Revanth Reddy నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ రైజింగ్ 2047” సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ప్రధాని Narendra Modiను కోరారు. హైదరాబాద్లోని HITEX Exhibition Centerలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ Jishnu Dev Varma, కేంద్ర మంత్రులు G Kishan Reddy, Bandi Sanjay Kumar, రాష్ట్ర మంత్రులు మరియు పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇది అభివృద్ధి ఉత్సవం” అని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధి, జాతీయ భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. “ముందు భారత్ దేశం.. తర్వాత ప్రజలు.. ఆ తర్వాతే పార్టీ” అనే భావనతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటించిన “వికసిత్ భారత్ 2047” లక్ష్యానికి భాగస్వాములమయ్యామని, అదే స్ఫూర్తితో “తెలంగాణ రైజింగ్ 2047”ను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రధాని మోదీ రావడం సంతోషకరమన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ప్రధాని స్వయంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని Manmohan Singh సహకారంతో నరేంద్ర మోదీ “గుజరాత్ మోడల్”ను అభివృద్ధి చేశారని రేవంత్ గుర్తుచేశారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా ప్రధాని మోదీ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. “నాటి మన్మోహన్ సింగ్ గారు మోదీకి అందించిన సహకారం తరహాలో, మీరు తెలంగాణకు అండగా నిలవాలి” అని అన్నారు.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో మహానగరాల పాత్ర కీలకమని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలంటే మెట్రో నగరాల అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ఆరు ప్రధాన నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక “సింగిల్ విండో టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మూసీ నది పునరుద్ధరణ, మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం 12 లేన్ల హైవే వంటి ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదాలు అవసరమని తెలిపారు. ఈ అంశాలపై రెండు గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రధాని మోదీని కోరారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధిపై సానుకూలంగా ఉన్నారని, ప్రధాని కూడా పెద్ద మనసుతో రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారని రేవంత్ అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలకు ఈరోజే ఆమోదం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
దేశ అభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. “వికసిత్ భారత్ 2047” లక్ష్యాన్ని “తెలంగాణ రైజింగ్ 2047”తో అనుసంధానం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
TelanganaRising


















