బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు. పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్కు లేఖ రాయాలని కిషన్రెడ్డిని కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ వేస్తానని రెండు రోజుల క్రితమే ప్రకటించిన రాజాసింగ్.. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే తనకు మద్దతిచ్చే వారిని ‘పదవిలో ఉంటారా? సస్పెండ్ చేయాలా?’ అంటూ కొందరు బెదిరించారని, తద్వారా నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. రాజీనామా అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిద్ధమయ్యారని, ముగ్గురు సంతకాలు చేశారని తెలిపారు. బెదిరింపుల కారణంగా మిగిలిన వారు సంతకాలు చేయలేదని చెప్పారు. ఎంతో మంది అర్హులైన నాయకులు ఉన్నా రాంచందర్రావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనుకోవడం క్యాడర్ను నిరాశకు గురి చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. కొంతమంది ముఖ్యనేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నా.. రావొద్దని కోరుకునే కొంతమంది పెద్దలు పార్టీలో జమ అయ్యారు. ఆ ఆకాంక్ష వారికే లేనప్పుడు మేమెంత కష్టపడ్డా లాభం లేదు. అందుకే అయ్యా మీకో దండం.. మీ పార్టీకో దండమని చెప్పాను’’ అని రాజాసింగ్ వివరించారు. పార్టీలో తాను 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనతోపాటు తన కుటుంబం మొత్తం ఉగ్రవాదులకు టార్గెట్గా ఉందన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వ సిద్ధాంతానికి మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాగా, రాజాసింగ్ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయత్నించినా.. తన నిర్ణయంలో మార్పులేదని చెప్పి వెళ్లిపోయారు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నిరాకరించారు. అయితే ఆయన రాజీనామా లేఖను కిషన్రెడ్డి జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. రాజాసింగ్ అభ్యర్థిత్వానికి పది మంది కూడా రాలేదని, అందుకే పార్టీని బద్నాం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. కాగా, పార్టీ నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.
బీజేపీలో రాజాసింగ్ రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా సొంత అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. పరోక్షంగా సీనియర్ నాయకులపైనే విమర్శలు చేస్తుంటారు. గతంలో కిషన్రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పొసగలేదు. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానని భీష్మించుకున్నారు. బండి సంజయ్ను అధ్యక్షుడిగా నియమించేంత వరకు పార్టీ ఆఫీసులోకి రాలేదు. పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ తీసుకున్న నిర్ణయాలను రాజాసింగ్ తప్పుబట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సూచించిన వారికి టికెట్ ఇవ్వలేదని ఆగ్రహించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారానికీ దూరంగా ఉన్నారు. ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. 14 నెలలపాటు పార్టీకి దూరంగా ఉంచింది. చివరికి ఎన్నికల టికెట్ కేటాయింపు సమయంలో సస్పెన్స్ను ఎత్తివేసి టికెట్ కేటాయించింది. తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాక కూడా రాజాసింగ్ తీరు మారలేదు. సీనియర్లపై విమర్శలు ఆపలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవిపైనా కన్నేశారు. అది నెరవేరే అవకాశం కనిపించకపోవడం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం రుచించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్.. తొలు తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని వెంటనే పార్టీ అగ్రనాయకత్వానికి పార్టీలోని కీలక నేతలు తెలియజేశారు. దీంతో బీజేపీ కీలక నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ రంగంలోకి దిగి.. రాజాసింగ్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
కానీ రాజాసింగ్ వివరణతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి రాజసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర నాయకత్వం పంపినట్లు తెలుస్తుంది. ఇక అధ్యక్ష ఎన్నికల వేళ.. అతని నామినేషన్ అడ్డుకోవాలనుకుంటే.. నామినేషన్ పత్రాలను రాజాసింగ్కు తాము ఎందుకు ఇస్తామని ఈ సందర్భంగా వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రతినిధులు అధికార ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతోందని తెలిపారు. అధ్యక్ష పదవికి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే నామినేషన్ వేయడానికి పార్టీ అవకాశం ఇచ్చిందని వివరించారు. ఎన్నిక ప్రక్రియలో ఏ లోపం లేకుండా దీనిని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పది మంది సభ్యులు ప్రతిపాదించిన తర్వాత నామినేషన్ వేస్తారని వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు.
రాజా సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ట చేరిందంటూ రాజాసింగ్పై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే.. అసెంబ్లీ స్పీకర్కు అందుకు సంబంధించిన లేఖను అందజేయాలని వివరించారు. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని రాణి రుద్రమ వివరించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. అందులోభాగంగా రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజా సింగ్ సైతం నామినేషన్ వేసేందుకు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనుచరులుతో వచ్చిన ఆయన్ని కార్యాలయంలోకి అనుమతించ లేదు. దీంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అధ్యక్ష పదవి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. అడ్డగించారని ఆరోపించారు. అంతేకాకుండా.. తన అనుచరులను సైతం భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు పెద్ద నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.