Medical Negligence in India పై సుప్రీంకోర్టు ఆగ్రహం, అత్యవసర చికిత్స నిరాకరణ, ఆస్పత్రుల బాధ్యత, వైద్య నైతికత, అత్యాచార బాధితుల వైద్యం, చట్టపరమైన చర్యలు, మానవత్వంపై విశ్లేషణాత్మక కథనం.
వైద్యో నారాయణో హరిః ఈ ఒక్క మాటలో వైద్య వృత్తి గొప్పతనం దాగి ఉంది. భగవంతుడు ప్రాణాన్ని ప్రసాదిస్తే, ఆ ప్రాణాన్ని కాపాడే బాధ్యతను వైద్యుడి చేతుల్లో ఉంచాడు. అందుకే భారతీయ సంస్కృతి వైద్యుడిని దేవుడితో సమానంగా చూసింది. కానీ ప్రాణాల విలువ కంటే డబ్బు విలువ పెరిగినప్పుడు, సేవాధర్మం కంటే స్వార్థం ముందుకు వచ్చినప్పుడు, కరుణ స్థానంలో నిర్లక్ష్యం చేరినప్పుడు తెల్ల కోటు కేవలం ఒక దుస్తువుగానే మిగిలిపోతుంది. సమాజం లో నమ్మకమే చచ్చిపోతుంది. ఆసుపత్రికి ఆశతో వచ్చిన మనిషి, నమ్మకాన్ని కోల్పోయి తిరిగి వెళ్తే అది ఒక్క కుటుంబం విషాదం కాదు, సమాజం అనే మనస్సాక్షికి పడిన మచ్చగా మిగిలి పోతుంది. ప్రాణాలను కాపాడాల్సిన చేతుల్లో మానవత్వం చనిపోతే ఆ మరణానికి బాధ్యులు ఎవరు? దేవుడిగా పూజించిన వైద్యుడు తన దైవత్వాన్ని తానే కోల్పోతే దాన్ని విధి అనాలా? వ్యవస్థ వైఫల్యం అనాలా? లేక మనుషుల్లో మానవత్వం కరిగిపోతున్న సంకేతం అనాలా? ఇది ఒక సంఘటన కాదు మన సమాజం ముందు నిలిచిన ఒక ప్రశ్న.
అత్యాచారానికి గురై ప్రాణాలతో పోరాడుతున్న నాలుగేళ్ల పసిబిడ్డకు సకాలంలో వైద్యం అందించకుండా తలుపులు మూసేస్తే ఆ చిన్నారి ప్రాణాన్ని తీసింది ఒక్క నిందితుడేనా? లేక ఆలస్యం చేసిన వ్యవస్థా? లేక మౌనంగా చూసిన మన సమాజమా?
ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఏడాది మార్చి 16న జరిగిన ఘటన దేశ మనస్సాక్షిని కదిలించింది. కేవలం నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత, ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే ఆరోపణల ప్రకారం, రెండు ప్రైవేటు ఆస్పత్రులు వెంటనే అత్యవసర చికిత్స అందించకుండా నిరాకరించాయి లేదా ఆలస్యం చేశాయి. ఆ విలువైన సమయం వృథా కావడంతో బాలిక పరిస్థితి విషమించి చివరకు మరణించింది. అక్కడ కనిపించాల్సినది కరుణ . కానీ కనిపించింది నిర్లక్ష్యం. వినిపించాల్సినది ముందు చికిత్స మొదలు పెట్టండి అనే మాట కానీ ఇక్కడ కాదు ఇంకో చోటికి తీసుకెళ్లండి అన్న సమాధానం. ఈ సమాధానం దేనికి సంకేతం.
అత్యాచారం చేసిన దుర్మార్గుడి క్రూరత్వం ఒకవైపు అయితే ప్రాణం కాపాడే అవకాశం ఉన్నా వైద్యం నిరాకరించిన వైద్యుల నిర్లక్ష్యం మరోవైపు. ఒకరు ఆమె శరీరాన్ని గాయపరిస్తే మరొకరు ఆమెకు మిగిలిన ప్రాణాన్ని కాపాడే అవకాశాన్నే చంపేశారు. ఈ ఘటనపై శుక్రవారం 17/72026 న SupremeCourt వ్యక్తం చేసిన ఆగ్రహం దేశ న్యాయవ్యవస్థ మనస్సాక్షికి ప్రతిరూపం. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రతి వైద్యుడు వినాల్సిన హెచ్చరిక. ఆ బాలిక పేద కుటుంబానికి చెందినది కాబట్టే ఇలా జరిగిందా?అన్న ప్రశ్న కేవలం కోర్టు ప్రశ్న కాదు ఈ దేశంలోని కోట్లాది పేదల గుండెల్లో దాగి ఉన్న ఆవేదన. విధినిర్వహణలో విఫలమైన వారు తమ పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకునే అర్హత కూడా కోల్పోయారు అన్న వ్యాఖ్య తెల్లకోటుకు సమాజం ఇచ్చిన చివరి హెచ్చరిక. ఈ వ్యాఖ్యలు కేవలం ఇద్దరు వైద్యులపై చేసిన విమర్శలు కావు. మానవత్వాన్ని మరచిపోయిన వైద్య వ్యవస్థకు సమాజం తరపన వినిపించిన గట్టి హెచ్చరిక. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య లోని భావోద్వేగం ప్రతి కలం లోని ఇంకు చుక్క సమాజానికి తెలపాలి. సమాజాన్ని మేల్కొల్పాలి. మెడికల్ కౌన్సిల్ ఈ వ్యాఖ్యను నిర్లక్ష్యం చేయకుండా అందులోని భావోద్వేగాన్ని అర్థం చేసుకొని ఆ డాక్టర్ల పై , ఆసుపత్రి యాజమాన్యం పైన తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నిందితుడికి శిక్ష పడాలని దేశం మొత్తం కోరుతున్నారు. కానీ ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి వైద్యం నిరాకరించిన వైద్యులకు కూడా అదే స్థాయిలో శిక్ష పడాలని ఎందుకు గళం వినిపించదు? వైద్య నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ప్రాణం కూడా ఒక హత్యతో సమానమైన సామాజిక విషాదమే .
అత్యాచారం ఒక నేరం. కానీ అత్యవసర పరిస్థితిలో చికిత్స నిరాకరించడం కూడా ఒక ప్రాణాంతక వైఫల్యమే. భారత చట్టాలు, వైద్య నైతిక విలువలు స్పష్టంగా చెబుతున్నాయి . ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి ముందుగా చికిత్స అందించడం ప్రతి ఆస్పత్రి, ప్రతి వైద్యుడి మొదటి బాధ్యత. డబ్బు, పోలీసు కేసు, పరిపాలనా ప్రక్రియలు ఇవన్నీ తర్వాతి విషయాలు. ప్రాణం ముందు మిగతావన్నీ చిన్నవే.
ఈరోజు మాట్లాడాల్సింది కేవలం కోర్టు మాత్రమే కాదు. ప్రభుత్వాలు మాట్లాడాలి. రాజకీయ పార్టీలు మాట్లాడాలి. మేధావులు మాట్లాడాలి. స్వచ్ఛంద సంస్థలు వీధుల్లోకి రావాలి. వైద్య సంఘాలు కూడా మౌనం వీడాలి. ఒక చిన్నారి ప్రాణం విషయంలో కూడా మానవత్వం చనిపోతే, రేపు సామాన్యుడి ప్రాణాలకు భరోసా ఎక్కడ ఉంటుంది?
ప్రతి రాజకీయ పార్టీ మహిళల భద్రత గురించి సభల్లో మాట్లాడుతుంది. కానీ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం నిరాకరించిన వైద్యులపై కఠిన చట్టాలు అమలు చేయాలని ఎన్నిసార్లు ఉద్యమించింది? మేధావులు సమాజ నైతిక విలువల గురించి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ప్రాణాన్ని డబ్బుతో కొలిచే వైద్య వ్యవస్థపై ఎంత తీవ్రంగా స్పందించారు? మహిళా సంఘాలు, బాలల హక్కుల సంస్థలు, మానవ హక్కుల సంఘాలు అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష కోరినంత తీవ్రంగా, వైద్యం నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యల కోసం ఉద్యమించాలి.
ఇది వైద్య వృత్తిపై దాడి కాదు. మానవత్వాన్ని అవమానించిన కొందరిపై సమాజం విధించే నైతిక తీర్పు. దేశంలో వేలాది మంది వైద్యులు తమ వ్యక్తిగత సౌకర్యాలను పక్కనపెట్టి రాత్రింబవళ్లు సేవ చేస్తున్నారు. వారి త్యాగం వల్లే ఈ వృత్తికి గౌరవం ఉంది. అలాంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి. అయితే కొందరి నిర్లక్ష్యం మొత్తం వైద్య సమాజం ప్రతిష్ఠపై చెరగని మచ్చ వేస్తోంది. ఒక వైద్యుడి తెల్లకోటు కేవలం యూనిఫాం కాదు అది ఒక ప్రాణానికి ఇచ్చే భరోసా. ఆ భరోసానే కోల్పోతే, సమాజం ఎవరిని నమ్మాలి.? వైద్య వృత్తిని కళంకితం చేస్తున్న నిర్లక్ష్య వైద్యులను చట్టం ముందుకు తీసుకురావాల్సిందే. డాక్టర్లు తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితం లభించకపోవచ్చు అలాంటప్పుడు డాక్టర్ల పై ఆవేశంతో దాడులు చేయడం కూడా తప్పు. అలాంటి పద్దతులు మానుకోవాలి.
ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పనిచేయాలి. అత్యవసర వైద్యం నిరాకరించే ఆస్పత్రుల లైసెన్సులను వెంటనే సస్పెండ్ చేసే విధానం ఉండాలి. విధి నిర్వహణలో విఫలమైన వైద్యులపై కేవలం శాఖాపరమైన విచారణలు కాదు, అవసరమైతే చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అత్యవసర చికిత్స అందించకపోవడం వల్ల మరణం సంభవిస్తే, ఆ నిర్లక్ష్యానికి తగిన బాధ్యతను చట్టం స్పష్టంగా నిర్ణయించాలి. అప్పుడే ఆస్పత్రి గుమ్మం వద్ద మరో గుండె అన్యాయంగా ఆగిపోదు.
న్యాయస్థానాలు ఈ తరహా కేసుల్లో వేగవంతమైన విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కేసు కూడా మరొక ఫైల్గా దుమ్ము పట్టకూడదు. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహం కఠినమైన శిక్షగా మారినప్పుడే భవిష్యత్తులో ఎవరికైనా చట్టం అంటే భయం కలుగుతుంది. ఒక నాలుగేళ్ల చిన్నారి మరణం మనకు ఒక ప్రశ్న వేసి వెళ్లింది. అత్యాచారం చేసిన వాడే హంతకుడా?ప్రాణం కాపాడే అవకాశం ఉండి కూడా వైద్యం నిరాకరించిన వారు దోషులా ? నిర్దోషులా…?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఒక్క కోర్టు కాదు. సమాజం చెప్పాలి. ప్రభుత్వం చెప్పాలి. రాజకీయాలు చెప్పాలి. వైద్య వ్యవస్థ చెప్పాలి. లేకపోతే రేపు మరో పేద తల్లి తన బిడ్డను ఒడిలో ఎత్తుకుని ఆస్పత్రి గుమ్మం వద్ద నిలబడినప్పుడు ఆమెకు ముందుగా కనిపించేది డాక్టర్ కాదు మానవత్వాన్ని కోల్పోయిన ఒక వ్యవస్థ మాత్రమే. అత్యవసర చికిత్స కూడా ఆర్థిక స్థోమతను బట్టి నిర్ణయిస్తే, రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కు ఎక్కడ నిలుస్తుంది?
మెడికో లీగల్ కేసుల్లో అత్యవసర వైద్యం నిరాకరించిన ఆస్పత్రులు, వైద్యులపై చట్టపరమైన చర్యలు వేగవంతం కావాలి. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల అమలును కచ్చితంగా పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి. ప్రభుత్వం, వైద్య సంస్థలు, సమాజం కలిసి బాధ్యత వహించాలి.
అత్యాచారం చేసిన నిందితుడికి శిక్ష పడితే న్యాయం పూర్తికాదు. ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉన్నప్పటికీ చేతులు ముడుచుకున్న ప్రతి వ్యవస్థ కూడా తన బాధ్యతకు జవాబు చెప్పాలి. లేదంటే వైద్యో నారాయణో హరిః అనే మహోన్నతమైన మాట చరిత్ర పుస్తకాలలో మాత్రమే మిగిలిపోయే రోజు ఎంతో దూరంలో ఉండదు.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















