*టీటీడీ పాలకమండలి సమావేశం నిర్ణయాలు*
ఈరోజు జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు.
▪️తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.
▪️ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము నిర్వహించడం జరుగుతుంది.
▪️బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో సీఎం పాల్గొంటారు.
▪️సెప్టెంబరు 25వ తేదీన సీఎం చంద్రబాబు పిఏసి- 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు.
▪️అదేవిధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారు.
▪️ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాట్ లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టాం.
▪️ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.
▪️ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయి.
▪️తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్లో అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
▪️బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
▪️గరుడసేవనాడు 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించేందుకు చర్యలు తీసుకున్నాం.
▪️కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని కొలికోప్ప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో 7 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆమోదించాం.
▪️గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ.7.20 కోట్లతో రాజగోపురం, ముఖ మండపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో తాగు నీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు దశలవారిగా చేపట్టేందుకు నిర్ణయం.
▪️అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కల్యాణ మండపం తదితర అభివృద్ధి పనులకు రూ.5.73 కోట్లు, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం.
▪️హైదరాబాద్కు చెందిన శ్రీ బద్రి వెంకటరెడ్డి, శ్రీ బద్రి విష్ణువర్ధన్ రెడ్డిలు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబరు 141-2లో రూ.89.54 లక్షల విలువ చేసే 0.74 సెంట్ల స్థలాన్ని దాతలు టీటీడీకి విరాళంగా అందించారు. సదరు భూమిని స్వీకరించేందుకు ఆమోదం.
▪️సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మొదటి దశలో రాష్ట్రంలోని దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం.
ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ ఎం.ఎస్.రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నర్సిరెడ్డి, శ్రీ సదాశివరావు, శ్రీమతి జానకి దేవి, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ శాంతా రామ్, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీమతి రంగశ్రీ ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.