తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్లో కొద్ది రోజులు మాత్రమే అత్యల్పంగా నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సాధారణంగా శివరాత్రి ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈ ఏడాది ముందే అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. దీంతో మున్ముందు ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో గత రెండు మూడు రోజులుగా పెరుగుదల నమోదవుతోంది.
ఏపీలో గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోదం కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏసీలను వినియోగిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉండటంతో భయపడుతున్నారు. భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. (AP)
ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొం టుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈనెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భావి స్తోంది.
ఏపీ తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.
మంగళవారం తుని, నరసాపురం, కాకి నాడ, మచిలీపట్నం, నంది గామ, బాపట్ల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్ర తలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది.
తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణలో రానున్న మూడ్రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.