వైసీపీకి చెందిన మాజీమంత్రి , సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేదని వైసీపీ నాయకులు గుసగుస లాడుకుంటున్నారు. గతంలో రేపల్లెలో అంబటి రాజకీయాలు చేశారు. 1989లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. రేపల్లె ఆయన సొంత ప్రాంతం. ఇక 2014లో వైసీపీ నుంచి సత్తెనపల్లిలో ఓడిపోయిన ఆయన .. 2019లో విజయం సాధించారు. సత్తెనపల్లిలో అంబటి తనకంటూ కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. రేపల్లె – సత్తెనపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి అనుచరుగణం ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా గుంటూరు వెస్ట్ కు తీసుకురావడం ద్వారా అంబటికి ఇబ్బందేనని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు వైశ్య సామాజిక వర్గం … బీసీలు కూటమి ప్రభావం ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది.
గత ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి అప్పుడు మంత్రిగా ఉన్న విడుదల రజనీని తీసుకువచ్చి గుంటూరు వెస్ట్ లో పోటీ చేయించారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన గల్లా మాధవి ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. పైగా వైసీపీలో ఇక్కడ చాలా గ్రూపులు ఉన్నాయి. ఇలాంటి చోట అంబటి రాజకీయాలు సాగటం కష్టమే అని నాయకులు చెబుతున్న మాట. గతంలో కావటి మనోహర్ నాయుడు కు మేయర్ పదవి ఇచ్చారు. ఆయన కోరకుండానే చిలకలూరిపేటకు పంపారు. వాస్తవానికి ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. మనోహర్ నాయుడు ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పైగా ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి – చంద్రగిరి ఏసురత్నం గతంలో పోటీ చేసి ఓడిపోయారు. వారు కూడా ఇప్పుడు అంబటికీ ఎంతవరకు సహకరిస్తారు ? స్థానిక నేతలు ఎంతవరకు సహకరిస్తారో అన్నది పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా అంబటికీ గుంటూరు పశ్చిమంలో రాజకీయాలు చేయటం అంత సులువు కాదు అన్నది వైసిపి వాళ్ళే చెబుతున్న మాట.