కర్ణాటకలో 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఆనాడు పీసీసీ చీఫ్ గా డీకే శివ కుమార్ ఉన్నారు. ఆయన తన రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు అని ఆయనకే సీఎం చాన్స్ ఇవ్వాలని ఒక చర్చ సాగింది. అదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య కూడా బిగ్ షాట్ గా రేసులో నిలిచారు. ఆయనకు ఉన్న బలమైన సామాజిక వర్గం, రాజకీయ అనుభవం 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెద్దాయనకు తొలి అవకాశం అని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది.
అలా డీకే శివకుమార్ ని డిప్యూటీ సీఎంగా చేసింది. అయితే ఇదంతా 2024 ఎన్నికల వరకే అని ఆ తరువాత డీకేకి పగ్గాలు దక్కుతాయని కూడా ప్రచారం సాగింది. ఇక మరో వైపు చూస్తే తొలి రెండున్నరేళ్ళూ సిద్ధ రామయ్య ఆ తరువాత రెండున్నరేళ్ళూ డీకేకి అని కూడా ఒప్పందం ఉందని అంటూ వచ్చారు.
అలా చూస్తే కనుక ఈ ఏడాది నవంబర్ నాటికి రెండున్నరేళ్ళ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పాలన ముగుస్తుంది. మరి ఈ లెక్కలు చూసుకుని అన్నారో లేక డీకేకి కచ్చితంగా చాన్స్ ఇస్తారని భావించి అన్నారో తెలియదు కానీ మరో రెండు మూడు నెలలలో డీకే సీఎం అవుతారు అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆదివారం రామనగరంలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కొత్త సీఎం డీకే అని స్పష్టత ఇచ్చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో తొందరలోనే మార్పులు జరుగుతాయని ఆయన చెప్పాల్సింది చెప్పారు. అంతే కాదు డీకే కాబోయే సీఎం అని కుండబద్దలు కొట్టారు.
కర్ణాటకలో ఏమి జరుగుతుందో అన్నీ కాంగ్రెస్ హైకమాండ్ కి పూర్తిగా తెలుసు అని ఆయన అన్నారు. అందువల్ల తగిన సమయంలో తగిన నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి డీకే చేసిన కృషి అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు.
డీకే వ్యూహాలు ఆయన కఠోర పరిశ్రమల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ అంటున్నారు. ఇక మీడియా ఆయనను సూటిగా ఒక ప్రశ్న వేసింది. డీకే సీఎం అవుతున్నారని పక్కాగా మీరు చెబుతున్నారా అంటే ఎస్ ఆయనే సీఎం అవుతారు అని ధీమాగా ఇక్బాల్ హుస్సేన్ చెప్పడం విశేషం.
కర్ణాటక కాంగ్రెస్ లో విప్లవాత్మకమైన పరిణామాలు జరుగుతాయని బహుశా సెప్టెంబర్ తరువాత అవి జరిగి తీరుతాయని కూడా ఆయన అన్నారు. ఇందులో ఏ డొంక తిరుగుడూ లేదు, స్పష్టంగా చెబుతున్నా కచ్చితంగా డీకే సీఎం అవుతారు అని రాసిపెట్టుకోండి అన్నట్లుగానే ఇక్బాల్ హుస్సేన్ చెప్పేశారు.
దీంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ప్రస్తుతం సీఎం గా ఉన్న సిద్ధరామయ్య ఏమె తక్కువ వారు కాదు. ఆయన మొదట మాజీ ప్రధాని దేవేగౌడ దగ్గర శిష్యరికం చేసి మరీ రాజకీయంగా రాటుదేలారు. ఎపుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పావులు ఎలా కదపాలో ఆయనకే బాగా తెలుసు అని అంటున్నారు. ఇక ఏడున్నర పదులు దాటిన వారు సిద్ధరామయ్య.
ఆయనకి ఇది చివరి చాన్స్. అందువల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అని అంటున్నారు. మొత్తంగా పూర్తి కాలం అధికారంలో ఆయనే ఉండాలని ఆయన వర్గం కోరుకుంటోంది. ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సగం మంది డీకే వర్గంగా ఉంటే మరో సగం మంది సిద్ధరామయ్య వర్గంగా ఉన్నారు. రెండు వర్గాలు పోటాపోటీగా నడుస్తున్నారు.
అటు డీకే ఇటు సిద్ధరామయ్య ఇద్దరూ కూడా తగ్గేవారు కాదు. ఇద్దరూ బలమైన నేతలే. దాంతోనే కాంగ్రెస్ హైకమాండ్ కి ఇది చిక్కు సమస్యంగానే ఉందని అంటున్నారు. అయితే ఈ టెర్మ్ లో డీకేని సీఎంగా చేయకపోతే మాత్రం అది చివరికి కాంగ్రెస్ కే ఇబ్బందిగా మారుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.