విశాఖ ఇపుడు ప్రపంచాన్ని ఆకట్టుకోబోతోంది. విశాఖ నిజానికి ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందే మెగా సిటీగా పేరుంది. అంతే కాదు సిటీ ఆఫ్ డెస్టినీ గా చెప్పుకుంటారు. ఇక టూరిజం అంటే విశాఖే అని అంతర్జాతీయ పర్యాటకులు భావిస్తారు. అలా విశాఖ తనదైన కీర్తిని ఇప్పటికే గడించింది.ఈ నేపధ్యంలో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖను ఒక్కసారిగా అంతర్జాతీయంగా కీలకం చేసింది. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దేశ ప్రధాని విశాఖ నుంచే యోగాభ్యాసం చేయనున్నారు. ఆయన విశాఖ వాకిట నిలిచి సాగర తీరంలో గంట పాటు యోగాసనాలు వేయనున్నారు ఈ నెల 21 ఉదయం ఆరున్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.
దాంతో ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు ముందుగాన అంటే ఈ నెల 20వ తేదీన సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. ఆయన ఓడిషా నుంచి నేరుగా విశాఖ వస్తారు. ఈ మేరకు మోడీ అధికార పర్యటన షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. మోడీ విశాఖ తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేస్తారు. అక్కడ నుంచి ఆయన మరుసటి రోజు అయిన 21న నేరుగా విశాఖ సాగర తీరం చేరుకుంటారు. ఆయన ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న కాళీమాత టెంపుల్ వద్ద ఉన్న వేదిక మీద నుంచి అంతర్జాతీయ యోగా డేలో పాల్గొంటారు. అక్కడ నుంచే ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. యోగా ప్రాముఖ్యతతో పాటు అనేక విషయాలను ఆయన పంచుకుంటారు అనంతరం మోడీ అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
ఇక మోడీ పర్యటనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కూడా ఉంది. ఆయన కూడా ఈ నెల 20వ తేదీకే విశాఖ చేరుకుంటారు. ఆయన ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు అదే రోజు రాత్రి విశాఖలో బస చేస్తారు. అలాగే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని నేరుగా విశాఖకు ఒక రోజు ముందుగానే వస్తారు. ఇక అనేక మంది కీలక మంత్రులు కేంద్రంలోని మంత్రులు కూడా విశాఖకు ఒక రోజు ముందుగానే వస్తారు. దాంతో విశాఖ ఈ నెల 20 నుంచే కట్టుదిట్టమైన భద్రతావలయంలోకి వెళ్ళిపోతోంది. విశాఖలోని ప్రధాన రహదారులు అన్నీ నిఘా నీడలోకి వెళ్ళిపోతున్నాయి. విశాఖలోనే ప్రధాని ముఖ్యమంత్రి కీలక మంత్రులు కేంద్ర మంత్రులు అంతా ఒక రాత్రి బస చేయడం అరుదైన సందర్భం అని అంటున్నారు.
దాంతో విశాఖ వీవీఐపీ సిటీగా మారిపోతోంది అని అంటున్నారు. సహజంగా రాష్ట్ర రాజధానిలోనే ప్రధాని వంటి వారు బస చేస్తారు. ఇపుడు ఆ ఖ్యాతి విశాఖకే దక్కబోతోంది అని అంటున్నారు. ఒక రాత్రి అంతా దేశాన్ని ఏలే ప్రధాని రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి వీఐపీలు విశాఖలో ఉండడంతో భద్రతను పూర్తి స్థాయిలో పెంచేశారు. ఇపుడు విశాఖ పూర్తిగా కఠినమైన నిబంధలనతో ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోతోంది. అయినా సరే విశాఖ కీర్తి అంతర్జాతీయం అవుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఒక రోజు రాత్రి విశాఖలో బస చేస్తున్న ప్రధాని రాత్రి షెడ్యూల్ ఏమిటి అన్నది అయితే రివీల్ కాలేదు. బహుశా అనధికార కార్యక్రమాలు పార్టీ నేతలతో భేటీలు ఏమైనా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.