ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపికబురు అందించింది. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం అని జరుగుతున్న ప్రచారం గురించి ఆయన క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
మ్యారేజ్ సర్టిఫికెట్ తో పాటు పెళ్లి ఫోటో, పెళ్లి కార్డ్ అవసరం లేదని వెల్లడించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని ఆయన కోరారు. రేషన్ కార్డ్ కోసం ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆయన వెల్లడించారు.
4.24 కోట్ల మందికి జూన్ నెలలో ఫ్రీగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని ఇందులో ఎలాంటి లోపం లేదని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉంటూ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రజలకు క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ రైస్ కార్డ్ ఇస్తామని ఆయన కామెంట్లు చేశారు.
క్షేత్ర స్థాయిలో వేర్వేరు శాఖలు ఇందుకు సంబంధించి సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులలో ఎవరినైనా రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ అన్నారు. తొలగింపుల విషయంలో మాత్రం ప్రస్తుతం మరణించిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వివరాలను మార్చడానికి సైతం అవకాశం కల్పిస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాదెండ్ల మనోహర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.