వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. పార్టీ నాయకులు, అనుచరులతో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.కాకినాడ పోర్ట్ లో దొరికిన రేషన్ బియ్యం ఏమైందని ప్రశ్నించారు పేర్ని నాని. సీజ్ చేసిన షిప్ నుంచి అన్ లోడ్ చేసిన 22 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎక్కడుందని నిలదీశారు. షిప్ లోకి లోడ్ చేసిన బియ్యం అంత కూడా 120 రైస్ మిల్లర్ల నుంచి వచ్చినట్టుగా దర్యాప్తులో తేలిందని, అదంతా ప్రభుత్వ రికార్డుల్లోనే ఉందని పేర్కొన్నారు.
సీజ్ ద గోడౌన్, సీజ్ ద షిప్ వ్యవహారంలో రాష్ట్రం మొత్తం మీద తన ఒక్కడి మీదే కేసు నమోదైందని పేర్ని నాని చెప్పారు. పౌర సరఫరాల శాఖ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, తనపై మాత్రం ఈ కేసు ఉందని చెప్పారు. తనకు ముందు గానీ, తన తరువాతీ గానీ మరెవరి మీద కూడా ఒక్క కేసును కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోయిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కేసు విషయంలో తన భార్య కోసం విపరీతంగా ప్రయత్నించారని విమర్శించారు పేర్ని నాని. భార్యను తీసుకుని రోజుకో చోట దాక్కుంటూ 15 రోజుల పాటు తిరిగారనని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తాను రాజకీయంగా చచ్చిపోవాలి.. రాజకీయాలను మానేయ్యాలి. ఎవరికీ రాకూడని దుస్థితి అది.. అని పేర్కొన్నారు.
తాను పడ్డ కష్టాలు ఏ పగోడికి కూడా రాకూడదని పేర్ని నాని. అదృష్టవశావత్తూ ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్ వచ్చాక కూడా వదల్లేదని, జనవరి 1వ తేదీన తన భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి సీఐ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వాపోయారు. రోజులు వాళ్లవి. ఒక వాతకు 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది.. అని పేర్ని నాని ధీమా వ్యక్తం చూశారు.కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, భార్యకు బెయిల్ వచ్చేంత వరకు మాట్లాడొద్దని సన్నిహితులు చెప్పిన సలహాల ఆధారంగా తాను కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యానని పేర్ని నాని అన్నారు. తన మౌనాన్ని టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. గోడౌన్ భార్య పేరు ఉందని, తనపై కేసుల వ్యవహారంలో ఇంట్లో ఆడవాళ్లను కూడా ఇరికించడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని చెప్పారు.
రాయకీయాల్లో ఉన్నప్పుడు భార్య గానీ, ఇంట్లో ఆడవాళ్ల మీద గానీ ఎటువంటి ఆస్తులు పెట్టకూడదని తనకు బుద్ధొచ్చిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా పాపపు సొమ్మును తీసుకోలేదని తేల్చి చెప్పారు. స్వార్థం కోసం అధికారాన్ని ఉపయోగించి ఏ పనీ చేయించుకోలేదని అన్నారు.ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందంటూ తనను ఇరికించడానికి మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నిస్తోన్నాడని, ఇంటి మీద టీడీపీ జెండా ఎగురుతున్న వాళ్లను అడిగినా కూడా ఇళ్ల పట్టా కోసం ఎవరికైనా లంచం ఇచ్చావా అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే అంటాడని అన్నారు. 25 వేలకు పైగా ఇళ్ల పట్టాల కోసం భూములు ప్రతి రైతుకు, ప్రతి పైసాకు చెక్కులు ఇచ్చామని చెప్పారు.
రేషన్ బియ్యం, ఇళ్ల పట్టాలు కొన్న భూముల్లో తనను జైలులో వేయిస్తానంటూ కొల్లు రవీంద్ర ప్రకటించి ఏడాది దాటిందని, ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడని ప్రశ్నించారు పేర్నినాని. నిఖార్సుగా బతుకుతున్నాం కాబట్టే తప్పుడు కేసులు పెట్టలేకపోయాడని అన్నారు.ఎటువంటి కేసులకైనా ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. భార్య జైలుకు పోకూడదనే ఒక్క కారణంతోనే గతంలో ఆమెను తీసుకుని ఊరు దాటాల్చిందని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. పేర్ని నాని గానీ, పేర్ని కిట్టు గానీ కేసులకు భయపడబోరని చెప్పారు.