రాజకీయ విలువలు ఎక్కడ పాతిపెట్టబడ్డాయి?
భారత్ – పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగినప్పుడు, జనసంఘ్ పార్టీ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ సిమ్లా ఒప్పందం గురించి వివరించడానికి అటల్ బిహారీ వాజపేయిని ఆహ్వానించారు.సమావేశం ముగిసాక వారు మాట్లాడుకుంటూ లాన్ లో నడుస్తూండగా చిన్న వాన జల్లు మొదలయ్యింది. ఎవరో ఒక అధికారి ప్రధానమంత్రి శ్రీమతి గాంధీకి గొడుగు ఇచ్చారు. శ్రీమతి గాంధీ ఇలా వాజపేయికి గొడుగు పట్టారు.భిన్న సైద్ధాంతిక భావాలు కలిగి ఉండటం వేరు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారిని గౌరవించడం వేరు. అప్పట్లో గౌరవాలు ఇచ్చి పుచ్చుకునే పద్ధతి బలంగా ఉండేది.
( అని ఈ ఫోటోను చూసిన తర్వాత మిత్రులు సోమసుందర్ Somasundar Dusanapudi ఈ నేపథ్యాన్ని కామెంట్లో పంపారు. మిగతా అందరి కోసం ఇక్కడ షేర్ చేశాను.)
పెద్దలు నాగసూరి వేణుగోపాల్ గారి ఫేస్ బుక్ వాల్ లో పైన పేర్కొన్న సమాచారం చదివిన తర్వాత నేటి రాజకీయ పరిస్థితులపై రాయాలనిపించి రాసిన సమాచారం.భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు… భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు… కానీ మనిషిని గౌరవించే సంస్కారం మాత్రం ఎందుకు చచ్చిపోతోంది?రాజకీయాలు అంటే ప్రజాసేవ. సిద్ధాంతాల మధ్య పోటీ. విధానాలపై వాదన. ప్రజల భవిష్యత్తుపై చర్చ. అధికారాన్ని ఎవరు చేపట్టాలన్నది ప్రజల తీర్పుకు వదిలే ప్రజాస్వామ్య ప్రక్రియ.కానీ నేటి రాజకీయ దృశ్యాన్ని చూస్తుంటే ఒక ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంటోంది—రాజకీయాలు ప్రజల కోసం జరుగుతున్నాయా? లేక వ్యక్తిగత ప్రతీకారాల కోసం జరుగుతున్నాయా?
ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు సభలో తీవ్రంగా విమర్శించుకున్నా, సభ వెలుపల పరస్పరం గౌరవించుకునే సంస్కారం ఉండేది. సిద్ధాంతాలపై యుద్ధం చేసేవారు.. వ్యక్తులపై కాదు. ఓడించిన ప్రత్యర్థిని అవమానించడం కాదు.. అతని రాజకీయ అనుభవాన్ని గౌరవించడం ఒక విలువగా ఉండేది. రాజకీయ విభేదాలు శాశ్వత శత్రుత్వాలుగా మారేవి కావు.ఇప్పుడు పరిస్థితి మారింది. విమర్శకు హద్దులు చెరిగిపోయాయి. విధానాలపై చర్చను వ్యక్తిగత దూషణలు ఆక్రమించాయి. నాయకులపై విమర్శలు వారి కుటుంబ సభ్యుల వరకు వెళ్లాయి. అసభ్య పదజాలం రాజకీయ ఆయుధంగా మారింది. సోషల్ మీడియా వేదికలు వాదనలకు కాకుండా బురదజల్లే ప్రచారానికి వేదికలవుతున్నాయి. ఇది రాజకీయ పోటీ కాదు.ఇది విలువల పతనానికి నిదర్శనం.
ప్రత్యర్థి తప్పును ఎత్తిచూపడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించడం ఏ ప్రజాస్వామ్య విలువ?
ప్రజాప్రతినిధి నిర్ణయాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు. కానీ వ్యక్తిగత జీవితాన్ని తవ్వి, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఏ రాజకీయ సంస్కృతి?ప్రశ్నించాలి. కానీ హద్దు దాటకూడదు.విమర్శించాలి. కానీ అవమానించకూడదు.పోరాడాలి. కానీ వ్యక్తిత్వాన్ని హత్య చేయకూడదు.
రాజకీయాల్లో సిద్ధాంతాలు బలహీనపడిన కొద్దీ వ్యక్తిపూజ పెరుగుతుంది. వ్యక్తిపూజ పెరిగిన కొద్దీ ప్రశ్నించే గొంతులు మూగబడతాయి. ప్రశ్నలు మూగబడిన చోట ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది.ఇంకో ప్రమాదకర పరిణామం ప్రజా సమస్యలు రాజకీయ రంగస్థలం వెనుకకు నెట్టబడటం.రైతు సమస్య ఏమైంది?నిరుద్యోగ యువత భవిష్యత్తు ఎక్కడుంది?ధరల పెరుగుదలపై చర్చ ఎక్కడుంది?ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పరిస్థితిపై పోరాటం ఎక్కడుంది?వెనుకబడిన ప్రాంతాలకు పరిశ్రమలు, మౌలిక వసతులు ఎప్పుడు వస్తాయి?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన రాజకీయ వేదికల్లో ఎవరు ఎవరిని తిట్టారు? ఎవరు ఎవరిపై ఆరోపణలు చేశారు? ఎవరి కుటుంబాన్ని ఎవరు ప్రస్తావించారు? అనే చర్చలు పెరుగుతున్నాయి.
ప్రజల సమస్యలు పక్కకు వ్యక్తిగత రాజకీయాలు ముందుకు! ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అధికారం సేవకు సాధనం కావాలి. కానీ అధికారం స్వార్థానికి సాధనంగా మారితే ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగినట్టే. పదవి కోసం సిద్ధాంతాలు మార్చుకోవడం, ప్రయోజనం కోసం మాట మార్చుకోవడం, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.అయితే తప్పు రాజకీయ నాయకులదేనా? కాదు. సమాజం కూడా తనను తాను ప్రశ్నించుకోవాలి. తమ నాయకుడు తప్పు చేసినప్పుడు ప్రశ్నించకుండా, ప్రత్యర్థి తప్పు చేసినప్పుడు మాత్రమే గర్జించే కార్యకర్తలూ బాధ్యత వహించాలి. అసభ్య వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టే అభిమానులూ ఆలోచించాలి. నిరాధార ఆరోపణలను పరిశీలించకుండా పంచుకునే సోషల్ మీడియా వినియోగదారులూ తమ పాత్రను గుర్తించాలి.
మనకు నచ్చిన నాయకుడు తప్పు చేస్తే అది వ్యూహం నచ్చని నాయకుడు చేస్తే అది నేరం అనే ద్వంద్వ ప్రమాణం ఉన్నంతకాలం రాజకీయ విలువలు బతకవు.ప్రజాస్వామ్యంలో నాయకుడు దేవుడు కాదు. ప్రత్యర్థి శత్రువు కాదు. ఇద్దరూ ప్రజల తీర్పుకు లోబడిన ప్రజాప్రతినిధులే.
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు పెరిగితే పరిపాలన ప్రతీకార రాజకీయాలకు బలవుతుంది. ప్రతీకారం రాజకీయ విధానంగా మారితే అభివృద్ధి వెనుకబడుతుంది. అభివృద్ధి వెనుకబడితే నష్టపోయేది పార్టీ కాదు ప్రజలే.
అందుకే రాజకీయ పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియాకు, సోషల్ మీడియా వేదికల వినియోగదారులకు ఒకే ప్రశ్న. మన రాజకీయ ప్రత్యర్థిని ఓడించాలనుకుంటున్నామా? లేక అతన్ని నాశనం చేయాలనుకుంటున్నామా? ఓటుతో ఓడించడం ప్రజాస్వామ్యం.
దూషణలతో కించపరచడం రాజకీయ పతనం. విధానాలతో పోటీ పడటం నాయకత్వం.కుటుంబాలను లాగడం నీచత్వం. ప్రజల కోసం అధికారాన్ని కోరడం సేవ.అధికారం కోసం ప్రజలను ఉపయోగించుకోవడం స్వార్థం.రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం ప్రజాస్వామ్యానికి బలం. భిన్నాభిప్రాయాలను సహించలేకపోవడం ప్రజాస్వామ్య బలహీనత.
ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమను తాము అద్దంలో చూసుకోవాలి. నాయకులు తమ భాషను సరిదిద్దుకోవాలి. కార్యకర్తలు తమ ప్రవర్తనను మార్చుకోవాలి. మీడియా వ్యక్తిగత రగడల కంటే ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు కూడా తిట్టే నాయకుడిని కాదు తమ సమస్యను పరిష్కరించే నాయకుడిని ఎన్నుకునే స్థాయికి ఎదగాలి.ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల రోజున వేసే ఓటు కాదు. ప్రశ్నించే ధైర్యం. విమర్శను భరించే సంస్కారం. ప్రత్యర్థిని గౌరవించే నాగరికత.ప్రజా సమస్యలను ముందుకు తెచ్చే బాధ్యత.ఇవి లేని రాజకీయాలు ఎంత పెద్ద మెజారిటీ సాధించినా, ఎంత గొప్ప పదవులు సంపాదించినా, చివరకు ఖాళీ అధికార ప్రదర్శనగానే మిగిలిపోతాయి.
రాజకీయాల్లో ప్రత్యర్థులు మారవచ్చు. పార్టీలు మారవచ్చు. ప్రభుత్వాలు మారవచ్చు. కానీ విలువలు మాత్రం చనిపోతే ప్రజాస్వామ్యమే అనాథ అవుతుంది. అందుకే ఈ ప్రశ్నను ప్రతి రాజకీయ నాయకుడి గుమ్మం ముందు నిలబెట్టాల్సిన సమయం వచ్చింది. మీరు ప్రజల కోసం రాజకీయాల్లో ఉన్నారా? లేక మీ ప్రత్యర్థిపై పగ తీర్చుకోవడానికి రాజకీయాలను ఉపయోగిస్తున్నారా?
ప్రజలు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలి.
మన నాయకుడి జెండా కాపాడుతున్నామా లేక మన ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నామా?
సమాధానం చెప్పాల్సింది నాయకులు మాత్రమే కాదు. మనమందరం.
ఎందుకంటే రాజకీయ విలువల పతనం ఎక్కడో అసెంబ్లీలో మొదలవదు.
మన మౌనంతోనే మొదలవుతుంది.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.
PoliticalValues


















