రైతు భరోసాతో రైతు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy)ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి రైతు భరోసా పథకం తొలి విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2,482.02 కోట్లను జమ చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
మొదటి విడతలో ఒక ఎకరం వరకు సాగు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు జమ చేయగా, రెండు ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం 41.37 లక్షల మంది రైతులు తొలి విడతలో ప్రయోజనం పొందుతున్నారు.
ఈ వానాకాలం సాగు సీజన్లో మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను దశలవారీగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయడం ద్వారా పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అరుంధతి సినిమాలో పశుపతిని ఎలా బంధించారో, అలాగే ఆ పశుపతిని ఫామ్ హౌస్లో బంధించాం. ఆ గొలుసులు మళ్లీ తెరుచుకునే పరిస్థితి లేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశంగా మారాయి.
ఉచిత విద్యుత్ పథకంపై కూడా సీఎం స్పందిస్తూ, రైతులకు ఉచిత కరెంట్ అందించాలనే ఆలోచనను మొదట తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్తో పాటు విద్యుత్ బకాయిల రద్దుపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ తమ పార్టీ సిద్ధాంతమని, దానిపై ఇతర పార్టీలు రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ, అప్పుల్లేని రాష్ట్రాన్ని నిర్మించామని చెప్పిన గత ప్రభుత్వం ఉద్యోగులకు కూడా సమయానికి జీతాలు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. ఏడు లక్షల మంది ఉద్యోగుల జీతాలు వాయిదాల్లో వచ్చాయని, అదే వారు చెప్పిన “బంగారు తెలంగాణ” అసలు రూపమని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతు సంక్షేమమే తమ పాలనకు మూలస్తంభమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “వ్యవసాయం అంటే దండగ కాదు… అది పండగ. అన్నదాతలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన మార్కెట్లు అభివృద్ధి చేయకుండా, గ్రామాల్లో బెల్ట్ షాపులు పెరిగే పరిస్థితులు తీసుకువచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంచడం, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడం, పెట్టుబడి సాయం అందించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు.
రైతుల సమస్యలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నాయకులు సభకు వచ్చి చర్చించాలంటూ సీఎం సవాల్ విసిరారు. గతంలో ఎవరు రైతుల కోసం ఏమి చేశారో, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏమి చేస్తోందో ప్రజల ముందే చర్చిద్దామని అన్నారు.
తెలంగాణ (Telangana)ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించి, సాగు ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దశలవారీగా మిగిలిన రైతులందరికీ కూడా నిధులు జమ చేసి, ప్రతి అర్హ రైతుకు ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


















