హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందించారు. రూ. కోటి విరాళాన్ని బుధవారం నాడు ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రస్తుత ఇన్ఛార్జి ఈవో మహేందర్ గౌడ్ వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 23న, నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట దేవస్థానాన్ని దర్శించారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయ విశిష్టతను నాటి ఈఓ కృష్ణ వివరించారు. అలానే అన్నదానం, ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాల కల్పన కోసం సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు.
కాగా సదరు విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ.. ఆలయ అభివృద్ధి కోసం విరాళాన్ని ఆలయానికి అందించినట్టు భావిస్తున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు, భక్తుల సౌకర్యం మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని ఆలయ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. నీతా అంబానీకి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.