తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచ స్థాయి అభివృద్ధి దిశగా మలచేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి Revanth Reddy తెలిపారు. అభివృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, విమర్శలు సహజమే అయినప్పటికీ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుంటాం కానీ అభివృద్ధి ఆగదు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కాంక్లేవ్లో సీఎం పాల్గొని రాష్ట్ర భవిష్యత్తుపై సమగ్ర దృక్పథాన్ని వివరించారు. తెలంగాణను కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
“ప్రభుత్వాలు మారొచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు మారకూడదు. ప్రతి ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుంది” అని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు తాత్కాలిక ప్రణాళికలతోనే ముందుకు వెళ్లాయని, కానీ తెలంగాణ మాత్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు.
#TelanganaRising2047 విజన్ డాక్యుమెంట్పై మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి నిపుణులు, ఆర్థికవేత్తలు, మేధావులు, పరిశ్రమల ప్రతినిధులు, యువత అభిప్రాయాలను సేకరించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను అత్యాధునిక మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, విద్యా వ్యవస్థ, ఆరోగ్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ కులగణన, అమరవీరుల కుటుంబాలకు గౌరవం, తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నమైన “జయ జయహే తెలంగాణ” గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు వంటి అంశాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చర్యలని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందన్నారు. తుమ్మడిహెట్టి, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి మాట్లాడుతూ… ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో జనాభా తీవ్రంగా పెరిగిందని, ట్రాఫిక్, కాలుష్యం, చెరువుల ఆక్రమణలు, డ్రైనేజీ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే #CURE పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ప్రత్యేక #HILT పాలసీ అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
MusiRejuvenation కార్యక్రమంపై సీఎం ప్రత్యేకంగా స్పందించారు. మూసీ నది పునరుద్ధరణ తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించి నగరానికి కొత్త రూపు తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. “ప్రకృతిని కాపాడకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడతాయి” అని హెచ్చరించారు.
BharatFutureCity ప్రాజెక్ట్పై మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మెట్రో రైలు విస్తరణ, రింగ్ రోడ్లు, ఎయిర్పోర్టు కనెక్టివిటీ, ఐటీ కారిడార్లు, పరిశ్రమల హబ్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే భారీ పెట్టుబడులు వస్తాయని వివరించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
మహిళా సాధికారత విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని సీఎం వివరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువుకు ఇది ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కూడా సీఎం దృష్టి పెట్టారు. మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మాధ్యమం, ఆధునిక బోధనా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ తగ్గడం ప్రభుత్వానికి పెద్ద విజయమన్నారు.
“రాజకీయాల్లో అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు. కానీ మెజారిటీ ప్రజల మద్దతు పొందే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. మన లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు” అని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణను ప్రపంచంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
RevanthReddy


















