TukaramMunde కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం. తుకారాం ముండే లాంటి అధికారులు అవసరం.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాట భారతీయ సంస్కృతిలో శాశ్వత సత్యం. మనిషి సంపాదించే ధనం, కూడబెట్టే ఆస్తులు, సంపాదించే హోదా, పేరు ప్రతిష్ఠలు అన్నీ ఆరోగ్యం ఉన్నప్పుడే విలువైనవిగా నిలుస్తాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహారమే అనారోగ్యానికి కారణమవుతోంది. మనం డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్న ఆహారం, మనమే అలవాటు చేసుకున్న జీవనశైలి, నిర్లక్ష్యపు ఆహారపు అలవాట్లు, కల్తీ పదార్థాలు, నకిలీ మందులు కలిసి నెమ్మదిగా రోగాల బారిన పడేస్తున్నాయి.
అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీ చేయడం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారింది. పాలు, నెయ్యి, వంటనూనెలు, మిరపపొడి, పసుపు, మసాలాలు, తేనె, స్వీట్లు, శీతల పానీయాలు, పండ్లు, కూరగాయలు, పిల్లలు తినే చిరుతిళ్లు వరకు కల్తీ కోరల్లో చిక్కుకుంటున్నాయి.ముంబైలో తుకారాం ముండే ఐపీఎస్ లాంటి నిఖార్సయిన అధికారి కల్తీ ఆహార పదార్థాల విక్రయం పై కొరడా ఝలిపిస్తున్నారు. తనదైన ముద్ర వేశారు. హోటల్ వంటగదుల్లో వొణుకు పుట్టిస్తున్నారు. కల్తీ వ్యాపారానికి చెక్ పెట్టిన ముండే .దేశం మొత్తం ఇలాంటి అధికారుల అవసరం ఉంది.
ప్రజల ప్లేటులో పడేది ఆహారమా లేక విషమా?ఒక హోటల్ వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నా, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నా ,కల్తీ పాలు మార్కెట్లోకి వస్తున్నా , నూనెలో నాణ్యత లేకపోయినాప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం సాగుతున్నా అధికారుల కళ్లకు మాత్రం ఇవి ఎందుకు కనిపించవు?కానీ ముంబైలో ఓ అధికారి వచ్చాడు. ఫైళ్లలో దాక్కుని ఆదేశాలు ఇచ్చే అధికారి కాదు. ఏసీ కార్యాలయంలో కూర్చుని నివేదికలు చదివే అధికారి కాదు. వంటగదుల్లోకి వెళ్లాడు. దుకాణాల్లోకి వెళ్లాడు. ఆహార తయారీ కేంద్రాల్లోకి వెళ్లాడు. నిబంధనలు ఉల్లంఘించిన చోట కొరడా ఝళిపించాడు. భయం పుట్టించాడు. ఆ అధికారే తుకారాం ముండే ఐఏయస్. ఈయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖ ప్రక్షాళన కావాల్సిందే.
మూడు నెలల్లో వేలాది తనిఖీలు. చిన్న హోటల్ అయినా, పెద్ద బ్రాండ్ అయినా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అయితే చర్య తప్పదనే సందేశం. ఇదే ఇప్పుడు దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం.తుకారాం ముండే ఒక్కరే ఎందుకు కనిపించాలి? దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి అధికారులు లేరా లేక పని చేయలేదా?ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. తనిఖీ బృందాలు ఉన్నాయి. లైసెన్సింగ్ వ్యవస్థ ఉంది. ల్యాబొరేటరీలు ఉన్నాయి.అధికార యంత్రాంగం ఉంది. అయితే కల్తీ ఎందుకు ఉంది? ఇదే అసలు ప్రశ్న.
నిబంధనలు పుస్తకాలలో పుట్టి ఫైళ్లలో పెరిగి చివరకు చెత్తబుట్టలో పడిపోతే ప్రయోజనం ఏమిటి? తనిఖీలు కాగితాల మీద జరిగితే ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఎక్కడ? ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సు వ్యాపారం చేసుకోవడానికి హక్కు మాత్రమే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి లైసెన్సు కాదు. ఈ చిన్న నిజాన్ని అధికార యంత్రాంగం మరచిపోయినప్పుడు ముండే లాంటి అధికారులు అవసరం అవుతారు.ప్లేటులో విషం పెట్టేవాడికంటే చూసీ చూడనట్టు ఉండే అధికారులే ప్రమాదకరం!కల్తీ చేసే వ్యాపారి తన లాభం కోసం నేరం చేస్తాడు. కానీ ఆ కల్తీని గుర్తించాల్సిన అధికారి తన బాధ్యతను విస్మరిస్తే?అది ఒక్కరి తప్పు కాదు.వ్యవస్థ వైఫల్యం. ఒక హోటల్లో అపరిశుభ్రత ఉంది. అక్కడకు వెళ్లి తనిఖీ చేయాల్సిన అధికారి వెళ్లలేదు.వెళ్లినా చర్య తీసుకోలేదు.చర్య తీసుకున్నా నామమాత్రపు కేసు .కేసుకు శిక్ష పడలేదు.శిక్ష పడినా అమలు కాలేదు. ఇలా ప్రతి మెట్టుపై నిర్లక్ష్యం పెరిగితే కల్తీ వ్యాపారి ధైర్యం పెరుగుతుంది.ప్రజల భయం పెరుగుతుంది.
ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతుంది. ఇది కేవలం ఆహార సమస్య కాదు. ఇది పాలనా నైతికతకు పరీక్ష.
పెద్ద బ్రాండ్కైనా చిన్న బండి వాడికైనా ఒకే చట్టం.
ముండే చర్యల్లో మరో ముఖ్యమైన సందేశం ఉంది. పెద్ద బ్రాండ్ పేరు చూసి వెనక్కి తగ్గకూడదు.చిన్న వ్యాపారి అని అతనిపై మాత్రమే పడి పోకూడదు. చట్టం ముందు బ్రాండ్ కాదు ఉల్లంఘన ముఖ్యం.ప్రజలకు అమ్మే ఆహారం సురక్షితమా కాదా అనేదే ప్రమాణం. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ అయినా రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే చిరు వ్యాపారి అయినా ప్రజల ఆరోగ్యంతో రాజీ పడితే చర్య తప్పకూడదు. అదే సమాన న్యాయం. అదే ప్రజా పరిపాలన. ముండే చేసినది , చేస్తున్నది అదే.మరి మిగిలిన రాష్ట్రాల్లో? ఏందుకు చురుగ్గా చేయడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కర్ణాటక నుంచి తమిళనాడు వరకుదేశంలోని ప్రతి రాష్ట్రం తనను తాను అడగాల్సిన సమయం.
ముండే ముంబైలో ఉన్నాడని అక్కడి ప్రజలకే సురక్షితమైన ఆహారం దొరకాలా? దేశంలోని మిగిలిన ప్రజలకు?వారికి ఎవరు రక్షణ?ఒక నగరంలో అధికారి దూకుడుగా పనిచేస్తేనే హోటళ్లలో పరిశుభ్రత రావాలా? ఒక అధికారి సోషల్ మీడియాలో వైరల్ అయితేనే శాఖ మేలుకోవాలా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక ముండే అవసరమా లేక వ్యవస్థ మొత్తం ముండేలా పనిచేయాలా.
బదిలీ భయం ఉన్న అధికారి ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు? ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది.నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రాజకీయ ఒత్తిళ్లు. పెద్ద వ్యాపారులపై చర్య తీసుకుంటే ఫోన్లు.లైసెన్సులు రద్దు చేస్తే ఒత్తిళ్లు. నిజాయితీగా పనిచేస్తే బదిలీలు. కోర్టు వివాదాలు. కోర్టు కూడ కొన్ని విషయాలను విశాలదృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మరి అధికారి ఏం చేయాలి?ఫైలు మూసేయాలా?
కళ్లుమూసుకోవాలా?లేక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తన పదవినే పణంగా పెట్టాలా? అందుకే దేశానికి కేవలం ముండే లాంటి అధికారులు కాదు ముండేలా పనిచేసే వ్యవస్థ అవసరం.నిజాయితీగా పనిచేసే అధికారిని ఒంటరిగా వదిలేస్తే అది అధికారి కి అన్యాయం మాత్రమే కాదు. ప్రజలకుద్రోహం జరిగినట్లే.కల్తీదారుడికి శిక్ష ఎంత ముఖ్యమో కల్తీకి అవకాశం ఇచ్చిన వ్యవస్థకు ప్రశ్న అంతే ముఖ్యం! కల్తీ ఆహారం పట్టుబడిన ప్రతిసారీ ఒక కేసు పెట్టడం సరిపోదు. ప్రశ్నించాలి.
ఇది ఇంతకాలం ఎలా అమ్ముడైంది? ఎన్ని తనిఖీలు జరిగాయి?ఎన్ని నమూనాలు సేకరించారు? ఎన్ని పరీక్షలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని కేసుల్లో శిక్ష పడింది?ఎన్ని లైసెన్సులు రద్దయ్యాయి? ఎంతమంది అధికారులపై బాధ్యత నిర్ణయించారు?ఈ లెక్క ప్రజలకు ఎందుకు చెప్పకూడదు? ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారంలో పారదర్శకత ఎందుకు ఉండకూడదు. ముండే కావాలి కానీ ముండేను తయారు చేసే వ్యవస్థ ఇంకా ఎక్కువ కావాలి!దేశానికి వందలాది మంది ముండేలు కావాలి. ముండే లేకపోయినా పనిచేసే వ్యవస్థ కావాలి.
అధికారి మారినా తనిఖీలు ఆగకూడదు. బదిలీ అయినా నిబంధనలు మారకూడదు. ప్రభుత్వం మారినా ఆహార భద్రతా ప్రమాణాలు మారకూడదు. పెద్ద వ్యాపారి వచ్చినా చట్టం వంగకూడదు. రాజకీయ నాయకుడి ఫోన్ వచ్చినా అధికారి చేతులు వణకకూడదు. ఎందుకంటే అధికారి కుర్చీలో కూర్చున్నది వ్యక్తి కాదు ప్రజల నమ్మకం. మనిషి ఒక రోజు భోజనం చేయకుండా ఉండగలడు.
కానీ తినే ప్రతి ముద్దలో విషం ఉందేమోనని భయపడుతూ జీవించాల్సిన సమాజం మాత్రం ఆరోగ్యకరమైన సమాజం కాదు. ఆహారం వ్యాపారం కావచ్చు
కానీ ప్రజల ప్రాణాలు వ్యాపార వస్తువులు కావు!
లాభం కోసం కల్తీ చేసే వాడిని కఠినంగా శిక్షించాలి. అతన్ని చూసీ చూడనట్టు వదిలేసే అధికారిని కూడా ప్రశ్నించాలి. చట్టాన్ని అమలు చేసే అధికారికి రాజకీయ రక్షణ కాదు. చట్టపరమైన రక్షణ ఇవ్వాలి. నిజాయితీగా పనిచేసే అధికారికి బదిలీ భయం కాదు ప్రభుత్వ అండ ఉండాలి. అప్పుడే ప్రజలకు భద్రత. అప్పుడే పరిపాలనకు గౌరవం.అప్పుడే ప్రభుత్వానికి విశ్వసనీయత.ముంబైలో ముండే ముద్ర పడింది. వంటగదుల్లో వణుకు మొదలైంది.కల్తీ వ్యాపారులకు హెచ్చరిక వెళ్లింది. మరి మిగిలిన దేశం? ప్రతి రాష్ట్రంలో ఒక ముండే కోసం ఎదురు చూడాలా?
లేక ప్రతి ఆహార భద్రతా అధికారి ముండేలా పనిచేసే రోజు కోసం ఎదురు చూడాలా? ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో ఎవరున్నారు? అనేది ప్రశ్న కాకూడదు. బాధ్యత ఎవరిది? అనేదే ప్రశ్న కావాలి. ఎందుకంటేకస్టమర్ ప్లేటులో పడే ప్రతి ముద్దకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. కల్తీకి వ్యతిరేకంగా ఒక ముండే కాదు దేశం మొత్తం ముండేలు కావాలి!
ముండే దూకుడు ఎందుకు చర్చనీయాంశమైంది?
మే 2026లో మహారాష్ట్ర FDA ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముండే నేతృత్వంలో 3,000కు పైగా తనిఖీలు దాడులు జరిగినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటిలో చిన్న హోటళ్ల నుంచి పెద్ద ఫుడ్ చైన్ల వరకు తనిఖీలు జరిగాయి.
తనిఖీల్లో ప్రధానంగాఅపరిశుభ్రమైన వంటగదులు, బొద్దింకలు, ఎలుకల ఉనికి , గడువు ముగిసిన ఆహార పదార్థాలు , సరైన రీతిలో నిల్వ చేయని ఆహారం , ఫుడ్ హ్యాండ్లింగ్లో లోపాలు , లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఆహార కేంద్రాలు, కల్తీ లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు వంటి ఉల్లంఘనలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నాడు.పెద్ద బ్రాండ్లను కూడా వదల్లేదు. ఈయన చర్యల్లో డోమినేస్ (Domino’s ) నాలుగు అవుట్లెట్ల, పిజ్జా హట్ (Pizza Hut ) ఒక అవుట్లెట్ లైసెన్స్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
అక్కడ పురుగుల సమస్య, గ్రీజ్ పేరుకుపోవడం, గడువు వివరాలు లేని ఆహార పదార్థాలు వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాదు, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని ఐదు ఫుడ్ అవుట్లెట్ల లైసెన్సులను కూడా FDA సస్పెండ్ చేసింది. పాల కల్తీపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.ముండే బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్రలో సింథటిక్ మిల్క్ తయారీ యూనిట్లు, డెయిరీలు, పాల రవాణాదారులు, పంపిణీదారులు, హోల్సేలర్లు, రిటైలర్ల వరకు తనిఖీలు విస్తరించాయి. ఇటీవల నవి ముంబై సమీపంలో పాల ట్యాంకర్లలో కల్తీ పదార్థాలు కలుపుతున్నట్లు ఆరోపణలున్న ఒక రాకెట్ను FDA దాడుల్లో గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అయితే మరో కోణం కూడా ఉంది. ముండే దూకుడు చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ, కొన్ని వ్యాపార సంస్థలు అధికారులు తగిన నోటీసు లేకుండానే తక్షణం మూసివేత చర్యలు తీసుకుంటున్నారని కోర్టును ఆశ్రయించాయి. కొన్ని కేసుల్లో బాంబే హైకోర్టు FDA ఆదేశాలను నిలిపివేయడం లేదా తిరస్కరించడం కూడా జరిగింది. కల్తీ ఆహార పదార్థాల నిరోదక ఆధికారుల చర్యలపై కోర్టులు విశాలదృక్పథం తో చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కఠినమైన చర్యలు తీసుకొంటే తప్ప కల్తీ ని ఆపలేరు. దేశం మొత్తం ముంబై తరహాలో కల్తీ ఆహార పదార్థాలపై దాడులు జరిపి ప్రజలు ప్రాణాలు కాపాడే బరోసా కావాలి.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















