కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. న్యూ ఇన్కం ట్యాక్స్ బిల్లు వచ్చే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు.
మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు.మధ్యతరగతి వారికి మేలు జరిగేలా ఆదాయపు పన్ను సంస్కరణలు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఈ సంస్కరణల ద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర మరింత పెరుగుతుంది. ప్రభుత్వం మరియు పన్ను అధికారులు ఈ సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.
రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీనికి అదనంగా రూ. 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.
అంటే.. క్యాపిటల్ గెయిన్స్ లాంటి ప్రత్యేక ఆదాయాలను మినహాయించి సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే వారు ఎలాంటి పన్ను కట్టాల్సినవసరం లేదు.
వేతన జీవులకైతే, అందుబాటులో ఉన్న రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కలుపుకుని రూ.12.75 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి ఆదాయపు పన్ను పడదని ప్రభుత్వం చెప్పింది.
ట్యాక్స్ శ్లాబులలోనూ మార్పులు చేశారు. ఎవరు ఎంత పన్ను ప్రయోజనం పొందుతారన్నది బడ్జెట్లో వివరించారు.
రూ. 12 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటివరకు ఉన్న విధానాలలో రూ. 80 వేల పన్ను చెల్లించాల్సి వచ్చేదని.. కానీ, ఇప్పుడు ట్యాక్స్ రిబేట్ కారణంగా పన్ను చెల్లించాల్సిన అసవరం లేదన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరం కోసం నిర్మలాసీతారామన్ పన్ను శ్లాబులు ప్రకటించారు.
రూ. 0 – 4 లక్షలు – పన్ను లేదు
రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15 శాతం
రూ. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం
రూ. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ. 25 లక్షల పైన 30 శాతం పన్ను
రూ.12 లక్షల ఆదాయం ఉండేవారికి కొత్త పన్ను విధానంలో రూ.80 వేల ప్రయోజనం చేకూరుతుంది. (ప్రస్తుతం ఉన్న రేట్లలో పన్ను చెల్లింపుల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను రేటు జీరోగా మారుతుంది. )
రూ.16 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.50 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి వర్తించే ఆదాయపు పన్ను రేటు కేవలం 7.5 శాతమే.)
రూ.18 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.70 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి నిజ ఆదాయపు పన్ను రేటు(ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్) కేవలం 8.8 శాతమే.)
రూ.20 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.90 వేల ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 10 శాతమే.)
రూ.25 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.1,10,000 ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 13.2 శాతం.)
రూ.50 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి పన్ను రూపంలో రూ.1,10,000 ప్రయోజనం లభిస్తుంది. (వారికి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 21.6 శాతం.)
ఈ ప్రతిపాదనల వల్ల, ప్రత్యక్ష పన్నుల్లో రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ వరకు ప్రభుత్వం కోల్పోతుంది.