Welfare Schemes విషయంలో సంక్షేమం, ఉచిత పథకాలు, ప్రజాధనం, ఆర్థిక క్రమశిక్షణ, భవిష్యత్ తరాలపై భారం వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ. ప్రజలకు ఉచితాల కంటే అవకాశాలే శాశ్వత పరిష్కారమా?
సంక్షేమం ఎంత? ఉచితం ఎంత? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?
పేదవాడి కన్నీటిని తుడవాల్సిన సంక్షేమం రాజకీయ లబ్ధి కోసం పంచే ఉచితాలుగా మారితే? ప్రజల డబ్బుతో ప్రజలకే పథకాలు కానీ ఆ డబ్బుకు లెక్క ఎవరు చెప్పాలి?ప్రజాస్వామ్యంలో సంక్షేమం తప్పు కాదు. పేదవాడికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత. ఆకలితో ఉన్న కుటుంబానికి అన్నం, చదువుకోలేని పిల్లవాడికి విద్య, వైద్యం అందుకోలేని నిరుపేదకు ఆరోగ్య భరోసా ఇవన్నీ ప్రభుత్వ మానవీయ బాధ్యతలే.కానీ అసలు ప్రశ్న సంక్షేమం ఉండాలా? అనేది కాదు. సంక్షేమం ఎక్కడ ముగుస్తుంది? ఉచితం ఎక్కడ మొదలవుతుంది? రాజకీయ ప్రయోజనం కోసం ప్రజాధనం ఎక్కడ ప్రమాదంలో పడుతుంది?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇటీవల న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే మౌలిక ఆందోళనను మన ముందుకు తెచ్చాయి. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం ఒకటి అర్హత లేని వారికి కూడా ప్రజాధనం వెచ్చించడాన్ని ప్రశ్నించడం మరోటి. పేదల కోసం ఉద్దేశించిన పథకాలు నిజమైన అర్హులకు చేరాలి. అనర్హులు లబ్ధి పొందకుండా వ్యవస్థ ఉండాలి. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ తరాలపై పడే భారాన్ని కూడా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రజాధనం ఎవరి సొమ్ము?
ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయి ప్రజల నుంచే వస్తుంది. ఉద్యోగి చెల్లించే ఆదాయపు పన్ను . వ్యాపారి చెల్లించే జీఎస్టీ . సామాన్యుడు పెట్రోల్పై చెల్లించే పన్ను. రైతు, కార్మికుడు, మధ్యతరగతి కుటుంబం రోజువారీ కొనుగోళ్లలో చెల్లించే పరోక్ష పన్నులు ఇలా కోట్లాది మంది ప్రజల నుంచి సమకూరే డబ్బే ప్రభుత్వ ఆదాయం. అందుకే ప్రభుత్వం ఇస్తోంది అనే మాట కంటే ప్రజల డబ్బును ప్రభుత్వం మరో రూపంలో ప్రజలకే అందిస్తోంది అనే వాస్తవాన్ని గుర్తించాలి.
ప్రజాధనం ఖర్చు చేయడం తప్పు కాదు.కానీ ఎక్కడ ఖర్చు చేస్తున్నాం?
ఎవరికి ఇస్తున్నాం?
ఎందుకు ఇస్తున్నాం?
ఎంతకాలం ఇస్తాం?
దాని ఫలితం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి.
పేదవాడికి సంక్షేమం కావాలి. కానీ అనర్హుడికి ఎందుకు? రైతుకు పెట్టుబడి సాయం అవసరం. పేద కుటుంబానికి ఆహార భద్రత అవసరం.
విద్యార్థికి విద్యా సహాయం అవసరం. నిరుపేదకు వైద్య భరోసా అవసరం.కానీ అదే ప్రయోజనం నిజంగా అవసరం లేని వారికి కూడా నిర్బంధంగా అందితే? అప్పుడు అది సంక్షేమమా? లేక ప్రజాధనాన్ని విచక్షణ లేకుండా పంపిణీ చేయడమా?ఉదాహరణకు కొన్ని ఉచిత సేవలలో ఆర్థికంగా బలమైన వర్గాలు కూడా లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఆ విధానాన్ని పునఃపరిశీలించాల్సిందే. పథకాన్ని వ్యతిరేకించడం కాదు పథకం నిజంగా ఎవరికి అవసరమో గుర్తించడం ముఖ్యం. పేదవాడి కోసం కేటాయించిన నిధులు అనర్హుల చేతికి వెళితే నష్టం ఖజానాకు మాత్రమే కాదు నిజమైన లబ్ధిదారుడి హక్కుకూ జరుగుతుంది.
సంక్షేమమా? ఓటు బ్యాంకు రాజకీయాలా?
ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ప్రజల వాస్తవ అవసరాలను గుర్తించి లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడం ఒక విషయం. ఎన్నికల ముందు సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హామీల వర్షం కురిపించడం మరో విషయం. ఒక పార్టీ ఒక ఉచిత పథకం ప్రకటిస్తుంది.
మరో పార్టీ దానికంటే పెద్ద పథకాన్ని ప్రకటిస్తుంది.మూడో పార్టీ మరింత ఆకర్షణీయమైన హామీ ఇస్తుంది. ఇలా పోటీ అభివృద్ధిపై కాకుండా ఉచితాల పరిమాణంపై జరిగితే? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎటు వెళ్తుంది?ప్రభుత్వ ఆదాయానికి పరిమితి ఉంది. కానీ రాజకీయ హామీలకు పరిమితి లేకపోతే చివరకు ఆ భారాన్ని ఎవరు మోయాలి? ఈరోజు ఇచ్చే ఉచితం రేపటి అప్పుగా మారకూడదు. అప్పు చేసి సంక్షేమం ఎంతకాలం?
ప్రభుత్వం జీతాలు చెల్లించాలి.
పెన్షన్లు ఇవ్వాలి.
అప్పులపై వడ్డీలు చెల్లించాలి.
రోడ్లు నిర్మించాలి.
సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలి.
పాఠశాలలు, ఆసుపత్రులు బలోపేతం చేయాలి.
పోలీసు, పరిపాలన కొనసాగాలి.
మౌలిక వసతులు నిర్మించాలి.
పెట్టుబడులకు నిధులు కేటాయించాలి.
ఈ బాధ్యతలన్నింటి మధ్య సంక్షేమానికి సమతుల్యత అవసరం. అభివృద్ధిని తాకట్టు పెట్టి సంక్షేమాన్ని నడపడం సంక్షేమం కాదు.
అలాగే సంక్షేమాన్ని పూర్తిగా నిరాకరించడం కూడా సరైన మార్గం కాదు.
కావాల్సింది సంక్షేమం , అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ.ఉచిత సాయం కంటే అవకాశం గొప్పది. పేదవాడికి తాత్కాలికంగా చేయూత ఇవ్వడం అవసరం. కానీ అతడిని శాశ్వతంగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసే పరిస్థితిలో ఉంచడం ప్రభుత్వ విజయంగా భావించకూడదు. చేతికి చేప ఇవ్వడం సహాయం.చేప పట్టడం నేర్పడం సాధికారత.నాణ్యమైన విద్యతో ఉద్యోగం వచ్చే వ్యవస్థ గొప్పది.ఉచిత సాయం కంటే స్థిరమైన ఆదాయం గొప్పది. తాత్కాలిక భరోసా కంటే కుటుంబం స్వయం సమృద్ధిగా నిలబడే పరిస్థితి గొప్పది. ప్రభుత్వం ప్రజల జేబులో డబ్బు పెట్టడం మాత్రమే సంక్షేమం కాదు. ఆ జేబులోకి నిరంతరం డబ్బు వచ్చే మార్గాన్ని సృష్టించడమే అసలైన సంక్షేమం.
ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలనే కాదు. రాజకీయ పార్టీలను కూడాప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీలను కొన్ని మౌలిక ప్రశ్నలు అడగాలి. ఈ పథకానికి సంవత్సరానికి ఎంత ఖర్చు? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?ఎంతకాలం కొనసాగిస్తారు?నిజమైన లబ్ధిదారులు ఎంతమంది?అనర్హులను ఎలా తొలగిస్తారు?రాష్ట్ర అప్పుపై ప్రభావం ఎంత? ఈ పథకం ప్రజల ఆదాయాన్ని పెంచుతుందా?లేక ప్రభుత్వంపై ఆధారపడే కుటుంబాల సంఖ్యను మాత్రమే పెంచుతుందా? ఇలాంటి ప్రశ్నలు అడగడం సంక్షేమ వ్యతిరేకత కాదు. అది ప్రజాస్వామ్య బాధ్యత.
రేపటి అప్పు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం ఈరోజు ఒక రూపాయి ఉచితంగా ఇచ్చిందనుకుందాం.ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రజల నుంచే కదా. రేపు అదే ప్రభుత్వం అప్పు తీసుకుని మరో రూపాయి ఖర్చు చేస్తే? ఆ అప్పు ఎవరు తీర్చాలి? మన పిల్లలు. మన భవిష్యత్ తరాలు. అందుకే సంక్షేమంపై చర్చను రాజకీయ ఆరోపణల స్థాయిలో కాకుండా ఆర్థిక బాధ్యత స్థాయికి తీసుకురావాలి.
ఈ ప్రశ్న ఏ ఒక్క ప్రభుత్వానికో, ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు.ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటుంది. రేపు మరో ప్రభుత్వం వస్తుంది. కానీ ప్రజాధనం మాత్రం ప్రజలదే. ఇది ఎదో ఒక రాష్ట్రం , ఒక రాజకీయ పార్టీ విమర్శ కోసం కాదు . దేశం మెుత్తం అన్ని రాష్ట్రాలకు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది.రాజకీయాలు కూడా మారాలి. ఇక రాజకీయాలు ఏం ఉచితంగా ఇస్తారు? అనే ప్రశ్న చుట్టూ తిరగకూడదు.
ఏం శాశ్వతంగా నిర్మిస్తారు? అనే ప్రశ్న చుట్టూ తిరగాలి. ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చామన్నది పాలనకు కొలమానం కాదు. ఎంతమంది పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి?
ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి?
ఎంతమంది రైతుల ఆదాయం స్థిరపడింది?
ఎంతమంది పిల్లలకు నాణ్యమైన విద్య అందింది?
ఎంతమంది కుటుంబాలు ప్రభుత్వ సాయం అవసరం లేకుండా స్వయం సమృద్ధిగా నిలబడ్డాయి?
ఇవే పాలనా విజయానికి అసలు కొలమానాలు.
ప్రజలకు కావాల్సింది ఉచితాల సంస్కృతి కాదు.
అవకాశాల సంస్కృతి. ఆధారపడే జీవితాలు కాదు. ఆత్మగౌరవంతో నిలబడే జీవితాలు.
సంక్షేమం ఆగకూడదు.
కానీ సంక్షేమానికి హద్దు ఉండాలి. పేదవాడి హక్కు కాపాడాలి. ప్రజాధనం కాపాడాలి. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కాపాడాలి.
రేపటి తరాల భవిష్యత్తును కాపాడాలి. ఎందుకంటే ప్రజల డబ్బుతో ప్రజలకు పథకాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం ప్రభుత్వ ధర్మం.అది ఎక్కడ ఖర్చవుతుందో ప్రశ్నించడం ప్రజల హక్కు.రేపటి తరాలను అప్పుల భారంలోకి నెట్టకుండా చూడడం మనందరి బాధ్యత.చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఉచితం ఎంత ఇచ్చామన్నది కాదుప్రజల జీవితాలను ఎంత మార్చామన్నదే అసలు పాలనకు కొలమానంఓటును గెలిపించే ఉచితం తాత్కాలికంజీవితాన్ని మార్చే అవకాశం శాశ్వతం!ప్రజలను ఆకర్షించడం రాజకీయ విజయం కావచ్చు. ప్రజలను ఆత్మనిర్భరులుగా మార్చడం మాత్రం నిజమైన పాలనా విజయం.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















