స్థానంలో నిలిచాడు.కర్నాటక
అండర్ 19 విభాగంలో మిక్స్ డ్ డబుల్స్ లో రన్నరప్. ఈశ్వర్ సాయి నిరంతర కృషి, తండ్రి కాటం కిరణ్ పట్టుదల అతడిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని క్రీడాభిమానులు , శ్రేయోభిలాషులు విశ్వసిస్తున్నారు.
*ప్రతిభతో ఆకట్టుకుంటున్న మురారి వెంకట్*
కదిరి నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న మరో ప్రతిభావంతుడు మురారి వెంకట్. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు.
మురారి వెంకట్ 2022లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ రాష్ట్ర స్థాయి అండర్ 14విభాగంలో 3వ స్థానం.
2023లో ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి 1వ స్థానంలో నిలిచారు. 2023లో జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14విభాగంలో 5వ స్థానంలో నిలిచారు. 2025లో ఏపీ రాష్ట్ర ఛాంపియన్షిప్లో 3వ స్థానం.2026లో ఆల్ ఇండియా ర్యాంకింగ్స్లో 35వ స్థానం సంపాదించాడు. తండ్రి విజయ్ కుమార్ ప్రోత్సాహం , వెంకట్ మురారి సాధన , అంకితభావం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.
క్రీడలను ప్రోత్సహిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజంతయారౌతుంది.
చదువులతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని కదిరి చిన్నారులు నిరూపిస్తున్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాదు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సి.ఆర్.సి కమిటీ అందిస్తున్న వేదిక, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న ఆర్థిక సహాయం కలిసి నేటి చిన్నారులను రేపటి జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
వారిని వెన్నంటి నిలబెడుతున్న తల్లిదండ్రులకు అభినందనలు.
క్రీడల అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి, సి.ఆర్.సి కమిటీ సభ్యులకు క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కదిరి నుంచి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
*కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం*
జిల్లా కలెక్టర్, యువజన మరియు క్రీడా శాఖ అధికారులు కదిరి పట్టణంలో మరింత మెరుగైన క్రీడా వసతులు కల్పించి, యువ క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిమిత వనరులతోనే క్రీడాకారులు విశేష విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, సరైన ఇండోర్ స్టేడియాలు, ఆధునిక కోర్టులు, శిక్షణా సదుపాయాలు, ఫిట్నెస్ సెంటర్లు, నిపుణులైన కోచ్లు, ప్రయాణ భత్యాలు వంటి సౌకర్యాలు కల్పిస్తే కదిరి క్రీడారంగంలో ఒక ప్రత్యేక కేంద్రంగా నిలిచే సామర్థ్యం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలంటే ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకు రావాలి. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా యువత భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా భావించి ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే సి.ఆర్.సి కమిటీ, తల్లిదండ్రులు, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందిస్తున్న సహకారం ఫలితంగా కదిరి చిన్నారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగురవేసే క్రీడాకారులు కదిరి నుంచే వెలువడటం ఖాయం అని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చందమూరి నరసింహరెడ్డి. జర్నలిస్ట్.
ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.
కదిరి.


















