*పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యం*
*2027లో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం*
*పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి*
*ఢిల్లీలో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి రామానాయుడు వివరాలు వెల్లడి*
పడకేసిన ‘పోలవరం’ పనుల ను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ఢిల్లీలో సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన పోలవరం పనుల సమీక్షా సమావేశం వివరాలను మంత్రి మీడియాకు వివరించారు. 2019-24 మధ్య జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరానికి జరిగిన నష్టాన్ని, విధ్వంసాన్ని, 2024 లో కూటమి ప్రభుత్వ అధికారం లోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చక్కదిద్ది.. పనులను పరుగులు పెట్టిస్తున్న నేటి స్థితి వరకు సమీక్షలో చర్చించామన్నారు. కాలావధి లక్ష్యాన్ని నిర్ణయించుకుని 2027 డిసెంబర్ కల్లా.. వీలైతే పుష్కరాలకు ముందు అంటే అదే ఏడాది జూన్ లోనే పోలవరం పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిల్ స్వాగతించారు. సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లు రామానాయుడు స్పష్టం చేశారు. ఇందుకు ఆయనకు, గౌరవ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల పోలవరం పూర్తి కావడం, పోలవరం నీటితో రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఖాయమన్నారు.
2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 లోనే పోలవరం పూర్తయ్యేదని మంత్రి రామానాయుడు చెప్పారు. 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, రివర్స్ పాలన తో నీరుగార్చడం వల్ల ప్రాజెక్టుకు అపార నష్టం జరిగిందని మంత్రి ఆవేదన చెందారు. ప్రాజెక్ట్ కు జరిగిన నష్టం తో పాటు ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్నదాతలకు రావలసిన 50 వేల కోట్ల ఆదాయం నష్టపోయినట్లు మంత్రి అంచనా వేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28.5 లక్షలు మందికి తాగునీరు అందుతుందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. పోలవరంతో రాష్ట్రం దశ దిశ మారిపోవడం ఖాయమన్నారు. ఈ ఆశయంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం పర్యవేక్షణలో ప్రతి 15 రోజులకు సమీక్ష చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 1398 మీటర్లకు గాను ఇప్పటికి 686 మీటర్లు అంటే 56% పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో రోజుకి 5 లక్షలు పైగా క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తున్నా పనులు ఆపలేదన్నారు. అదే జగన్ ఐదేళ్ల హయాంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాముల మధ్య వరద నీరు రిజర్వాయర్ ను తలపించే దన్నారు. ఇలా జరగకుండా బట్రస్ డ్యామ్ నిర్మించి సిపేజీని అరికట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టుకి నాటి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, దశల వారి జరిగిన విధ్వంసాన్ని మంత్రి కళ్ళకు కట్టినట్లు వివరించారు. వారి బాధ్యతా రాహిత్యాన్ని ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2014-19 మధ్యకాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 3750 కోట్లు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ గా వస్తే ఆ నిధులను దారి మళ్లించేసినట్లు రామానాయుడు వివరించారు.
*ప్రాజెక్టుకి నిధుల సమస్య లేదు*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి రూ.12157 కోట్లు కేంద్రం మంజూరు చేయగా ఇప్పటికే 5052 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చేసిన పనులు తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పిస్తే, దశల వారీగా నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని.. అందువల్ల నిధుల సమస్య లేనే లేదని మంత్రి స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ -1కి సంబంధించి (అంటే 41.15 మీటర్ల ఎత్తుకు నీటిని నిలబెట్టే వరకు ) నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నష్టపరిహారం, కాలనీల నిర్మాణం, వసతులు సమకూర్చడం వంటి అన్ని పనులు 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. మొదటి ఫేజ్ లో 20946 మంది నిర్వాసితులు ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 26 పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన 49 ప్రోగ్రెస్ లో ఉన్నాయన్నారు. బ్యాలెన్స్ పనులకు, ఇతర సదుపాయాలు సమకూర్చడానికి రూ. 900 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచామన్నారు. ఫేజ్- 2 కి సంబంధించి నిర్వాసితులకు 2027 మార్చి కల్లా కాలనీలు నిర్మించి, సదుపాయాలు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామానాయుడు చెప్పారు.
పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన నాటి ముఖ్యమంత్రి జగన్ కి, గడువు చెప్పి.. ప్రారంభానికి పనులు పరుగులు పెట్టిస్తున్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షతకు తేడా గమనించాలని రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మొదటి ఫేజ్ లో 41.15 మీటర్లు కాంటూరు కి సంబంధించి 38వేల 060 కుటుంబాలను గుర్తించామన్నారు. ఇందులో మొదటి విడతలో 20,946, తరువాత రాడార్ సర్వే ద్వారా మరో 17,174 కుటుంబాలకు 75 కాలనీలు అవసరమైతే, నాడు చంద్రబాబు గారి హయాంలోనే 26 కాలనీలు పూర్తి చేశాం.49 కాలనీలో పురోగతిలో ఉన్నాయని వివరించారు
2019-24 జగన్ పరిపాలనా కాలంలో ఒక్కకాలనీలో ఒక్క నిర్వాసితుడి ఇంటికి, అరబస్తా సిమెంట్ గానీ, మౌళిక వసతుల కోసం ఒక్క రూపాయి గానీ ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
నాడు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన కాలనీలు తప్ప, ఒక్క నిర్వాసితుడి ఇంటిని కూడా పూర్తి చేయలేదని అన్నారు.