ప్రతిభకు పుట్టినిల్లు నగరాలే కావాల్సిన అవసరం లేదు. ఆధునిక అకాడమీల్లో పెరగాలని లేదు. ఆసక్తి , పట్టుదల ఉంటే అరకొర సౌకర్యాలు ఉన్న గ్రామీణ నేల కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే క్రీడాకారులను అందిస్తుంది. ఆ అవకాశాలు కూడా పరిమితంగా ఉన్నప్పుడు, పట్టుదలనే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిన ఒక బాలుడు నేడు భారత జట్టు జెర్సీ ధరించే స్థాయికి చేరుకున్నాడు. ఇది ఒక్క కాటం ఈశ్వర్ సాయి విజయం మాత్రమే కాదు. కదిరి పట్టణం సాధించిన గౌరవం. శ్రీ సత్యసాయి జిల్లా క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టం. చిన్న పట్టణంలో మొదలైన ఒక కల ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే దిశగా అడుగులు వేస్తోంది.
బెంగళూరులో జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహించిన యోనెక్స్ సన్రైజ్ అఖిల భారత ర్యాంకింగ్ సెలెక్షన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-17 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటం ఈశ్వర్ సాయి–డెబోరా రేచెల్ జాన్ జోడీ రన్నరప్గా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ విజయంతో సెప్టెంబర్లో చైనాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇది ఒక పతకం గెలిచిన కథ కాదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు, నమ్మకం, క్రమశిక్షణ, సాధన కలిసిన విజయగాథ.
కదిరి కమ్యూనిటీ రిక్రియేషన్ సెంటర్లోని శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ ఇండోర్ స్టేడియంలో ఐదారేళ్ల చిన్నారి చిన్న చేతులతో తొలిసారి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన ఆ బాలుడు చైనాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ఆడబోతున్నాడు.
కదిరి కమ్యూనిటీ రిక్రియేషన్ సెంటర్ (సి.ఆర్.సి) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కందికుంట ప్రసాద్ ఇండోర్ స్టేడియంలో చిన్న వయసులో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన ఈశ్వర్ సాయి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ప్రతి క్రీడాకారుడికి స్ఫూర్తిదాయకం. ఆటపై ఆసక్తి, రోజువారీ కఠినమైన సాధన, కుటుంబ సభ్యుల అండ, సి.ఆర్.సి కమిటీ సహకారం, గురువుల మార్గదర్శకత్వం కలిసి ఈ విజయాన్ని సాధించాయి.
2009 లో కదిరి శాసనసభ్యులు గా కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ను సి.ఆర్. సి అద్యక్షుడు రాజారెడ్డి ఆద్వర్యంలో కమిటీ సభ్యులు కలిసి ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి 2013-14 సంవత్సరం లో శ్రీ కందికుంట ప్రసాద్ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేశారు. మొదట్లో రాజేష్ కోచ్ గా ఆటగాళ్ళను తీర్చిదిద్దారు. అప్పుడు మొదలైన క్రీడాకారుల ప్రయాణం నేడు ఇండియా జెర్సీ వేసుకొనే ఆటగాడిని అందించే స్థాయికి చేరుకొంది. శ్రీ కందికుంట ఇండోర్ స్టేడియం ఎంతోమంది చిన్నారుల కలలకు చిరునామాగా మారింది. అక్కడి గోడలు ఎన్నో చెమట చుక్కలకు సాక్ష్యాలుగా నిలిచాయి. అక్కడ ప్రతి షాట్ వెనుక ఒక ఆశ ఉంది. ప్రతి సాధన వెనుక ఒక కుటుంబం కల ఉంది.
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా అనేకమందిని తీర్చిదిద్దింది. త్వరలో మరికొందరిని అంతర్జాతీయ ఆటగాళ్ళుగా అందించాలని పలువురు క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
2011 అక్టోబర్ 15న జన్మించిన కాటం ఈశ్వర్ సాయి స్వస్థలం కదిరి. తండ్రి కాటం కిరణ్, తల్లి జ్యోతి. ఇంట్లో అందరూ ప్రేమగా “పండు” అని పిలుస్తారు. ఈశ్వర్ సాయి చిన్ననాటి నుంచే చురుకైన బాలుడు. ఈ బాలుడి చేతిలో తొలిసారి బ్యాడ్మింటన్ రాకెట్ పెట్టింది ఆయన తాత కాటం శంకర్. ఈ పిల్లాడు ఒకరోజు పెద్ద ఆటగాడవుతాడు అనే విశ్వాసం తాతకు ఉండేది.
ఆ విశ్వాసమే ఈశ్వర్ సాయి జీవితానికి మొదటి పునాది అయింది. కానీ విధి ఒక చిన్న బాధను మిగిల్చింది. మనవడు భారత జట్టుకు ఎంపికైన రోజును చూడకుండానే తాత ఈ లోకాన్ని విడిచిపోయారు.
నన్ను బ్యాడ్మింటన్ వైపు నడిపించింది తాతగారే. నేను ఈ స్థాయికి చేరడం ఆయన కల. అది చూసే అదృష్టం ఆయనకు లేకపోవడం జీవితాంతం మిగిలిపోయే బాధ అని కాటం ఈశ్వర్ సాయి చెప్పిన ప్రతి మాట వెనుక ఒక మనవడి ప్రేమ దాగి ఉంది. తాత ఆశయాన్ని తన భుజాలపై మోసుకున్న తండ్రి కాటం కిరణ్ కొడుకు అడుగు జారకుండా ప్రతి క్షణం అండగా నిలిచారు. తల్లి జ్యోతి , కుటుంబ సభ్యుల ప్రేమ, ఓర్పు, త్యాగం ఈ విజయానికి కనిపించని బలంగా నిలిచాయి.
కదిరిలో అత్యాధునిక ఇండోర్ స్టేడియాలు లేవు. అంతర్జాతీయ ప్రమాణాల కోర్టులు లేవు. పూర్తి స్థాయి కోచ్లు, ఫిట్నెస్ సెంటర్లు, స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్ కూడా అందుబాటులో లేవు. అయినా పిల్లలు వెనక్కి తగ్గలేదు.
సి.ఆర్.సి కమిటీ నిర్వహిస్తున్న శ్రీ కందికుంట ఇండోర్ స్టేడియం ఎంతోమంది చిన్నారుల కలలకు పునాది అయింది. అక్కడ లభించిన పరిమిత అవకాశాలనే గొప్ప విజయాలుగా మలచడం కదిరి క్రీడాకారుల ప్రత్యేకతగా నిలిచింది. అయితే గత ఏడేళ్లుగా సి.అర్. సి ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రిక్రియేషన్ గేమ్స్ మూత పడటం వల్ల సి.ఆర్. సి ఆదాయం కోల్పోయింది. అయినప్పటికీ కష్టాలకోర్చి ఇండోర్ స్టేడియం, టెన్నిస్, పాక్షికంగా జిమ్ కొనసాగిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు రిక్రియేషన్ గేమ్స్ లేకపోవడం వల్ల కొంత అసౌకర్యంగా కూడా ఉంది.
*మెంటార్ , కోచ్ గా నాగభూషణం సేవలు ఆదర్శం*
ఈ పిల్లల విజయాల వెనుక నిలిచిన మరో వ్యక్తి నాగభూషణం. ఈయన వృతి ఎల్ ఐ సి డెవలప్మెంట్ ఆఫీసర్ . తన ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాన్ని కూడా వదులుకుని ఏలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన స్వంత డబ్బు సైతం కొంత మేరకు వెచ్చించి తన విలువైన సమయాన్ని కేటాయించి పిల్లలకు కోచింగ్ ఇవ్వడం ఆయన నిబద్ధతకు గీటురాయి. పిల్ల వాళ్ళను పిడుగులుగా మార్చి అంతర్జాతీయ ఆటగాళ్ళు గా తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం వల్లే నేడు అనేక మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నారు. ఇలాంటి గురువులే సమాజానికి నిజమైన సంపద.పిల్లల భవిష్యత్తు కోసం చేసిన తపస్సే నేడు ఫలిస్తోంది.ఇలాంటి గురువులే సమాజానికి అసలైన ఆస్తి.
*కందికుంట ప్రోత్సాహం పిల్లలకు ఉత్సాహం*
క్రీడాకారులకు విజయంతో పాటు ప్రోత్సాహం కూడా అవసరం. ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసినప్పటి నుంచి పదవులు ఉన్నా లేకపోయినా ప్రోత్సాహం అందించడం అభినందించదగ్గ విషయం. ఆటగాళ్ళ పట్ల బాధ్యతను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. టోర్నమెంట్లలో విజయం సాధించిన ప్రతి క్రీడాకారుడిని అభినందించడం, బహుమతులు అందించడం, కోచింగ్, ప్రయాణ ఖర్చులు, క్రీడా సామగ్రి వంటి అవసరాలకు వ్యక్తిగతంగా సహాయం చేయడం ద్వారా క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు.
ప్రతి విజయానికీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందించిన ప్రోత్సాహాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేం. ఆయన ఇచ్చిన ఉత్సాహమే మమ్మల్ని మరింత ముందుకు నడిపించింది అని కాటం ఈశ్వర్ సాయి పేర్కొనడం ఇందుకు తార్కాణం.
రాయలసీమ నుంచి భారత్ జట్టుకు ఎంపికైన రెండో బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కాటం ఈశ్వర్ సాయి గుర్తింపు పొందారు. గతంలో అనంతపురం జిల్లా యాడికికి చెందిన బొరుగుల విజయ్ భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే జాబితాలో కదిరి పేరు కూడా చేరింది.
చిన్న వయసులోనే ఈశ్వర్ సాయి అనేక జాతీయ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
* 2023 ఆల్ ఇండియా అండర్-13 డబుల్స్ రన్నరప్
* కర్ణాటక రాష్ట్ర ఛాంపియన్షిప్లలో పలుమార్లు విజేత
* అండర్-15 మిక్స్డ్ డబుల్స్లో అనేక టైటిల్స్
* 68వ జాతీయ పాఠశాల క్రీడల్లో అండర్-14 విభాగంలో రన్నరప్
* అండర్-17 ఆల్ ఇండియా ర్యాంకింగ్స్లో 35వ స్థానం
* కర్ణాటక అండర్-19 మిక్స్డ్ డబుల్స్ రన్నరప్
* యోనెక్స్ సన్రైజ్ అఖిల భారత ర్యాంకింగ్ సెలెక్షన్ టోర్నీలో అండర్-17 మిక్స్డ్ డబుల్స్ రన్నరప్
* ఆసియా ఛాంపియన్షిప్కు భారత్ జట్టుకు ఎంపిక
క్రీడలు కేవలం పతకాలు గెలవడానికి మాత్రమే కాదు. అవి క్రమశిక్షణను నేర్పుతాయి. ఓటమిని జీర్ణించుకోవడం నేర్పుతాయి. విజయాన్ని వినయంగా స్వీకరించడం నేర్పుతాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేస్తాయి. అందుకే క్రీడలను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాల్సిన సమయం వచ్చింది.
*ప్రభుత్వం ముందుకు రావాలి*
పరిమిత వనరులతోనే అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న క్రీడాకారులు, సరైన వసతులు లభిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో ఊహించుకోవచ్చు. జిల్లా కలెక్టర్, యువజన-క్రీడాశాఖ అధికారులు కదిరిలో ఆధునిక ఇండోర్ స్టేడియాలు, అంతర్జాతీయ ప్రమాణాల కోర్టులు, ఫిట్నెస్ సెంటర్లు, నిపుణులైన కోచ్లు, స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్, ప్రయాణ భత్యాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే కదిరి దక్షిణ భారత క్రీడా కేంద్రంగా ఎదగడం అసాధ్యం కాదు.
ప్రతి గ్రామంలో ఒక ఈశ్వర్ సాయి ఉన్నాడు. కానీ అతనికి అవకాశం కావాలి. ఒక చేయూత కావాలి. ఒక ప్రోత్సాహం కావాలి. కదిరి చిన్న పట్టణం నేడు దేశానికి ఒక సందేశం ఇస్తోంది. వసతులు విజయాన్ని నిర్ణయించవు సంకల్పమే విజయాన్ని నిర్ణయిస్తుంది.
ఈశ్వర్ సాయి విజయం ప్రతి తల్లిదండ్రికి ఆశను ఇస్తోంది. ప్రతి చిన్నారికి ధైర్యాన్ని ఇస్తోంది. ప్రతి గురువుకు గర్వాన్ని ఇస్తోంది. ప్రతి ప్రజాప్రతినిధికి బాధ్యతను గుర్తు చేస్తోంది.
సెప్టెంబర్లో చైనా వేదికపై భారత జెర్సీ ధరించి ఆడబోయే కాటం ఈశ్వర్ సాయి విజయవంతంగా రాణించి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని, ఆయనలాంటి మరెందరో క్రీడాకారులు కదిరి నేల నుంచి వెలుగులోకి రావాలని ప్రతి క్రీడాభిమాని ఆకాంక్షిస్తున్నాడు.
ఎందుకంటే ఒక చిన్నారి చేతిలో రాకెట్ పెట్టిన రోజు ఒక కుటుంబం ఆనందిస్తుంది. అదే చిన్నారి చేతిలో త్రివర్ణ పతాకం ఎగిరే రోజు ఒక దేశం గర్విస్తుంది. చైనా కోర్టులో భారత్ జెర్సీ ధరించి నిలబడేది ఒక బాలుడు మాత్రమే కాదు అతనితో పాటు నిలబడేది కదిరి నేల. అతనితో పాటు ఎగిరేది రాయలసీమ ఆత్మగౌరవం. అతను సాధించే ప్రతి పాయింట్లో ఒక చిన్న పట్టణం గుండె చప్పుడు ఉంటుంది. ఆ గుండె చప్పుడు రేపటి తరాలకు స్ఫూర్తి కావాలి.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















