వ్యవస్థలు విఫలమవుతున్నాయా?… లేక బాధ్యత వహించాల్సిన వారే విఫలమవుతున్నారా?
జీవితఖైదు ఉత్తమ ఉపాధ్యాయుడు ఏలా అయ్యారు?
Life Convict Became Government Teacher కేసులో పెరోల్పై వెళ్లిన జీవిత ఖైదీ నాలుగు దశాబ్దాల పాటు బయట ఉండి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా మారాడు? వ్యవస్థల జవాబుదారీతనంపై ప్రత్యేక విశ్లేషణ.
చట్టాలు ఉన్నాయి. నిబంధనలు ఉన్నాయి. అధికారాలు ఉన్నాయి. జవాబుదారీతనం కూడా ఉంది. లేనిది ఒక్కటే అదే బాధ్యత .ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, ప్రజల కోసమే పనిచేయాల్సిన కొందరు అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరిస్తే ప్రశ్నించేది ఎవరు? తప్పు జరిగితే బాధ్యత వహించేది ఎవరు? నష్టం జరిగితే పరిహారం చెల్లించేది ఎవరు?తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థే అతడిని కాపాడితే నిర్లక్ష్యానికి శిక్ష లేకపోతే విధి నిర్వహణలో వైఫల్యానికి జవాబుదారీతనం లేకపోతే అప్పుడు తప్పు ఒక్క అధికారిదే కాదు ఆ తప్పును సహించే మొత్తం వ్యవస్థదే! నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు లేకపోతే నిబంధనలకు విలువ ఏమిటి? తప్పిదాలకు శిక్షలు లేకపోతే చట్టం భయం ఎక్కడి నుంచి వస్తుంది?
వ్యవస్థలో రంధ్రాలున్నాయా? లేక ఆ రంధ్రాలను పూడ్చాల్సిన వారే వాటిని పెద్దవిగా చేస్తున్నారా?ఇది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న కాదు ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.ఎందుకంటే శిక్ష లేని నిర్లక్ష్యం రేపటి అవినీతికి పునాది. జవాబుదారీతనం లేని అధికారం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.లోపం వ్యవస్థలో ఉందా? లేక వ్యవస్థను అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంలో ఉందా?లేదా తప్పు చేసినా శిక్ష పడదనే ధీమా అధికార యంత్రాంగాన్ని బాధ్యతారాహిత్యానికి గురిచేస్తోందా?చట్టం బలహీనమైతే వ్యవస్థను సరిచేయాలి. వ్యవస్థ బలంగా ఉండి అమలు చేసే చేతులు బలహీనమైతే ఆ చేతులకు బాధ్యత నేర్పాలి. శిక్ష భయం లేని చోట నిబంధనలకు విలువ ఉండదు. జవాబుదారీతనం లేని చోట ప్రజాస్వామ్యం కేవలం ఒక అందమైన పదంగా మిగిలిపోతుంది.
ఒక జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చారు. పెరోల్ గడువు ముగిసింది. జైలుకు తిరిగి రావాలి. రాలేదు. ఒక రోజు కాదు , ఒక సంవత్సరం కాదు, రెండు దశాబ్దాలు కాదు, ఏకంగా నాలుగు దశాబ్దాలు. ఇంతకాలం అతను భూగర్భంలో దాక్కోలేదు. అరణ్యవాసం చేయలేదు. నకిలీ పేరుతో దేశం దాటలేదు. తన స్వగ్రామమైన మహబూబాబాద్లోనే జీవించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యాడు. ప్రభుత్వ జీతం తీసుకున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నాడు. 2013లో పదవీ విరమణ కూడా చేశాడు. జైలు అధికారులు ఏంచేసినట్లు? పోలీసు వ్యవస్థ ఏంచేస్తున్నట్లు? ఇతర ప్రభుత్వ వ్వవస్థలు ఏం చేస్తున్నట్లు? కానీ జైలు రికార్డులో మాత్రం అతను ఇంకా జీవిత ఖైదీనే! ఇది వింటేనే వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి.
ఎందుకంటే ఒక నేరస్తుడు చట్టాన్ని మోసం చేయడం కొత్త విషయం కాదు. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలే నాలుగు దశాబ్దాలు మోసపోవడం అదే అసలు విషాదం.
సందెల వీరన్నకు 1983 జూన్ 9న వరంగల్ అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది డిసెంబర్ 17న పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ గడువును 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న జైలుకు తిరిగి లొంగిపోవాలి. లొంగిపోలేదు. అక్కడితో చట్టం తన పని ఆపేసిందా? అవుననే చెప్పాలి. అతను తన పని మాత్రం ఆపలేదు. జీవితం కొనసాగించాడు. ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ సేవ చేశాడు. అవార్డు అందుకున్నాడు. రిటైర్ అయ్యాడు. చివరకు 2024 మే 16న అంటే పెరోల్ గడువు ముగిసిన 40 సంవత్సరాల, ఒక నెల, 28 రోజుల తర్వాత పట్టుకొన్నారు. జైలుకు తరలించారు. అయితే ఇదంతా బయట ప్రపంచానికి తెలియలేదు. ఇటీవల తిరిగి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడం దాన్ని తిరస్కరించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ నేరస్థుడి బార్య హైకోర్టు లో కేసు వేసి వయసు సహకరించడం లేదని ఆరోగ్యం సరిగా లేదని అందువల్ల శిక్ష రద్దు చేయాలని లేదంటే పెరోల్ మంజూరు చేయాలని కోరింది. అప్పుడు పూర్తి వివరాలు బయట ప్రపంచానికి తెలిసింది.
ఒక నేరస్తుడు ప్రభుత్వ ఉద్యోగం ఎలా పొందాడు? ఇదే అసలు ప్రశ్న. పెరోల్పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లని వ్యక్తి ఒకవైపు. మరోవైపు ప్రభుత్వ నియామక వ్యవస్థ. ఈ రెండింటి మధ్య ఉన్న గోడ ఎక్కడ కూలిపోయింది? పోలీసు వెరిఫికేషన్ జరిగిందా?
జరిగితే ఏం తేలింది?క్రిమినల్ రికార్డు బయటపడలేదా?బయటపడితే ఉద్యోగం ఎలా వచ్చింది . బయటపడకపోతే పోలీసు, జైలు, న్యాయ రికార్డుల మధ్య సమన్వయం ఎక్కడ?ఇది కేవలం ఒక వ్యక్తి ఉద్యోగం పొందిన కథ కాదు. ప్రభుత్వ వ్యవస్థలో ఒక జీవిత ఖైదీకి క్లీన్ చిట్ లాంటి జీవితం ఎలా లభించింది? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి.2004లో అతనికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా లభించింది. 2013లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు.ఒకవైపు జీవిత ఖైదు. మరోవైపు ఉత్తమ ఉపాధ్యాయుడు! ఇదేదో సినిమా లో జరిగిన స్టోరీ కాదు. వ్యవస్థను వెక్కిరిస్తున్న నగ్నసత్యం.
జైలు గుమ్మం దాటకూడని వ్యక్తి పాఠశాల గుమ్మంలోకి ఎలా ప్రవేశించాడు ? ప్రభుత్వ సేవ చేయకూడని వ్యక్తి ప్రభుత్వ జీతం ఎలా తీసుకున్నాడు? అవార్డు ఇవ్వడానికి ముందు అతని నేపథ్యాన్ని ఎవరూ పరిశీలించలేదా? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? తప్పు ఎవరిది?
వీరన్నదే తప్పు. అతనికి విధించిన జీవిత ఖైదు రద్దు కాలేదు. పెరోల్ గడువు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లకుండా నాలుగు దశాబ్దాలు బయట ఉండటం ఉద్దేశపూర్వకంగా శిక్ష తప్పించుకోవడమేనని హైకోర్టు స్పష్టం చేసింది.అతని భార్య వేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని తేల్చింది. అక్కడితో కథ ముగియదు కదా.వ్యక్తి నేరానికి శిక్ష పడాలి. వ్యవస్థ వైఫల్యానికి కూడా జవాబుదారీ ఉండాలి. జవాబుదారి లేని ఉద్యోగులను ఇక్కడ ఎందుకు శిక్షించడం లేదు . ఇదే అసలు ప్రశ్న?
40 ఏళ్ల పాటు వెతికిన వ్యవస్థకు ఒక ప్రశ్న!
ప్రభుత్వం తరఫున కోర్టుకు ఒక వివరణ వచ్చింది.
పెరోల్ గడువు ముగిసిన తర్వాత వీరన్న ఆచూకీ కోసం జైలు అధికారులు వరంగల్ రూరల్, మహబూబాబాద్ పోలీసులకు పలుమార్లు లేఖలు రాశారని పేర్కొన్నారు. 2012 నుంచి 2020 మధ్య కూడా అధికారులు అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. చివరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి 2024లో పట్టుకున్నారని నివేదిక ఇచ్చారు.1984లో చేయాల్సిన పని 2024లో ఎందుకు జరిగింది? నలభై ఏళ్లు ఎందుకు పట్టింది? ఆ నలభై ఏళ్లలో ఎంతమంది అధికారులు మారారు?
ఎన్ని ప్రభుత్వాలు మారాయి? ఎందరు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు?ఎందరు జైలు అధికారులు బదిలీ అయ్యారు. పదవీ విరమణ చేశారు? వారి నిర్లక్ష్యంకు శిక్ష లేదా?ఇది అవినీతా? లేక నిర్లక్ష్యమా? బాధ్యతారాహిత్యమా?
అవినీతి అనుమానానికి తావిచ్చేంత పెద్ద ప్రశ్నలు తలెత్తితే వాటిని దాచిపెట్టడం కూడా సరికాదు. అందుకే ప్రభుత్వం ఒక స్వతంత్ర అంతర్గత విచారణ చేయాలి. బాద్యులైన వారిని శిక్షించాలి.పెరోల్ ఉల్లంఘన తర్వాత 40 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? పోలీసు రికార్డుల్లో వీరన్న పేరు ఉందా? జైలు రికార్డులు ఎక్కడ ఉన్నాయి?ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయంలో పోలీసు వెరిఫికేషన్ ఎవరు చేశారు? అతని క్రిమినల్ కేసు ఎందుకు బయటపడలేదు? ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు ఎంపిక సమయంలో ఎలాంటి ధృవీకరణ జరిగింది? ఈ వ్యవహారంలో ఎక్కడైనా విధి నిర్వహణలో లోపం జరిగిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సహకరించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. సమాధానాలు రాకపోతే అనుమానాలు మాత్రం చావవు.జైలు శాఖకు హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ఖైదీని తిరిగి జైలుకు పంపడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెరోల్పై విడుదలైన ఖైదీలను పర్యవేక్షించేందుకు మార్గదర్శకాలు, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ప్రత్యేక టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేసి పెరోల్ గడువు ముగిసిన వెంటనే ఖైదీలు జైలుకు తిరిగి వచ్చేలా నిఘా పెట్టాలని సూచించింది.
ఒక ఖైదీని ట్రాక్ చేయడానికి ప్రభుత్వం వద్ద కనీసం ఒక చిరునామా ఉంటుంది. పోలీసు స్టేషన్ ఉంటుంది. కుటుంబ వివరాలు ఉంటాయి.
కేసు నంబర్ ఉంటుంది.
జైలు రికార్డు ఉంటుంది.
కోర్టు తీర్పు ఉంటుంది.
ఇన్ని ఆధారాలు ఉన్నా
మనిషి మాత్రం కనిపించలేదు! అయితే మన వ్యవస్థలో రికార్డులు ఎందుకు ఉన్నాయి?
మనుషులను కనిపెట్టడానికా? లేక ఫైళ్లను నింపడానికా?నేరస్తుడిని కాదు వ్యవస్థను కూడా శిక్షించాలి! ఇక్కడ శిక్ష అంటే అధికారులను జైలుకు పంపాలని కాదు.జవాబుదారీతనం కావాలి. ఎవరి కాలంలో ఏం జరిగిందో గుర్తించాలి.ఎక్కడ విధి నిర్వహణలో లోపం జరిగిందో తేల్చాలి.నియామక వ్యవస్థ ఎక్కడ విఫలమైందో తెలుసుకోవాలి. పెరోల్ మానిటరింగ్ ఎందుకు పనిచేయలేదో చెప్పాలి.అవార్డు వ్యవస్థలో పరిశీలన జరిగిందా లేదా వెల్లడించాలి. తప్పు చేసినవారు ఎవరైనా చర్యలు తీసుకోవాలి.అప్పుడు మాత్రమే వ్యవస్థ సంస్కరించబడింది అనే విశ్వాసం వస్తుంది. లేకపోతే ఇవన్నీ కాగితాల మీదే మిగిలిపోతాయి. సినిమాకు ఓ మంచి కథ దొరుకుతుంది అంతే.
రేపు మరో వీరన్న ఉండకూడదు! ఇది ఒక్క వీరన్న కథగా ముగిస్తే మనం మరోసారి అదే తప్పు చేస్తున్నాం. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కనీసం చేయాల్సిన పని ప్రతి పెరోల్ ఖైదీకి డిజిటల్ ట్రాకింగ్. పెరోల్ ముగియకముందే ఆటోమేటిక్ అలర్ట్. గడువు దాటితే వెంటనే పోలీసులకు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా పెరోల్ ఖైదీల కేంద్ర డేటాబేస్.జైలు–పోలీసు–కోర్టు వ్యవస్థల మధ్య డేటా అనుసంధానం. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కు మరింత కట్టుదిట్టమైన విధానం.అవార్డుల ఎంపికలోనూ అవసరమైన స్థాయిలో నేపథ్య పరిశీలన. ఇవి చేయడం కష్టం కాదు.కష్టం ఒక్కటే వ్యవస్థలో ఎవరో ఒకరు నిజంగా బాధ్యత తీసుకోవాలి.
ఒక జీవిత ఖైదీ నాలుగు దశాబ్దాలు బయట తిరిగితేఅతను చట్టాన్ని మోసం చేశాడు. అది నేరం.కానీ అదే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసి, అవార్డు పొంది, పదవీ విరమణ చేసేంత వరకు వ్యవస్థ గుర్తించలేకపోతే అది ఎవరి వైఫల్యం?ఒక ఉపాధ్యాయుడి చేతిలో పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చేతిలో ప్రజల విశ్వాసం ఉంటుంది.అలాంటి వ్యక్తి నేపథ్యం తెలుసుకోలేని వ్యవస్థప్రజల భద్రత గురించి ఎలా భరోసా ఇస్తుంది?
అవినీతి ఉంటే బయటపెట్టాలి. నిర్లక్ష్యం ఉంటే శిక్షించాలి. సాంకేతిక లోపం అయితే సరిచేయాలి. జవాబుదారీతనం లేకపోతే జవాబుదారీతనం తీసుకురావాలి. లేకపోతే రేపు మరో జీవిత ఖైదీ పెరోల్పై బయటకు వచ్చి ప్రభుత్వ సేవకుడిగా మారినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు.ఇది వీరన్న కథ కాదు.
ఇది మన పరిపాలనా వ్యవస్థకు పడిన నల్లమచ్చ. ఆ మచ్చను సబ్బుతో కాదు జవాబుదారీతనంతోనే కడగాలి.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















