ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేశారు. మీడియా సంస్థల అధిపతిగా రామోజీరావు కోసం చాలా మంది చాలా అనుకుంటారు. కానీ, నాకు ఆయనతో ఉన్న ఒక అనుభవాన్ని పంచుకుంటా అంటూ గతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో నేను మరో నలుగురు మిత్రులం రామోజీరావును కలవాలని అనుకున్నాం.. అప్పట్లో 2009 శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చేందుకు నెలరోజుల సమయం ఉంది. మా ప్రభుత్వం వచ్చేటట్లు ఉందని మేము లెక్కలు వేసుకున్నాం. రామోజీరావును కలవాలని నిర్ణయించుకున్నా’మని రేవంత్ రెడ్డి వివరించారు.
రామోజీరావు మంచి హోస్ట్, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. సీఎంగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయం ప్రస్తావిస్తారని అనుకున్నా, కానీ ఆయనేమీ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం రామోజీరావు జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఫిలింసిటీలో జరిగిన కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరైనా ఇద్దరు ముఖ్యమంత్రుల ఫొటోలు, వారిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
తన రాజకీయ గురువు చంద్రబాబుతో మనసారా మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు చెప్పడం విశేషం. 2006లో తెలుగుదేశంలో చేరిన రేవంత్ రెడ్డి చక్కని మాటతీరుతో టీడీపీలో అతితిక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ సమయంలో టీడీపీ గెలిస్తే రేవంత్ రెడ్డి మంత్రి అవుతారని ఆశించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదు. కానీ, అప్పట్లో తన ప్రయత్నాన్ని సీఎం హోదాలో ఉండగా ఇప్పుడు బయటపెట్టడంతో అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
మీడియా దిగ్గజం రామోజీరావు తెలుగు నాట ఒక సంచలనం. ఆయన గత ఏడాది దివంగతులు అయ్యారు. ఆయన గురించి తెలియని వారు లేరు. మీడియా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన వారుగా చరిత్రపుటల్లో ఎక్కారు. ఏ రోజూ రాజకీయ పదవులు ఆశించలేదు, ఏ అధికార పదవులు అందుకోలేదు. కేవలం తాను నమ్ముకున్న పత్రికారంగం ద్వారానే సమాజానికి మేలు చేశారు. అలాగే సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చో ఆచరణలో చూపించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డులని ఏర్పాటు చేసారు. ఈ అవార్డుల తొలి ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అతిరధ మహారధులు అంతా హాజరయ్యారు.
రామోజీరావు గురించి బాబు తన మనసులో మాటలను ఇదే వేదిక మీద పంచుకున్నారు. బాబు ఏమి మాట్లాడుతారు అన్నది అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన తన ఉపన్యాసం ద్వారా రామోజీరావుని కొత్త విధంగా ఆవిష్కరించారు. రామోజీరావు లాంటి వారు ఒక పది మంది ఉంటే చాలు సమాజాన్ని ఎంతో బాగు చేయవచ్చు అన్న బాబు మాటలు రామోజీరావు ఏమిటో చెబుతున్నాయి. అంతే కాదు రామోజీకి తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన తలచుకున్నారు. ఆయన వ్యక్తిత్వం ఏమిటో చాటి చెప్పారు.
రామోజీరావుని పోరాట యోధుడిగా అభివర్ణించారు. ఆయన చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అన్నారు మరో యాభై ఏళ్ళకు ఏమి జరుగుతుందో ముందే ఆలోచించి ఆ దిశగా ప్రణాళికలను తయారు చేసి అమలు చేసిన వారు అని అన్నరు. ఆయన తన ఎంతో మంది సామాన్యులను అసమాన్యులుగా తయారు చేశారు అన్నారు. ఆయనది ఆత్మ విశ్వాసం అని ఆయన దృఢ విశ్వాసమే ఎంతో మందికి స్పూర్తి అని అన్నారు. బలమైన ప్రభుత్వాలతో పోరాడి విజయం సాధించిన వారు రామోజీ అన్నారు.
ఇక తనకు ఏదైనా కష్టం వచ్చినా లేక తనకు ఇబ్బందులు ఎదురైనా రామోజీరావుని తలచుకుంటాను అని దాంతో తనకు ధైర్యం వస్తుందని బాబు చెప్పారు. రామోజీరావు గురించి ఆయన చెప్పిన మనసులో మాట ఇది. ఇక రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన చెబుతూ తనకు అయినా సరే వ్యతిరేక వార్తలు రాయవద్దు అని చెప్పవద్దు అనేవారు అని బాబు ఆయన గురించి చెప్పడం విశేషం. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్ళే రాజీలేని మనస్తత్వం రామోజీది అని ఆయన అన్నారు. అలా ఆయన ఉండడం వల్ల తన జీవితంలో ఎన్నో ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారని అయినా ఎక్కడా తగ్గలేదని బాబు చెప్పారు.


















