చేతిలో అధికారం ఉన్నప్పుడుం ఏం చేయాలో.. మరేం చేయకూడదన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం చెప్పేసింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనన్న సవాళ్లు.. ప్రతికూలతల్ని జగన్ హయాంలో ఎదుర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి.. ప్రభుత్వ పగ్గాల్ని చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు రెండు లక్ష్యాల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఓవైపు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచటం.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించటం.
అధికారం చేతిలో లేనప్పుడే రెడ్ బుక్ పేరుతో అందరిని ఆకర్షించిన లోకేశ్.. ఆ బుక్ తో ఇప్పటివరకు చేసిందేమీ లేదు. కానీ.. రెడ్ బుక్ పేరును ఒక బూచీగా మాత్రం చూపిస్తున్నారని చెప్పాలి. రెడ్ బుక్ ఏంటి? తమకు.. తమ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన రాజకీయ ప్రత్యర్థుల పేర్లు రాయటం. అలా పేర్లు నమోదు చేసిన వారిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయటం. నిజానికి రెడ్ బుక్ ఉన్నా.. లేకున్నా.. జరిగేది ఇదే కదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ.. కొడాలి నాని.. పేర్ని నాని.. నందిగం సురేశ్..ఇలా చాలామంది వైసీపీ నేతలకు చుక్కలు కనిపించటం ఖాయమని.. కేసుల చిక్కులు పక్కా అన్న విషయం తెలిసిందే. ఏదైతే అంచనా వేశామో.. ఇప్పుడు అదే జరుగుతోంది తప్పించి కొత్తగా జరుగుతున్నదేమీ లేదు. అలాంటప్పుడు రెడ్ బుక్.. రెడ్ బుక్ రాజ్యాంగమని అదే పనిగా ప్రస్తావించటం ద్వారా దానికి మరింత హైప్ తీసుకురావటం తప్పించి ఇంకేమీ ఉండదు.
రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటూ తన ప్రసంగాల్లో తరచూ ప్రస్తావించే లోకేశ్.. ఓవిధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాలి. ఇంతకూ రెడ్ బుక్ లో ఏముంటుందో.. ఎవరి పేర్లు ఉన్నాయో ఓపెన్ గా చెప్పింది లేదు. కానీ.. రెడ్ బుక్ ను ఒక బూచీలా చూపించి.. రాజకీయ ప్రత్యర్థుల్ని దాని గురించి మాట్లాడేలా చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని చూసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తున్నాం. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో జగన్ కు మాత్రమే తెలియాలి.
రాజకీయ అధినేత ఎవరికైనా సరే.. ప్రజా సమస్యలు.. ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు.. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే తిరుగులేని అస్త్రాలు. రాజకీయ వ్యాఖ్యలతో తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలిగినట్లు కనిపించినా.. దాన్నే నమ్ముకుంటే ఎలాంటి లాభం ఉండదు. అందుకు భిన్నంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు పడుతున్న ఇబ్బందుల గురించి తరచూ మాట్లాడిన అవసరం జగన్ మీద ఉంది. అంతేకాదు.. క్యాలెండర్ ఒకటి సెట్ చేసుకొని.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద దీక్షలు.. నిరసనలకు ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎంతసేపు మళ్లీ అధికారంలోకి వస్తే తానేమీ చేస్తానన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు చేతికి అధికారం వస్తే ఏం జరుగుతుందో అన్న అంచనాకు తగ్గట్లు, జగన్ అధికారంలోకి వస్తే మరేం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంటుందన్న సత్యాన్ని జగన్ మర్చిపోకూడదు. రెడ్ బుక్ పేరుతో తన ఫోకస్ ను మార్చేలా తెలుగు తమ్ముళ్ల మైండ్ గేమ్ ను జగన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాను రెడ్ బుక్ ఎరకు చిక్కుకోకుండా.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాల్సిన అవసరం ఉంది. అంతే తప్పించి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరిని ఎలా టార్గెట్ చేస్తామన్న మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.