ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నటన మాత్రమేనని, అందులో చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఆందోళన కేవలం ఎంపిక చేసిన అంశాలకే పరిమితమని, తిరుమలలో గతంలో లోపాలు బయటపడినప్పుడు లేదా భక్తులు చనిపోయినప్పుడు ఆయన నోరు మెదపలేదని రోజా విమర్శించారు.
చంద్రబాబు నాయుడుకు రక్షణ కవచం అవసరమైనప్పుడే పవన్ హఠాత్తుగా ధర్మం గురించి ప్రసంగాలు మొదలుపెడతారని, దీన్ని భక్తి కాదని, స్వచ్ఛమైన రాజకీయ నటన అంటారని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.
నిజాయితీ అంటే అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా నిజాన్ని చెప్పగలగడం అని, కానీ పవన్ కల్యాణ్ ఆ పని చేయలేదని రోజా పేర్కొన్నారు. మిత్రపక్షాల జవాబుదారీతనం రాబట్టాల్సినప్పుడు మౌనంగా ఉంటూ, సులభమైన లక్ష్యాలను ఎంచుకుని విమర్శిస్తారని దుయ్యబట్టారు.
తిరుమల సమస్యలను ఏ బోర్డు లేదా కమిటీ పరిష్కరించదని, చిత్తశుద్ధి, నిజాయతీ మాత్రమే పరిష్కరించగలవని, అయితే ఆ రెండూ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కొరవడ్డాయని రోజా హితవు పలికారు.
ఇతరులకు నీతులు చెప్పే ముందు పవన్ కల్యాణ్ ముందు నిలకడగా ఉండటం నేర్చుకోవాలని, తిరుమలకు కావాల్సింది చిత్తశుద్ధే కానీ, స్క్రిప్టెడ్ ఆక్రోశాలు కావని రోజా స్పష్టం చేశారు.


















