ఏపీలో వైఎస్సార్సీపికి ఎదురుగాలి దెబ్బలు తగులుతున్నాయి.. 2024 ఎన్నికల తర్వాత పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీపీలు కూడా చేజారిపోయాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ కూడా వైఎస్సార్సీపీ చేజారిపోయింది. కొత్త ఛైర్పర్సన్గా టీడీపీకి చెందిన కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికలో ఆమె తన ప్రత్యర్థిపై విజయం సాదించారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు టీడీపీ కౌన్సిలర్ల మద్దతు ఆమెకు లభించింది. టీడీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.
తిరువూరు నగర పంచాయతీలో మొత్తం 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.. వీరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఒక కౌన్సిలర్ విదేశాల్లో ఉన్నారు. మిగిలిన 19 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికలో పాల్గొన్నారు. ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో టీడీపీ బలం 11కి చేరింది. కొలికపోగు నిర్మల ఛైర్పర్సన్గా ఎన్నిక కావడం లాంఛమనే అయ్యింది. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని గతంలో ఎస్సీ జనరల్కు కేటాయించారు. 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాజిక సమీకరణాలతో ఎస్సీ మహిళకు కేటాయించింది. ఇప్పుడు టీడీపీ కూడా ఛైర్మన్ పదవిని మహిళలకే కేటాయించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ కొలికిపోగు నిర్మలకు పదవి దక్కింది. గతంలో వైఎస్సార్సీపీ చెందిన నిర్మల ఇటీవల ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు.
గతంలో కూడా రెండుసార్లు ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈ క్రమంలో ఎన్నిక సందర్భంగా గొడవలు జరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై ఈసారి ఎన్నికల కోసం 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయానికి నాలుగువైపులా బారికేడ్లు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం మీద వైఎస్సార్సీపీకి వరుసగా షాక్లు తప్పడంలేదు.