పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే రాయలసీమ కు మోక్షం లభిస్తుంది
ఒకప్పుడు “రాయలేలిన సీమ… రత్నాల సీమ…” అని కీర్తించబడిన రాయలసీమ నేడు కరవు, వలసల ప్రతీకగా మారడం బాధాకరం. చరిత్రలో వైభవం, వర్తమానంలో వెనుకబాటు ఈ విరుద్ధ చిత్రం యాదృచ్ఛికం కాదు .ఇది విధానపరమైన నిర్లక్ష్యం పాలకుల వివక్ష ఫలితమే. కృష్ణా, పెన్నా , తుంగభద్ర , జయ మంగళినది వంటి ప్రధాన నదులు ఉన్నప్పటికీ, సాగునీటి సదుపాయాలు సరైన విధంగా అభివృద్ధి కాలేదు. ఫలితంగా, వ్యవసాయం అస్థిరంగా మారి, కరవు రాయలసీమకు శాశ్వత ముద్ర వేసింది. నీటి కొరత కేవలం పంటలను కాదు ప్రజల భవిష్యత్తునే ఎండగొట్టింది. ఈ పరిస్థితి వలసలను పెంచింది. పరిశ్రమల క్లస్టర్లు, రవాణా మౌలిక వసతుల అభివృద్ధి ఇవి కేవలం ప్రణాళికలుగానే కాక, కార్యాచరణగా మారాలి.స్పష్టమైన విధానాలు, దృఢ సంకల్పం, బాధ్యతాయుత పరిపాలన అవసరం.
పారిశ్రామిక అభివృద్ధి లో గతంలో ఏంతో కొంత మెరుగ్గా ఉన్న రాయలసీమ నేడు పూర్తిగా వెనుకబడింది. ఉన్న పరిశ్రమలు మూతపడటం ఫలితంగా రాయలసీమ వెనుకబాటు తనంకు గురవుతున్నది.
చారిత్రకంగా వెనుకబాటుతనానికి ప్రతీకగా చెప్పబడే రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలిగితేనే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో అభివృద్ధి అవకాశాలు అపారంగా ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలసీ అమలు లోపం ప్రధాన అడ్డంకిగా కనిపిస్తోంది. సరైన ప్రణాళిక, రాజకీయ సంకల్పం, పెట్టుబడుల ఆకర్షణతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా శక్తివంతమైన కేంద్రంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.సహజ వనరులు, భౌగోళిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నీటి కొరత, పెట్టుబడుల లోపం వంటి సమస్యలు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన రాయలసీమ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతాన్ని పరిశీలిస్తే ఇక్కడ అనేక పరిశ్రమలు ఉండేవి.
1970–80 మధ్య స్థాపన జరిగిన హిందూపురం నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2006–2010 మధ్య ఉత్పత్తి నిలిచిపోయింది.
తర్వాత పూర్తిగా మూతపడింది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.1980 లో గుంతకల్లు లో టెక్స్టైల్ పరిశ్రమ ప్రారంభం .గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు 2005–2012 మధ్య క్రమంగా మూతపడింది. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.1970 లో ప్రభుత్వ పరిశ్రమగా హిందూపురం లో ఇంజినీరింగ్ టూల్స్ తయారీకి ఏపి టూల్స్ ప్రారంభించారు. 1990 తర్వాత ప్రైవేట్ కంపెనీల పోటీ, టెక్నాలజీ అప్డేట్ లేకపోవడం వల్ల మూతపడింది.
1980 –90లో అనంతపురంలో లైటింగ్ ఉత్పత్తి ప్రారంభం . 2005 తర్వాత క్రమంగా మూతపడింది. అలాగే పెనుకొండ వద్ద ఉన్న ఆల్విన్ కంపెనీ 1990 వరకు బాగా నడిచింది . తర్వాత మూతపడింది. మారుతి గోల్డ్ స్టార్ , రిచ్మెన్ సిల్క్ , కదిరి , హిందూపురం , ధర్మవరం లో ఉన్న పలు సిల్క్ ఇండస్ట్రీ స్ మూతపడ్డాయి. నంద్యాల రాయలసీమ షుగర్ & ఎనర్జీ , చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీలు, చిత్తూరు డైరీ / మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు , చిత్తూరు న్యూట్రిన్ చాక్లెట్ల పరిశ్రమ , పులివెందుల మిల్క్ ఫ్యాక్టరీ ఇలా రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఉన్న సుమారు 100 పరిశ్రమలు మూతపడ్డాయి . వేలాది మంది జీవనోపాధి కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి పూర్వ వైభవం రావాలంటే పరిశ్రమలు స్థాపన జరగాల్సిందే.
రాయలసీమలో ముఖ్యంగా సహజ వనరుల ఆధారిత పరిశ్రమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లో విస్తారంగా లైమ్ స్టోన్ లభిస్తుంది . సిమెంట్ పరిశ్రమలు అభివృద్ధి కి అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు సమీపం ఉండటం వల్ల లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయవచ్చు. సౌరశక్తి ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉండటం వల్ల రీన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా థర్మల్ , సోలార్ ,విండ్ పవర్ ప్రాజెక్టులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ విస్తరణతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. టమాటా, మామిడి, మిర్చి వంటి పంటల ప్రాసెసింగ్కు అవకాశాలున్నాయి . ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి.
అయితే అభివృద్ధి దిశలో పలు సవాళ్లు కొనసాగుతున్నాయి.తరచూ కరువు పరిస్థితులు వల్ల నీటికొరత పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా మారుతోంది.మౌలిక వసతుల లోపం . రోడ్లు, రైల్వేలు, పోర్ట్ కనెక్టివిటీ తక్కువగా ఉంది.
పెట్టుబడుల కొరత ,పెద్ద పరిశ్రమలు రావడంలో వెనుకబాటుకు గురవుతోంది. నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు ఇలా ఉన్నాయి. నదుల అనుసంధానం, మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి సమస్య పరిష్కారం చేయవచ్చు. ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉత్పత్తి ప్రారంభం తర్వాత అందించాలి. ధీర్ఘకాలం నిలదొక్కుకోవడానికి అవసరమైన విధానం తీసుకు రావాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు
ఇండస్ట్రియల్ కారిడార్లు కు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యంత కీలకం. \
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు
జాతీయ హైవేలు, రైల్వే లైన్లు అభివృద్ధి చేయాలి.ఇండస్ట్రియల్ కారిడార్లలో చేర్చాలి .రాష్ట్ర ప్రభుత్వంప్రాంతీయ సమతుల అభివృద్ధి విధానం పాటించాలి . నీటి ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాలి. పెట్టుబడులకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకురావాలి.రీన్యూవబుల్ ఎనర్జీ హబ్గా, ఎలక్ట్రానిక్స్ & మెటల్స్ హబ్ గా టూరిజం & ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చేయాలి. గ్రామీణ అభివృద్ధి, ఐటీపార్కుల స్థాపనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమ అభివృద్ధి కేవలం ప్రాంతీయ అవసరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆర్థిక పురోగతికి కూడా కీలకం. సరైన చర్యలు తీసుకుంటే, రాబోయే దశాబ్దాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందంజలో నిలవడం ఖాయం

















