తమిళనాడు రాజకీయాల్లో సునామీలా దూసుకుని వస్తున్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ అరెస్ట్ ఖాయమా అంటే అవును అని అంటున్నారు. ఆయన కరూర్ లో నిర్వహించిన భారీ సభ లక్షలాది జనాల మధ్య సాగింది. ఈ సభకు నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జనాలు తరలి వచ్చారు. దాంతో ఈ సభ జన ప్రభంజనాన్నే సృష్టించింది. ఇక విజయ్ భారీ ర్యాలీగా వచ్చి కరూర్ సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి ప్రవేశించి ప్రసంగిస్తూండగానే ఒక్కసారిగా తొక్కిసలాట ఏర్పడింది. దాంతో ఒకరి మీద ఒకరు పడిపోయి ఊపిరాడని పరిస్థితుల నేపధ్యంలో పదుల సంఖ్యలో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 34 మంది మరణించడం మరింత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరుగుతుంది అని భావిస్తున్నారు.
ఇంతకు ముందు విజయ్ నిర్వహించిన మధురై సభ ఉదందం కళ్ళ ముందే ఉంది. ఆనాడు కూడా ఈ విధంగానే కిక్కిరిసిన విధంగా జనాలు వచ్చారు. ఆనాటి సభలో ఒకరు మృతి చెందారు. మరి దానిని గమనంలోకి తీసుకుని భారీగా ఏర్పాట్లు చేసుకోవాల్సింది అని అంటున్నారు. అంతే కాదు జనాలను కంట్రోల్ చేయలేకపోతే అతి పెద్ద సభా ప్రాంగణాన్ని అయినా ఎంచుకోవాల్సి ఉందని అంటున్నారు. కానీ ఇరుకు ప్రాంతంలో మీటింగులు పెట్టడం వల్లనే ఇలాండి దురాగతాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే టీవీకే అధ్యక్షుడుగా ఉన్న విజయ్ ని బాధుడిగా చేస్తూ ఈ మరణాల మీద అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. దానికి ఒక కారణం ఉంది. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ప్రీమియం షో కోసం ర్యాలీగా సినీ హీరో అల్లు అర్జున్ వచ్చారని ఆ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది అని హీరోను అరెస్ట్ చేశారు ఇక్కడ చూస్తే ఏకంగా 34 మంది దాకా మృత్యు వాత పడ్డారు. దాంతో విజయ్ ని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు.
ఇక కరూర్ సభను మధ్యలోనే ముగించించుకుని చెన్నై వచ్చేందుకు విజయ్ విమానాశ్రయానికి వచ్చారని చెబుతున్నారు. అయితే ఆయనను మీడియా ఇదే విషయం మీద ప్రశ్నించగా ఆయన నుంచి మౌనమే జవాబుగా వచ్చింది. తీవ్ర విచారంలో ఉన్న విజయ్ తన నివాసానికి చేరుకున్నారు అని అంటున్నారు. అయితే ఈ ఘటన మీద ప్రాధమిక నివేదిక కోరిన స్టాలిన్ ప్రభుత్వం ఆ నివేదిక వచ్చిన తరువాతనే తగిన చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు.
విజయ్ ని అరెస్ట్ చేయడం అన్నది పెద్ద అంశంగా ఉంటుందని అంటున్నారు. ఆయన వెండి తెర మీద దళపతి, రాజకీయంగా చూస్తే జనాల్లో ప్రజా నాయాకుడిగా ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేస్తే వచ్చే సానుభూతి కూడా ఒక సునామీలాగానే ఉంటుంది. అందువల్ల రాజకీయంగా చాణక్యుడు అయిన స్టాలిన్ ఈ విషయంలో తొందర పడరని అంటున్నారు. టీవీకేకి చెందిన స్థానిక బాధ్యులను అరెస్ట్ చేసి టీవీకే సభల మీద పూర్తి నియంత్రణ పెట్టే అవకాశాలు సైతం ఉంటాయని అంటున్నారు. ఇక విజయ్ ఇప్పటిదాకా ఒంటరిగానే రాజకీయం చేస్తున్నారు. ఈ ఘటన తరువాత అధికార డీఎంకే విజయ్ పార్టీకి యాంటీగా ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు నుంచి ఆయనకు మద్దతు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అది ఆ మీదట తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణలకు సైతం దారి తీయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
తమిళనాడులో కొత్త పార్టీగా జనం ముందుకు వచ్చిన టీవీకే వరసగా సభలను ప్రతీ జిల్లాలో నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా శనివారం నిర్వహించిన కరూర్ సభలో ఏకంగా మరణ మృదంగమే మోగింది. కడపటి వార్తలు అందే సమయానికి ఏకంగా 34 మంది దాకా మరణించారు అని అంటున్నారు. అందులో చిన్న పిల్లలు మహిళలు ఎక్కువ మంది ఉండడం విషాదం. ఈ రాజకీయ సభలో పెద్ద ఎత్తున ప్రజలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఒక రాజకీయ సభకు వచ్చి ఇంత మంది జనాలు మృత్యు వాత పడడం ఇదే తొలిసారి. గతంలో కూడా చనిపోయిన సంఘటనలు జరిగినా మృతుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగినదిగా తెలుస్తోంది. మరింత బాధాకరమైన అంశం ఏమిటి అంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉండడం.
వెండి తెర వేలుపుగా విజయ్ కి ఉన్న అభిమాన గణాన్ని లెక్క వేయడం కష్టం. ఆయన గత మూడు దశాబ్దాలుగా ప్రజల గుండెలలో గూడు కట్టుకున్నారు. దాంతో ఆయన రాజకీయాల్లోకి వస్తూ జనానికి నేరుగా పలకరించేందుకు రావడంతో అది అతి పెద్ద ఎక్సైట్మెంట్ గానే ఉంది. అయితే అదే సమయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన టీవీకే నాయకత్వం ఫెయిల్ కావడంతో ఇంతటి దారుణం చోటు చేసుకుంది అని అంటున్నారు. ఇక కరూర్ లో జరిగిన విజయ్ సభా ప్రాంగణం చాలా చిన్నదిగా ఉంది. అతి తక్కువ మందితో సభ జరుపుతామని చెప్పి అనుమతి తీసుకుని నిర్వహించిన ఈ సభకు అత్యధికంగా జనాలు తరలి రావడంతో ఊపిరాడకపోవడం తోపులాట జరిగి అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు ఎటు చూసినా హాహాకారాలతో కరూర్ ప్రాంగణం ఉంది. ఆస్పత్రికి తరలించే లోపే ఎంతో మంది ప్రాణాలు విడిచారు. సభ కాస్తా కన్నీటి కడలిగా మారడం మాత్రం అత్యంత విషాదంగా భావిస్తున్నారు.
కేవలం పది వేల మందితో సభ నిర్వహిస్తామని చెప్పి అనుమతి తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ర్యాలీగా విజయ్ తరలి వచ్చి అనంతరం సభ కావడంతో జనాలు పోటెత్తారు. ఇక సభా ప్రాంగణం ఇరుకుగా ఉన్నా ఏకంగా రెండు లక్షల మంది దాకా జనాలు రావడంతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడడంతో చిన్నారులు మహిళలు బలి అయ్యారని అంటున్నారు. ఇక సభా నియమాలను పద్ధతులను పాటించడంలో టీవీకే విఫలం అయింది అని అంటున్నారు. విజయ్ మధ్యాహ్నం పన్నెండు వస్తారని ప్రచారం చేస్తే ఆ సమయానికే జనాలు తరలి వచ్చారు. కానీ ఆయన ఆయిదారు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఈ సమయం అంతా అక్కడ ఉన్న వారు అంతా ఆకలికి దప్పికకు తట్టుకోలేకపోయారు దాంతో ఉన్న వారు బయటకు వెళ్ళాలనుకోవడం అలాగే లోపలికి రావాలనుకునే వారు ఎగబడడం కూడా భారీ తోపులాటకు కారణం అయింది అని అంటున్నారు.