అందరికి గుడ్ బై అని వాట్సాప్ స్టేటస్ పెట్టిన బెంగళూరు(Bengaluru)కు చెందిన యోగా టీచర్ అదృశ్యమయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన సురేంద్ర(30) బెంగళూరులో ఉంటూ యోగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మరో యోగా టీచర్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.
ఆమెను కలిసేందుకు ఈనెల 22వ తేదీన హైదరాబాద్(Hyderabad)కు వచ్చాడు. జూబ్లీహిల్స్తో పాటు మరో ప్రాంతంలోని హోటల్లో ఉన్నాడు. శుక్రవారం పంజాగుట్టలోని నెక్ట్స్ గలేరాయి మాల్ వద్దకు ఇద్దరూ వచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో ఏమో.. కొద్దిసేపటి అనంతరం తనకు మనసు బాగాలేదని.. ఆమెకు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం అందరికీ గుడ్బై అని వాట్సాప్ స్టేటస్ పెట్టి మొబైల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో కంగారుపడ్డ బంధువులు, స్నేహితులు పలు ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సురేంద్ర కుటుంబసభ్యులు అతడికి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ప్రేమించిన యువతిని నగరంలో కలుసుకున్న అనంతరం ఆయన అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. యువతి, అతడి కుటుంబ సభ్యులను విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. వివరాలు తెలిసిన వారు 87125 71535, 78126 61275కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ వెంకటకిషన్ కోరారు.