తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం త్వరలోనే ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. తిరుమల శ్రీవారి మహత్యానికి అనుగుణంగా, ఈ విమానాశ్రయానికి “శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం” అనే పేరు పెట్టే పనిని టీటీడీ చేపట్టింది. ఈ మార్పును అధికారికంగా అమలు చేయించేందుకు కేంద్ర విమానయానశాఖకు సిఫార్సు పంపేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. మంగళవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నిర్ణయంతో పాటు మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి కర్నాటక ప్రభుత్వంతో ఒప్పందానికి సిద్ధమైంది. 47 ఎకరాల భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి కేటాయించనున్నట్లు సమాచారం. భూమి లభించిన వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
తిరుమల కొండపై భక్తుల రాకపోకలకు మెరుగైన ఏర్పాట్లలో భాగంగా 100 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖతో కలిసి ఈ బస్సుల సమీకరణ కొనసాగుతోంది. ఈ చర్యలతో పర్యావరణహిత ప్రయాణం కలుగనుండటం విశేషం. ఇక తిరుపతిలో స్థాపించనున్న CSIR ల్యాబ్కు భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. దీని ద్వారా శ్రీవారి ఆలయంలో ఉపయోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా పరీక్షించుకునే సౌకర్యం కలుగనుంది.
టీటీడీ విద్యాసంస్థల అభివృద్ధికీ ఈ సమావేశం మార్గదర్శకమైంది. ఢిల్లీలోని టీటీడీ కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో పాటు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు అర్చకులకు శిక్షణ కార్యక్రమాలను విస్తరించేందుకు, వ్రతాలు, పూజా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. టీటీడీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘సద్గమయ’ పేరుతో ధార్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వాలన్న యోచనను కార్యరూపంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సంస్కృతిని తెలియజేసేందుకు ‘మన వారసత్వం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇదే సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ‘సౌభాగ్యం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలలో ఆధ్యాత్మికతను మరింత విస్తృతంగా వ్యాపింపజేసేందుకు భజే శ్రీనివాసం, హరికథా వైభవం, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తేవాలని టీటీడీ తీర్మానించింది.
ఈ భేటీలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేష్, సదాశివరావు, శాంతారామ్, రామ్మూర్తి, దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల వైభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచేలా మారనున్నాయి.