ఉత్తరప్రదేశ్లోని ఖాన్ పూర్లో ఒక మహిళ పెళ్లయిన ఐదు నెలల తర్వాత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తారింటి నుంచే ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన ఆమె, ఇంట్లో ఉంచిన నగలను కూడా తనతో తీసుకెళ్లింది. అంతేకాదు, రూ. 9 లక్షల నగదును కూడా ఎత్తుకెళ్లింది. మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, అత్తగారింటి వారు చాలా వెతికారు. కానీ ఆమె జాడ తెలియలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతిక్షా తివారీ అనే మహిళకు గతేడాది నవంబర్లో ఖాన్ పూర్లోని జరౌలికి చెందిన రామ్ తివారితో వివాహం జరిగింది. రామ్ తివారీ పూణేలో టీ కొట్టు నడుపుతాడు. రామ్ తివారితో పెళ్లయినా ప్రతిక్షా తన ప్రియుడితో రహస్యంగా మాట్లాడుతుండేది. పెళ్లయిన కేవలం 4 రోజులకే రామ్ తివారీ ఆమెను ప్రియుడు మనీష్ రజావత్తో మాట్లాతుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నాడు.
దీంతో రామ్ తివారీ భార్య గురించి ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిక్షా కొన్ని రోజుల పాటు పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను మళ్లీ అత్తారింటికి తీసుకొచ్చి, తాము ప్రతిక్షాకు బుద్ధి చెప్పామని, ఇకపై ఆమె అలా చేయదని చెప్పారు. ప్రతిక్షా కూడా తన తప్పును ఒప్పుకుంటూ మళ్లీ అలా చేయనని చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగి ఆ విషయాన్ని అక్కడితో ముగించారు. కానీ ప్రతిక్షా తన దగ్గర సీక్రెట్ గా ఒక కీ-ప్యాడ్ ఫోన్ ఉంచుకుంది. దానితో ఆమె దొంగచాటుగా తన ప్రియుడితో మాట్లాడుతుండేది. తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రతిక్షా మళ్లీ తన ప్రియుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈసారి ఆమె గురించి ఎవరికీ తెలియలేదు. ఏప్రిల్ 11న ఆమె ఇంట్లో ఉంచిన నగలు, డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. మొదట అత్తగారింటి వారు, ఆమె కుటుంబ సభ్యులు ఏప్రిల్ 18 వరకు ప్రతిక్షా కోసం వెతికారు. తర్వాత ఆమె అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ప్రతిక్షా, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.