Indian Students in USA : డాలర్ కలల వెనుక కనిపించని నేరాల ఉచ్చు
డాలర్ ఈ ఒక్క పదమే నేటి యువత కలలకు ప్రతీకగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో విలాసవంతమైన జీవితం, ఉన్నత విద్య, భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకుని వేలాది మంది యువత అమెరికా బాట పడుతున్నారు. తమ పిల్లలు విదేశాల్లో చదివి, అక్కడే స్థిరపడి విజయవంతమైన జీవితాన్ని గడపాలని తల్లిదండ్రులు కూడా కలలు కంటున్నారు. కానీ డాలర్ కలల వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? అమెరికా జీవితం నిజంగా అందరూ ఊహించినంత సులభమా? అమెరికా ఈ పేరు ఇప్పటికీ లక్షలాది భారతీయ విద్యార్థుల ఆశయాలకు ప్రతీక. ప్రపంచ స్థాయి విద్య, మెరుగైన ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబానికి గర్వకారణమైన జీవితం ఈ నాలుగు మాటల చుట్టూనే వేలాది మధ్యతరగతి కుటుంబాల కలలు తిరుగుతుంటాయి. ఇల్లు అమ్మేసైనా, పొలం తాకట్టు పెట్టి అయినా, అప్పులు చేసైనాసరే పిల్లవాడిని అమెరికాకు పంపితే జీవితమే మారిపోతుందన్న నమ్మకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. డాలర్ల రంగుల కల మారలేదు.
అయితే కాలం మారుతోంది. అమెరికా చేరడమే విజయానికి హామీ అనే భావన క్రమంగా వాస్తవాల ముందు నిలవలేకపోతోంది.
అయితే అమెరికా చేరిన తర్వాత వాస్తవ పరిస్థితులు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. యూనివర్సిటీ ఫీజులు, ఇంటి అద్దెలు, ఆరోగ్య బీమా, నిత్యావసరాల ఖర్చులు భారీగా ఉంటాయి. చదువుతో పాటు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే పరిస్థితి చాలా మంది విద్యార్థులకు ఎదురవుతోంది.
చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికినా సవాళ్లు ముగిసిపోవు. ఉద్యోగ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. కంపెనీల నియామక విధానాలు మారడం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం, ఉద్యోగాల కోతలు వంటి పరిణామాలు అనేక మందిని అనిశ్చితిలోకి నెట్టేస్తాయి. ఉద్యోగం, వీసా, భవిష్యత్తు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.
ఉద్యోగ మార్కెట్లో అనిశ్చితి, ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు, రోజుసాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న పరిస్థితులు, కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారడం, వలస విధానాల్లో కఠినతరం అవుతున్న నిబంధనలు ఇవన్నీ విదేశీ విద్యార్థుల భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కానీ వీటన్నింటికంటే నిశ్శబ్దంగా, అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న మరో ముప్పు ఉంది. అదే సైబర్ నేరాల ఉచ్చు.
ఇటీవల అమెరికాలో కొందరు Indian Students in USA పై నమోదైన కేసులు, అరెస్టులు ఈ ప్రమాదాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అంతర్జాతీయ ఆర్థిక నేరాల దర్యాప్తులో ఎందుకు చిక్కుకుంటున్నారు? విదేశాల్లో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఎందుకు చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం ఇప్పుడు అత్యవసరం.
నేటి సైబర్ నేరగాళ్లు బ్యాంకులను దోచుకోవడం లేదు. అమాయకుల బ్యాంకు ఖాతాలనే తమ నేరాలకు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. విదేశాలకు కొత్తగా వెళ్లిన విద్యార్థులు ఆర్థిక ఒత్తిడిలో ఉంటారని వారికి బాగా తెలుసు. ఫీజులు, అద్దె, రోజువారీ ఖర్చులు… ఇవన్నీ తీర్చుకోవడానికి పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెతుకుతుంటారు. ఇదే వారి బలహీనత. ఇదే నేరగాళ్ల బలం.
ఇంటి నుంచే పని, వారానికి వేల డాలర్ల ఆదాయం, ఫైనాన్స్ అసిస్టెంట్, పేమెంట్ ప్రాసెసర్ , లోకల్ రిప్రెజెంటేటివ్ ఆకర్షణీయమైన పేర్లు. చట్టబద్ధమైన ఉద్యోగాల్లా కనిపించే ప్రకటనలు. మొదట చిన్న చిన్న పనులు. తర్వాత బ్యాంక్ ఖాతాలోకి డబ్బు వస్తుంది, మరో ఖాతాకు పంపమని చెబుతారు. ప్యాకేజీలు అందుకుని ఇంకెక్కడికో పంపాలని సూచిస్తారు. ఇది కంపెనీ విధానం, ట్యాక్స్ నిబంధన, విదేశీ చెల్లింపుల ప్రక్రియ అంటూ అబద్ధాలకు నమ్మకపు రంగులు అద్దుతారు. విద్యార్థికి అది ఉద్యోగంలో భాగంగా అనిపిస్తుంది. కానీ చట్టం దృష్టిలో అది మనీలాండరింగ్, మోసపూరిత లావాదేవీలు లేదా ఇతర ఆర్థిక నేరాలకు సహకరించినట్లుగా మారే ప్రమాదం ఉంటుంది.
ఇక్కడే అసలు విషాదం మొదలవుతుంది. నేరగాడు ఎక్కడో దాక్కుంటాడు. కానీ విచారణ ఎదుర్కొనేది విద్యార్థి. కేసు ఎదుర్కొనేది విద్యార్థి. వీసా, చదువు, ఉద్యోగం, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా అనిశ్చితిలో పడేది కూడా విద్యార్థే.
నాకు తెలియదు అనే మాట చట్టపరమైన రక్షణకు ప్రతి సందర్భంలో సరిపోదు. సంబంధిత అధికారులు ప్రతి లావాదేవీని, ప్రతి ఆధారాన్ని, ప్రతి పాత్రను పరిశీలిస్తారు. తెలియక చేసిన పొరపాటు శిక్షను పూర్తిగా తప్పించకపోయినా, ప్రతి కేసు పరిస్థితులపై ఆధారపడి నిర్ణయాలు మారవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బాధ్యత కేవలం విద్యార్థులదే కాదు. విదేశీ విద్యా కన్సల్టెన్సీలు వీసా ప్రక్రియలతో తమ బాధ్యత ముగిసిపోయిందనుకోకూడదు. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు సైబర్ భద్రత, ఆర్థిక నిబంధనలు, స్థానిక చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. భారత రాయబార కార్యాలయాలు నిరంతర హెచ్చరికలు, మార్గదర్శకాలు అందించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు కేవలం డబ్బు సంపాదించమని కాకుండా, చట్టబద్ధంగా సంపాదించమని గుర్తుచేయాలి.
విదేశీ విద్య అంటే కేవలం యూనివర్సిటీలో ప్రవేశం కాదు. అది పూర్తిగా కొత్త చట్టవ్యవస్థలోకి, కొత్త సామాజిక వ్యవస్థలోకి అడుగుపెట్టడం. అక్కడ ప్రతి సంతకం, ప్రతి బ్యాంక్ లావాదేవీ, ప్రతి డిజిటల్ చర్యకు చట్టపరమైన బాధ్యత ఉంటుంది. ఈ వాస్తవాన్ని ముందుగానే అర్థం చేసుకోకపోతే, కలల కోసం మొదలైన ప్రయాణం కోర్టు గదుల వద్ద ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పుడు మారాల్సింది మన ఆలోచనా విధానం. విదేశాలకు వెళ్లే విద్యార్థికి పాస్పోర్ట్, వీసా, అడ్మిషన్ లెటర్ ఎంత అవసరమో, సైబర్ అవగాహన కూడా అంతే అవసరం. మార్కుల మెమోలు ఎంత విలువైనవో, డిజిటల్ వివేకం కూడా అంతే విలువైనది. ఎందుకంటే నేటి ప్రపంచంలో ప్రతిభ ఒక్కటే విజయాన్ని నిర్ణయించదు. చట్టాలపై అవగాహన, సాంకేతిక జాగ్రత్త, సరైన నిర్ణయం తీసుకునే పరిపక్వత కూడా అంతే కీలకం.
డాలర్ కలలు కనడంలో తప్పు లేదు. కానీ ఆ కలలను కాపాడుకోవడానికి అప్రమత్తత అనే కవచం తప్పనిసరి. విదేశాల్లో ఒక తప్పు లావాదేవీ కేవలం బ్యాంకు ఖాతాను మాత్రమే కాదు… ఒక కుటుంబం చేసిన జీవితకాల త్యాగాలను, తల్లిదండ్రుల ఆశలను, యువకుడి భవిష్యత్తును కూడా స్తంభింపజేయగలదు.
అందుకే విదేశాలకు బయలుదేరే ప్రతి విద్యార్థి బ్యాగులో పాస్పోర్ట్తో పాటు మరో పత్రం కూడా ఉండాలి. అది కాగితం కాదు… “సైబర్ అవగాహన” అనే జీవన పాఠం. అదే నేటి ప్రపంచంలో అత్యంత విలువైన ప్రయాణ పత్రం.
డాలర్ కలలు కనడం తప్పు కాదు. కానీ ఆ కలలను నిజం చేయడానికి కేవలం ఆశలు సరిపోవు. సరైన ప్రణాళిక, ఆర్థిక సన్నద్ధత, వాస్తవ పరిస్థితులపై అవగాహన, మానసిక ధైర్యం కూడా అవసరం. అమెరికా జీవితం అందమైన అవకాశాల సమాహారం కావచ్చు అదే సమయంలో కఠినమైన పరీక్ష కూడా కావచ్చు. అందుకే, డాలర్ మాయాజాలాన్ని చూసే ముందు, దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మరింత తెలివైన అడుగు. H1B Visa
నరసింహారెడ్డి చందమూరి .
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















