యువ సామ్రాట్ నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా తమ వైవాహిక బంధం బలంగా ఉండేందుకు ఒక కచ్చితమైన నియమాన్ని పాటిస్తున్నామని వెల్లడించారు. గతేడాది వివాహ బంధంతో ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నామని చైతన్య తెలిపారు. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పర్సనల్ లైఫ్, వృత్తిపరమైన ఆసక్తుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వివాహం తర్వాత తమ జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని నాగ చైతన్య అన్నారు. కెరీర్ పరంగా ఇద్దరూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, తమ అనుబంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటిస్తామని చెప్పారు. “వృత్తిపరమైన పనుల వల్ల మేమిద్దరం కలిసి గడిపే సమయం తక్కువగా ఉంటుంది. అందుకే ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఉదయం, రాత్రి భోజనం తప్పనిసరిగా కలిసే చేయాలని నిర్ణయించుకున్నాం” అని చైతన్య వివరించారు.
వారాంతాలను పూర్తిగా తమ వ్యక్తిగత సమయానికే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. “ఆదివారాల్లో మాకు నచ్చినట్లు సమయం గడుపుతాం. ఇంట్లోనే మూవీ నైట్ ప్లాన్ చేసుకోవడం, బయట షికారుకు వెళ్లడం, ఇష్టమైన వంటకాలు ఆర్డర్ చేసుకోవడం లేదా కలిసే వండుకోవడం వంటివి చేస్తూ ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చుకుంటాం” అని తెలిపారు. తనకు రేసింగ్ అంటే ఇష్టమని, శోభితకు పుస్తకాలు చదవడం ఇష్టమని చెప్పారు. అయితే, ఇటీవల ఆమెకు రేస్ట్రాక్పై డ్రైవింగ్ నేర్పించానని, ఆ అనుభూతిని ఆమె ఎంతో ఆస్వాదించిందని చైతన్య సంతోషంగా పంచుకున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో తన నిజ జీవిత హీరోల గురించి కూడా చైతన్య మాట్లాడారు. తన కుటుంబ సభ్యులు కాకుండా, పారిశ్రామికవేత్త రతన్ టాటా అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన్ను ఒక స్ఫూర్తి ప్రదాతగా చూస్తానని చెప్పారు. “ఎలాన్ మస్క్ జీవిత ప్రయాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే కూడా నాకు అభిమానం. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే, దర్శకుడు రాజమౌళి అంటే ఎంతో ఇష్టం” అని నాగ చైతన్య తన అభిప్రాయాలను వెల్లడించారు.