*హుందాతనం కోల్పోతున్న రాజకీయాలు దేనికి సంకేతం?*
*గత నాయకుల ఆదర్శాలను పునరుద్దరించలేమా?*
ప్రజాస్వామ్యం బలపడాలంటే చట్టాలు మాత్రమే కాదు వాటిని రూపొందించే ప్రజాప్రతినిధుల విలువలు, సంస్కారం, హుందాతనం కూడా బలంగా ఉండాలి.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా చట్టసభల్లో అడుగుపెట్టే ప్రజాప్రతినిధులు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు. వారు ప్రజల గొంతుక. సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక. అలాంటి ప్రజాప్రతినిధుల మాట, ప్రవర్తన, సంస్కారం ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందుకే ప్రజల తరపన మాట్లాడే ప్రతి మాటలో బాధ్యత ఉండాలి. ప్రతి విమర్శలో హుందాతనం ఉండాలి. ప్రతి వాదనలో ప్రజాహితం ప్రతిబింబించాలి.
శాసనసభలు ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతికే వేదికలుగా ఉండాలి గానీ, వ్యక్తిగత విమర్శలు, పరస్పర దూషణలు, రాజకీయ విద్వేషాలకు కేంద్రాలుగా మారకూడదు. ప్రజాస్వామ్యం బలపడాలంటే చట్టాలు మాత్రమే కాదు వాటిని రూపొందించే ప్రజాప్రతినిధుల విలువలు, సంస్కారం, హుందాతనం కూడా బలంగా ఉండాలి.”
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా చట్టసభల్లో అడుగుపెట్టే ప్రజాప్రతినిధులు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు. వారు ప్రజల గొంతుక. సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక. అలాంటి ప్రజాప్రతినిధుల మాట, ప్రవర్తన, సంస్కారం ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందుకే ప్రజల తరపున మాట్లాడే ప్రతి మాటలో బాధ్యత ఉండాలి. ప్రతి విమర్శలో హుందాతనం ఉండాలి. ప్రతి వాదనలో ప్రజాహితం ప్రతిబింబించాలి.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే చట్టసభలు నిజమైన ప్రజాస్వామ్య చర్చలకు వేదికలుగా నిలిచేవి. అధికారపక్షం అయినా, ప్రతిపక్షం అయినా ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా ఉండేవి. సభలో ఒక ప్రజాప్రతినిధి మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు? ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు? ఎలాంటి ప్రత్యామ్నాయాలను సూచిస్తారు? అనే ఆసక్తితో సభ్యులంతా శ్రద్ధగా వినేవారు.
ఆ రోజుల్లో అధికారపక్షం ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే ప్రజా సమస్యలపై స్పందించేది. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించేది. విమర్శలు వ్యక్తులపై కాకుండా విధానాలపై ఉండేవి. మాటల్లో పదును ఉండేది కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే భాష ఉండేది కాదు. వ్యంగ్యం ఉండేది కానీ అది హాస్యంతో మేళవించి సభను నవ్వించేదే తప్ప అవమానించేది కాదు. సున్నితమైన అంశాలను కూడా అత్యంత సంయమనంతో సభ దృష్టికి తీసుకువచ్చేవారు. సభా మర్యాదలు, ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవం అన్నవి అప్పటి నాయకుల వ్యక్తిత్వంలో భాగంగా ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఎన్.జి. రంగా, పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, తెన్నేటి విశ్వనాథం, జైపాల్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, జె. చొక్కారావు, బూర్గుల రామకృష్ణారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహరావు, టి. అంజయ్య, వెంకయ్య నాయుడు, విద్యాసాగర్ రావు, వంటి నాయకులు తమ వాగ్ధాటి, విషయపరిజ్ఞానం, సభా సంప్రదాయాల పట్ల నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరిలో కొందరు శాసనసభ కంటే పార్లమెంట్ లేదా ఇతర రాజ్యాంగ పదవుల్లో ఎక్కువకాలం సేవలందించినప్పటికీ, ప్రజాస్వామ్య చర్చల నాణ్యతపై వారి ప్రభావం విశేషంగా నిలిచింది.
కానీ గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల స్వరూపం గణనీయంగా మారిపోయింది. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. విధానపరమైన చర్చల స్థానంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరస్పర ఆరోపణలు పెరిగిపోయాయి. వైసీపీ, టిడిపి పార్టీలో కొందరు నాయకులు మాట్లాడే మాటలు , వారి ప్రవర్తనతీరు సభ్య సమాజం సిగ్గుతో తల దించుకొంటున్న పరిస్థితి నెలకొంది. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ వారి కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, వ్యక్తిగతంగా అవమానించడం ప్రజాస్వామ్య సంస్కృతికి ఏమాత్రం శోభనివ్వదు.
అదే సమయంలో కుల రాజకీయాలు, ప్రాంతీయ భావజాలం, సామాజిక విభజనలను రెచ్చగొట్టే ధోరణులు కూడా పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులే కొన్నిసార్లు సమాజంలో విభేదాలను మరింత పెంచేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నాయకుల మాటలు సభ గోడల మధ్యే ఆగిపోవు. అవి సమాజంలోకి వెళ్తాయి. యువతను ప్రభావితం చేస్తాయి. రాజకీయ సంస్కృతిని తీర్చిదిద్దుతాయి.
అందుకే ఈ పరిస్థితుల్లో గత తరం నాయకుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు చట్టసభల్లో ఎలా చర్చించేవారు? ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించేవారు? అధికారాన్ని ఎలా ప్రశ్నించేవారు? విమర్శలను ఎంత హుందాగా వ్యక్తం చేసేవారు? సభా మర్యాదలను ఎలా పాటించేవారు? వంటి అంశాలపై నేటి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మాజీ శాసనసభ్యులు, పార్లమెంటేరియన్లు, రాజ్యాంగ నిపుణులు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన ఉన్న ప్రముఖులతో చర్చలు నిర్వహించి కొత్తతరం నాయకులకు మార్గనిర్దేశం చేయాలి.
రాజకీయ పార్టీల అధిష్ఠానాలు కూడా ఇందులో కీలక బాధ్యత వహించాలి. తమ నాయకులు ప్రజల ముందు ఎలా మాట్లాడాలి? ప్రత్యర్థులను ఎలా విమర్శించాలి? సభా మర్యాదలను ఎలా కాపాడాలి? అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి కచ్చితంగా అమలు చేయాలి. రాజకీయ పోటీ ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ వ్యక్తిగత విద్వేషాలు, అసభ్యత, అవమానకర సంస్కృతి మాత్రం ఎప్పటికీ ఆమోదయోగ్యం కావు.
సోషల్ మీడియా రాజకీయ ప్రచారానికి ప్రధాన వేదికగా మారింది. వేగంగా ప్రచారం పొందాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు లేదా వారి అనుచరులు సంచలన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మరింత ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతోంది. వాస్తవాల కంటే వైరల్ కావడమే ముఖ్యమనే ధోరణి పెరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.
రాజకీయ నాయకుల భాష, ప్రవర్తనను ప్రజలే తుది స్థాయిలో అంచనా వేస్తారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాలు, వ్యక్తిగత దూషణలను ప్రోత్సహించకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్యం అనేది ఎన్నికలతో ముగిసే ప్రక్రియ కాదు. ఎన్నికైన తర్వాత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధుల అసలు పరీక్ష. ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో హుందాతనం, సంస్కారం, పరస్పర గౌరవం, ప్రజాహితం అనే నాలుగు విలువలు ఎల్లప్పుడూ మార్గదర్శకాలుగా నిలవాలి. గత తరం నాయకులు మనకు అందించిన రాజకీయ సంస్కృతి ఒక చరిత్ర మాత్రమే కాదు భవిష్యత్తుకు దిక్సూచి కూడా. ఆ స్పూర్తిని తిరిగి వెలికితీసి నేటి రాజకీయాల్లో నాటగలిగితేనే ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం దక్కుతుంది. చట్టసభలు మళ్లీ ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతికే పవిత్ర వేదికలుగా మారతాయి.
హుందాతనం వ్యక్తిలో ఉంటేనే రాజకీయాలకు గౌరవం వస్తుంది . రాజకీయాలకు గౌరవం ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి.


















