విద్య అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు కాదు… ప్రతి మనిషికి సమానమైన జీవించే అవకాశం. ఒక దేశాన్ని ఎంత ఎత్తైన భవనాలు అలంకరించాయో చూసి దాని గొప్పతనాన్ని కొలవలేం. ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారో చూసి దాని పురోగతిని నిర్ణయించలేం. కానీ ఆ దేశంలో పుట్టిన ఒక పేద బిడ్డ కూడా భయపడకుండా చదువుకోగలిగితే, అనారోగ్యం వచ్చినప్పుడు తన కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చికిత్స పొందగలిగితే అదే ఆ దేశ అసలైన అభివృద్ధి.
ఒక దేశం గొప్పదనం దాని జిడిపి వృద్ధి రేటులో ఉండదు. స్టాక్ మార్కెట్ సూచీలు ఎంత ఎత్తుకు చేరాయన్నదానిలో ఉండదు. విదేశీ పెట్టుబడులు ఎంత వచ్చాయో అన్న లెక్కల్లోనూ ఉండదు. అసలు అభివృద్ధి అంటే ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, అందుబాటు వైద్యం, భద్రమైన భవిష్యత్తు. కానీ మనం నేడు ఏ దిశగా ప్రయాణిస్తున్నాం?
విద్య, వైద్యం… ఒకప్పుడు ప్రభుత్వ బాధ్యతగా, ప్రజల హక్కుగా భావించిన ఈ రెండు రంగాలు నేడు మార్కెట్లో అమ్ముడవుతున్న వస్తువులుగా మారిపోయాయి. జ్ఞానం వ్యాపారమైంది. ఆరోగ్యం లాభదాయక పరిశ్రమగా మారింది. మానవత్వం కంటే మార్కెట్ విలువ ఎక్కువైపోయింది.
ఆర్టికల్ 21A ప్రకారం విద్య
ఆర్టికల్ 21 , ఆర్టికల్ 47 ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రాష్ట్ర విధిగా పేర్కొనబడింది.
ఒకప్పుడు పుస్తకం పిల్లల భవిష్యత్తును నిర్మించేది. ఇప్పుడు ఫీజు రసీదు వారి కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. ఒకప్పుడు మందు ఆశను ఇచ్చేది. ఇప్పుడు ఆసుపత్రి బిల్లు అప్పుల జీవితాన్ని ప్రారంభిస్తోంది.
ఒకప్పుడు గురుకులాలు జ్ఞాన మందిరాలు. ప్రభుత్వ పాఠశాలలు సమానత్వానికి చిహ్నాలు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదవాడి చివరి ఆశ్రయం. కానీ నేడు? చదువు పేరుతో లక్షల్లో ఫీజులు. అడ్మిషన్లు ప్రతిభ కంటే ఆర్థిక సామర్థ్యాన్ని పరీక్షించే వ్యవస్థగా మారాయి. వైద్యం పేరుతో చికిత్స కంటే ముందుగా బిల్లుల జాబితా ఎదురవుతోంది. సేవ కంటే ప్యాకేజీలు ముఖ్యమవుతున్నాయి.
ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. దశాబ్దాలుగా ప్రజాసేవలపై పెట్టుబడులు తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటీకరణను ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రధాన మార్గంగా మార్చడం వల్ల ఏర్పడిన పరిస్థితి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత. మౌలిక సదుపాయాల లేమి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత. అవసరమైన మందులు లేకపోవడం. పరికరాల కొరత. ఇవన్నీ ప్రజలను తప్పనిసరిగా ప్రైవేట్ రంగం వైపు నెట్టేస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలు విలాసవంతమైన క్యాంపస్లతో, ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యను ఒక ఉత్పత్తిగా విక్రయిస్తున్నాయి. బహుళ అంతస్తుల ప్రైవేట్ ఆసుపత్రులు ఆధునిక సాంకేతికతతో సేవలు అందిస్తున్నప్పటికీ, వాటి ఖర్చులు సామాన్య కుటుంబాల ఆర్థిక స్థితిని కుదేలు చేస్తున్నాయి.
ఈ పరిస్థితి కేవలం ఆర్థిక సమస్య కాదు. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే ఒక పిల్లవాడి కలలు అతని ప్రతిభతో కాకుండా అతని తల్లిదండ్రుల ఆదాయంతో నిర్ణయించబడుతున్నాయి.
ఒక రోగి ప్రాణం అతని ఆరోగ్య పరిస్థితితో కాకుండా అతని బ్యాంకు ఖాతా నిల్వతో ముడిపడుతోంది.
ఒక రైతు తన కుమారుడి చదువు కోసం భూమిని అమ్ముకుంటున్నాడు. ఒక కార్మికుడు తన భార్య శస్త్రచికిత్స కోసం జీవితాంతం చేసిన పొదుపును ఖర్చు చేస్తున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబం ఒక్క వైద్య ఖర్చుతో సంవత్సరాల ఆర్థిక ప్రణాళికను కోల్పోతోంది.
ఇది అభివృద్ధి కథనా? లేక అసమానతలు మరింత లోతుగా పెరిగిన సమాజమా? ఒక దేశంలో రెండు రకాల విద్య ఉంటే ఒకటి డబ్బున్న వారికి, మరొకటి మిగతావారికి. రెండు రకాల వైద్యం ఉంటే ఒకటి ధనికులకు, మరొకటి నిరీక్షణలో ఉండే పేదలకు.
అప్పుడు అక్కడ సమానత్వం ఉందని ఎలా చెప్పగలం?
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలను హామీ ఇస్తుంది. విద్య, ఆరోగ్యం గౌరవప్రదమైన జీవితానికి పునాదులు. ఇవి విలాస వస్తువులు కావు. మార్కెట్లో ధర నిర్ణయించే సరుకులు కావు. ఇవి ప్రతి మనిషి మౌలిక హక్కులు. ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన వ్యవస్థ. లాభాలను గరిష్ఠం చేయడం దాని లక్ష్యం కాదు. ప్రతి పౌరుడు గౌరవంగా జీవించేలా అవసరమైన సేవలను అందించడం దాని ప్రధాన బాధ్యత.
అందుకే ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య సేవలకు ప్రతీకలుగా మారాలి. ప్రైవేట్ రంగం ఉండొచ్చు, కానీ అది ప్రభుత్వ బాధ్యతకు ప్రత్యామ్నాయం కాకూడదు. ఎందుకంటే ఒక బిడ్డ పుట్టిన రోజునే అతని భవిష్యత్తు కుటుంబ ఆర్థిక స్థితితో నిర్ణయించబడకూడదు. ఒక తల్లి తన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఎంత ఖర్చవుతుందో? అని భయపడకూడదు. ఒక విద్యార్థి తన ప్రతిభను నిరూపించుకునే ముందు ఫీజు కట్టగలనా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉండకూడదు.
నిజమైన అభివృద్ధి అంటే ప్రజలు ప్రభుత్వాన్ని చూసి భరోసా పొందడం. నిజమైన సంక్షేమం అంటే ఎవ్వరూ వైద్యం కోసం అప్పుల పాలవకుండా ఉండడం. నిజమైన సమానత్వం అంటే ప్రతి పిల్లవాడికి ఒకే స్థాయి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండడం.
అభివృద్ధి గణాంకాలు పత్రికల శీర్షికలను మార్చగలవు. కానీ ఒక కుటుంబం కన్నీళ్లను తుడిచేది ప్రజాకేంద్రిత పాలన మాత్రమే.
ఒక దేశం గొప్పదనం దాని సంపదలో కాదు తన అత్యంత బలహీనమైన పౌరుడిని ఎంత గౌరవంగా జీవింపజేస్తుందన్నదానిలో ఉంటుంది.
ఒక పేద బిడ్డ నవ్వుతూ పాఠశాలకు వెళ్లగలిగితే ,
ఒక వృద్ధుడు తన వైద్యం కోసం తన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకపోతే, ఒక కుటుంబం అనారోగ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా బయటపడగలిగితే అదే నిజమైన అభివృద్ధి.
లేకపోతే ఎన్ని ఆకాశహర్మ్యాలు కట్టినా ఎన్ని ఆర్థిక రికార్డులు సృష్టించినా ఎన్ని విజయగాథలు చెప్పుకున్నా అవి కాగితాల మీద గెలుపులు మాత్రమే.
ప్రజల జీవితాల్లో గెలిచినప్పుడే ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందిన దేశంగా చరిత్రలో నిలుస్తుంది.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి.


















