ఐక్యూ (ఇంటెలిజెంట్ కోషియెంట్ )హోదాను ఇస్తుంది .ఈక్యూ (ఎమోషనల్ కోషియెంట్ ) జీవితాన్ని నిలబెడుతుంది. యస్ క్యూ సమర్థంగా జీవించడం నేర్పుతుంది.
ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అధికారులను ఎంపిక చేయడానికి మనం అత్యంత కఠినమైన పరీక్షలను నిర్వహిస్తున్నాం. లక్షల మంది పోటీ పడతారు. కొద్దిమంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. వారి మేధస్సును కొలవడానికి వందల ప్రశ్నలు అడుగుతున్నాం. వారి విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాం. జ్ఞాపకశక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని, పరిపాలనా అవగాహనను కొలుస్తున్నాం. కానీ నియంత్రణ శక్తిని , మానసిక దృఢత్వం ను పరీక్షించే పని సరిగా చేయడం లేదు.అధికారం చేతికి వచ్చిన తర్వాత ఈ మనిషి తన మనసును కూడా పరిపాలించగలడా? అదే ప్రశ్నకు సమాధానం వెతకని సమాజం నేడు మూల్యం చెల్లిస్తోంది.గత కొన్నేళ్లుగా దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు, మరికొందరు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఘటనలు వార్తల్లో నిలిచాయి. ప్రతి సంఘటన వెనుక కారణాలు వేర్వేరు కావచ్చు.
గత దశాబ్ద కాలంలో చోటుచేసుకున్న కొన్ని విషాదకర సంఘటనలు ఆ నమ్మకాన్ని ప్రశ్నించేలా చేశాయి. కొందరు సివిల్ సర్వీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు లేదా ఇతర తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ప్రతి ఘటన వెనుక కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు.రెండు రోజుల క్రితం త్రిపుర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)గా పనిచేస్తున్న అనురాగ్ ధన్కర్ అగర్తలాలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న బాత్రూమ్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.16 మార్చి 2015 బెంగళూరులో నివాసంలో డి. కె రవి ఐఏఎస్ మృతి. మెుదట ఇది హత్య అనే అనుమానం వ్యక్తం చేశారు.సిబి.ఐదర్యాప్తు అనంతరం ఆత్మహత్యగా పేర్కొన్నారు .ఆత్మహత్య ప్రేరేపణకు తగిన ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్ట్ సమర్పించింది.
7 అక్టోబర్ 2025 చండీగఢ్లో పురణ్ కుమార్ ఐపియస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు2014 లో ఢిల్లీలో రాకేష్ శంకర్ ఐ ఎఫ్ యస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్ )తుపాకీతో కాల్చుకొనిఆత్మహత్య చేసుకున్నారు.గణేష్ దాస్ అరోరా స్పెషల్ సెక్రటరీ, ఫిబ్రవరి 2026, చండీగఢ్ సెక్రటేరియట్ భవనం నుంచి దూకి మరణించారు.జితేంద్ర రావత్ IFS అధికారి మార్చి 2025, ఢిల్లీ లో నివాస భవనం నాలుగో అంతస్తు నుంచి పడి మరణించారు . పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అనుమానించారు. | దర్యాప్తు కొనసాగింది; సూసైడ్ నోట్ లభించలేదని నివేదికలు పేర్కొన్నాయి.అమర్ సింగ్ చాహల్ మాజీ IPS అధికారి, పంజాబ్ . పాటియాలా లో 22 డిసెంబర్ 2025 ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఆన్లైన్ మోసం వల్ల భారీ ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
త్రిదీప్ కుమార్ కొంవర్ కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. 2025లో గువాహటిలో భవనం నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు — నిజం. నివేదికల ప్రకారం, 2025జూలై 10న గువాహటిలోని మేజిస్ట్రేట్ కాలనీ ప్రాంతంలోని ప్రభుత్వ నివాస సముదాయంలో కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్య ప్రయత్నంగా అనుమానించారు .ముకేశ్ పాండే 2017లో బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ముకేశ్ పాండే ఘజియాబాద్ లోని రైల్వే ట్రాక్ పై శవమై కనిపించారు. కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారి పై నమోదైన అత్యాచార కేసును 2024 ఆగస్టులో పాట్నా హైకోర్టు కొట్టివేసింది.మహారాష్ట్రలోని నాగపూర్లో 2025 ఏప్రిల్ 11న ఇమామ్వాడ పోలీస్ స్టేషన్లో 28 ఏళ్ల మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 30 ఏళ్ల ఐపీఎస్ అధికారి దర్శన్ దుగడ్ పై అత్యాచార కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని, ఐపీఎస్ అయిన తర్వాత ముఖం చాటేశాడని బాధితురాలు ఆరోపించారు.
రాజస్థాన్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పై 22 ఏళ్ల యువతి అత్యాచారం, మోసం ఆరోపణలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.2023 సెప్టెంబర్ లో ఛత్తీస్ గఢ్ కు చెందిన ఐఏఎస్ అధికారిపై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయగా, సదరు అధికారి సదరు మహిళ తనను బ్లాక్ మెయిల్ చేసిందని కౌంటర్ కేసు పెట్టారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ట్రైనీ ఐపిఎస్ వివాదాస్పద సంఘటన ఈ సంఘటనలు ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతున్నాయి.ఇటీవల హైదరాబాద్కు చెందిన ప్రముఖ మానసిక నిపుణుడు ఒకరు చెప్పిన మాటలు ఆలోచింపజేస్తాయి. ఆయన అభిప్రాయం ప్రకారం, ఉద్యోగం సంపాదించడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఐక్యూ అయితే, జీవితంలో నిలదొక్కుకోవడానికి మరింత అవసరమయ్యేది ఈక్యూ భావోద్వేగ మేధస్సు.తెలివితేటలు గొప్పవి. కానీ అవి మనిషిని సంపూర్ణుడిని చేయవు.దేశంలో మేధస్సుకు కొదవ లేదు. కానీ భావోద్వేగ పరిపక్వతకు కొరత పెరుగుతోంది. పరీక్షలో మొదటి ర్యాంకు రావచ్చు.
జీవితంలో మాత్రం మొదటి సమస్య దగ్గరే కూలిపోవచ్చు.అధికారాన్ని సంపాదించవచ్చు. కానీ అధికారాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు.
వేల మందికి ఆదేశాలు ఇవ్వవచ్చు. కానీ తన కోపాన్ని మాత్రం అదుపు చేయలేకపోవచ్చు.అదే తేడా ఐక్యూకి, ఈక్యూకి.
ఐక్యూ అంటే మేధస్సు.
ఈక్యూ అంటే మనిషిగా ఉండగలిగే సామర్థ్యం. యస్ క్యూ అంటే సమర్ధత కలిగి ఉండటం.ఒకటి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
మరొకటి జీవితానికి సమాధానం చెబుతుంది. మరొకటి సమర్థంగా జీవించే సామార్థ్యాన్ని చెబుతుంది.మనుషులతో ఎలా మెలగాలి, వారి భావాలు–ఆలోచనలు ఎలా గ్రహించాలి, సమాజంలో ఎలా సరైన విధంగా ప్రవర్తించాలి అనే తెలివి దీనినే సామాజిక మేధస్సును యస్ క్యూ (సోషియల్ ఇంటిలిజెన్స్ కోషియెంట్) అంటారు.ఒక వ్యక్తి సమగ్ర విజయానికి ఐక్యూ జ్ఞానాన్ని ఇస్తుంది, ఈక్యూ భావోద్వేగ సమతుల్యతను ఇస్తుంది, యస్ క్యూ సమాజంలో సమర్థంగా జీవించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మూడు కలిసి ఉంటే వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం పెరుగుతుంది.ఈరోజు మన విద్యా వ్యవస్థ పిల్లలకు మార్కులు తెచ్చుకోవడం నేర్పుతోంది. ఉద్యోగాలు సంపాదించడం నేర్పుతోంది. విదేశాలకు వెళ్లడం నేర్పుతోంది. పోటీ పరీక్షలు గెలవడం నేర్పుతోంది. కానీ ఓటమిని ఎలా అంగీకరించాలో నేర్పుతోందా ?తిరస్కరణను ఎలా భరించాలో చెబుతోందా?‘లేదు’ అనే సమాధానాన్ని గౌరవించడం నేర్పుతోందా?
కోపాన్ని ఎలా నియంత్రించాలో బోధిస్తోందా?మహిళలను గౌరవించడం, అధికారాన్ని బాధ్యతగా వినియోగించడం, వ్యక్తిగత హద్దులను దాటకూడదనే సంస్కారాన్ని పెంచుతోందా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే
మనం ఇంజినీర్లను తయారు చేస్తున్నాం. కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తున్నామా? మనం ఐఏఎస్లను తయారు చేస్తున్నాం. కానీ నైతిక నాయకులను తయారు చేస్తున్నామా? మనం డాక్టర్లను తయారు చేస్తున్నాం. కానీ కరుణగల మనుషులను తయారు చేస్తున్నామా? మేధస్సు ఉన్న ప్రతి వ్యక్తి మంచివాడే అవుతాడని భావించడం సమాజం చేస్తున్న అతిపెద్ద పొరపాటు.ప్రపంచంలో జరిగిన ఎన్నో ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిలో కూడా అత్యంత తెలివైనవారు ఉన్నారు. తెలివి మంచితనానికి హామీ కాదు. ఉన్నత విద్య వ్యక్తిత్వానికి సర్టిఫికెట్ కాదు. పెద్ద హోదా నైతికతకు రుజువు కాదు.వ్యక్తిత్వాన్ని నిర్మించేది మార్కుల షీట్ కాదు. విలువలే.ఈ పరిస్థితిని మార్చాలంటే చిన్నచిన్న సంస్కరణలు కాదు ఆలోచనా విధానంలో విప్లవం అవసరం. బాల్యదశ నుంచే భావోద్వేగ విద్య తప్పనిసరి చేయాలి. పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్, ఎమోషనల్ లిటరసీ, సంఘర్షణ పరిష్కారం, పరస్పర గౌరవం, లింగసున్నితత్వం వంటి అంశాలను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్య అవగాహన, నాయకత్వంలో నైతికతపై శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు గోప్యమైన మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలు, క్రమం తప్పని కౌన్సెలింగ్ అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖలో అధికార దుర్వినియోగం, లైంగిక వేధింపులు, కార్యాలయ వేధింపులపై జీరో టాలరెన్సీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
కుటుంబాల్లో పిల్లలకు విజయం మాత్రమే కాదు, ఓటమిని అంగీకరించే సంస్కారం కూడా నేర్పాలి. అతి గారాబంగా పెంచడం మానుకోవాలి. పిల్లలకు ఇచ్చిపుచ్చుకునే దోరణి నేర్పాలి. పరిసరాల జీవన విధానాన్ని చూపాలి . బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు వాటి విలువను తెలియజేయాలి .సోషల్ మీడియా సృష్టిస్తున్న అవాస్తవ విజయ ప్రమాణాల గురించి యువతలో విమర్శనాత్మక ఆలోచన పెంచాలి. మానసిక ఆరోగ్య సహాయం కోరడాన్ని బలహీనతగా కాకుండా పరిపక్వతగా చూడాలి.ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ఇది కేవలం పాఠశాల బాధ్యత కాదు.ఇది కేవలం కుటుంబ బాధ్యత కూడా కాదు.ఇది సమాజం మొత్తం భుజాన మోసుకోవాల్సిన బాధ్యత.ఈరోజు మనం పిల్లలకు మేధస్సు మాత్రమే నేర్పితే రేపు వారు యంత్రాల్లా ఆలోచించే మనుషులుగా మారవచ్చు. కానీ మనం వారికి భావోద్వేగ పరిపక్వత, నైతిక విలువలు, సానుభూతి, బాధ్యత కూడా నేర్పితే వారు కేవలం విజయవంతులే కాదు విలువైన మనుషులుగా ఎదుగుతారు. దేశానికి అవసరమైనది కేవలం తెలివైన అధికారులు మాత్రమే కాదు. ప్రజల బాధను అర్థం చేసుకునే అధికారులు. దేశానికి అవసరమైనది కేవలం గొప్ప నాయకులు కాదు.నైతికంగా నిలబడే నాయకులు. దేశానికి అవసరమైనది కేవలం అధిక హోదాలు కాదు.అధికమైన మానవత్వం.
ఐక్యూ పరీక్షల్లో ఉత్తీర్ణుడిని చేస్తుంది. ఈక్యూ జీవితంలో మనిషిగా నిలబెడుతుంది. దేశం కోసం పనిచేసే ప్రతి అధికారి ముందుగా మంచి మనిషిగా ఉండాలి. హోదాను మేధస్సు సంపాదిస్తుంది.గౌరవాన్ని వ్యక్తిత్వం సంపాదిస్తుంది. అధికారాన్ని ప్రభుత్వం ఇస్తుంది. నాయకత్వాన్ని సమాజం ఇస్తుంది. కానీ మనిషితనాన్ని మనమే నిర్మించుకోవాలి. మనిషి మంచి మనిషిగా సంపూర్ణంగా జీవించాలి.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.
IQ EQ SQ


















