ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా రీ లోడెడ్ వెర్షన్తో ఓటీటీలోకి వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. రావడమే కాదు.. రికార్డుల మోత మోగించేలా.. అప్పుడే టాప్లో ట్రెండ్లోకి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా.. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఫుటేజ్ని మేకర్స్ యాడ్ చేసి ‘పుష్ప 2 రీలోడెడ్’ పేరుతో థియేటర్స్లో వదిలారు. మళ్లీ కలెక్షన్స్ పుంజుకుని.. దాదాపు రూ. 2000 కోట్ల మార్క్ను ఈ సినిమా అందుకున్నట్లుగా ఓ పోస్టర్ ఇటీవల బాగా వైరల్ అయింది. ఇక ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. ‘పుష్ప 2 రీ లోడెడ్’ వెర్షన్ పేరుతో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ‘నీ యవ్వ ఇక తగ్గేదే లే..’ అన్నట్లుగా అప్పుడే ఫైర్ని స్టార్ట్ చేసింది.
సంక్రాంతికి కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో.. అప్పుడే ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సంక్రాంతి స్పెషల్గా ఓటీటీ రిలీజ్ ఉండబోతుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను మైత్రీ మూవీస్ సంస్థ వెంటనే ఖండించింది కూడా. నెట్ఫ్లిక్స్ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని మైత్రీ వారు అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల అదనపు ఫుటేజ్ని యాడ్ చేసి.. థియేటర్స్లో ఫ్రెష్గా వదిలారు. ఇక మైత్రీవారు చెప్పిన 56 రోజుల గడువు పూర్తవడంతో.. ‘పుష్ప 2: ది రూల్’ రీ లోడెడ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అంతేకాదు, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అప్పుడే టాప్లో ట్రెండ్ కూడా అవుతోంది. చూస్తుంటే.. ఓటీటీలోనూ పుష్పరాజ్ తన ఫైర్ చూపించేలానే ఉన్నాడనేలా సోషల్ మీడియాలో టాక్ కూడా మొదలైంది. మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివితో.. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
‘పుష్ప2: ది రూల్’ కథ విషయానికి వస్తే.. శేషాచలం అడవులలో కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా మారిన పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్).. తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే.. తగ్గేదే లే అంటూ ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు. పుష్ప బయట ఫైరే కానీ.. ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఒక ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదా అని.. ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు పుష్ప. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? సీఎంనే మార్చేయాలనే ఆలోచన పుష్పకి ఎందుకు వచ్చింది? షెకావత్ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పుష్పరాజ్ ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ సంబంధం ఏంటి? తన ఫ్యామిలీకి పుష్ప దగ్గరయ్యాడా? అయితే ఎలా అయ్యాడు? అనేదే ఈ సినిమా కథ.