తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చర్చకు తెర తీశారు. రోటీన్ కు భిన్నంగా ఆయన వ్యవహరించారని చెప్పాలి. సాధారణంగా వేడుకలు.. పర్వదినాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్యమంత్రులు కాస్తంత మృదువుగా మాట్లాడటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఆయన కాస్తంత హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలకు తావు లేదని.. ఎవరి మతానని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు.
మత ప్రాదిపదికన దాడులు చేయాలని చూసిన వారిని.. అలాంటి ఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ‘ఇతర మతాల్ని కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో అసెంబ్లీలో చట్టం తెస్తాం. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా.. దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించేలా ఉన్న చట్టాలను కూడా సవరిస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తాం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్వేషించే వారిని సైతం ప్రేమించాలనన ఏసుక్రీస్తు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచిగా పేర్కొన్న సీఎం రేవంత్.. మరో ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. మైనార్టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని.. అది వారి హక్కుగా పేర్కొన్న రేవంత్.. అన్ని మతాల్ని సమానంగా గౌరవించాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఓవైపు తియ్యగా మాట్లాడుతూనే.. మరోవైపు మత విద్వేషాల్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారికి వార్నింగ్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
మనసు దోచుకునే మాటల్ని చెప్పటం అందరికి సాధ్యం కాదు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి స్వీట్ మాటలు మాట్లాడటం అరుదైన కాంబినేషన్ గా చెప్పాలి. అందరికి కనిపించే అంశాలు.. అవగాహన ఉన్న అంశాల్ని కనెక్టు చేయటం.. దానికి భావోద్వేగాన్ని రంగరించే టాలెంట్ అందరికి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టాలెంట్ వేరే లెవల్ అన్నట్లుగా చెప్పాలి. సందర్భానికి అనుగుణంగా కొన్ని అంశాల్ని ప్రస్తావించి.. అందరూ ఇట్టే కనెక్టు అయ్యేలా మాట్లాడటంలో రేవంత్ ముందుంటారు.
తాను పాల్గొనే ఏ సభలో అయినా.. కార్యక్రమంలో అయినా సరే.. పాత విషయాన్ని కొత్తగా.. సరికొత్తగా.. ఎవరూ గమనించని అంశాల్ని అందరూ గమనించేలా.. మాట్లాడేలా చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించటం ద్వారా చాలా మందికి ఇట్టే కనెక్టు అయ్యేలా చేశారు రేవంత్. ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించింది.
ఎల్ బీ స్టేడియం వేదికగా నిర్వహించిన ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ పలు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన ఆయన.. వాటి పరిష్కారం గురించి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన మాట క్రైస్తువులను మాత్రమే కాదు.. కాంగ్రెస్ ను అభిమానించి.. ఆరాధించే వారితో పాటు.. తెలంగాణ ప్రజలు సైతం ఇట్టే కనెక్టు అయ్యే మాట చెప్పారు.
డిసెంబరు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్ గా అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన మాటల్లో అర్థాన్ని ఆయన వివరిస్తూ.. ‘‘తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టిన నెల.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదే’’ అని గుర్తు చేశారు. ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2009లో నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకు చోదకశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది కూడా డిసెంబరులోనే. నిజమే.. తెలంగాణకు.. తెలంగాణ ప్రజలకు.. కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు మిరాకిల్ మంత్ అన్న రేవంత్ మాట నూటికి నూరుపాళ్లు నిజమే. ఇలాంటి కనెక్టింగ్ మాటలు రేవంత్ దగ్గర ఎక్కువే.









