ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి మేలు చేసిన ముఖ్యమంత్రుల చరిత్రను ప్రజలు మరవకూడదని, ఆ చరిత్రలో కాపులకు న్యాయం చేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరైతే, పాతతరం దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరొకరని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు సమాజానికి మేలు చేసేవిగా నిలిచాయని, అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేసి కాపులకు తీవ్ర అన్యాయం చేశాడని మండిపడ్డారు.
కాపు రిజర్వేషన్ల చరిత్రను ప్రస్తావించిన మంత్రి నిమ్మల, బ్రిటిష్ పాలనలో అమల్లో ఉన్న కాపు రిజర్వేషన్లను అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రద్దు చేశారని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదరం సంజీవయ్య ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించి కాపులకు న్యాయం చేశారని తెలిపారు. కానీ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మళ్లీ ఆ రిజర్వేషన్లు రద్దయ్యాయని చెప్పారు. అనంతర కాలంలో కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో, బీసీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కానీ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ సదుపాయాన్ని రద్దు చేసి కాపు సమాజానికి తీరని అన్యాయం చేశాడని విమర్శించారు. కాపుల చరిత్రలో వారికి ద్రోహం చేసిన నాయకుడిగా జగన్ పేరు మిగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్సీపీ పూర్తిగా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిందని మంత్రి నిమ్మల అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజల మధ్యకు వెళ్లాల్సింది పోయి, ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లాభపడాలని గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం వంటి పవిత్ర అంశాలపైనా రాజకీయ లాభం కోసం కుట్రలు చేయాలని చూసిన వారిని ప్రజలు క్షమించలేదని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఎన్నికల్లో వారికి తగిన శిక్ష విధించారని అన్నారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే రాజకీయాలకు ఇక రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశారు.
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా పాస్టర్ ప్రవీణ్, కడప పాస్టర్ అభినయ్ వంటి వ్యక్తులను అడ్డుపెట్టి వాతావరణాన్ని కలుషితం చేయాలని యత్నించారని నిమ్మల ఆరోపించారు. కానీ ఆ కుట్రలు ప్రజల ముందే బట్టబయలై, చివరకు వైఎస్సార్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వేసిన పన్నాగాలే తిరగబడ్డాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులై ఉన్నారని, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో బాగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం వైసీపీకి చెందిన కాపు నేతలను రెచ్చగొట్టి, వారితో తప్పులు చేయించి, చివరకు జైలుకు వెళ్లే పరిస్థితులు తీసుకొచ్చాడని మంత్రి నిమ్మల విమర్శించారు. తర్వాత అదే నేతలపై మొసలి కన్నీరు కార్చి, తాను ఎంతో బాధపడుతున్నట్టు నటించాడని ఆరోపించారు. ఒకసారి ఫ్యాక్షన్ రాజకీయాల వలలోకి లాగిన తర్వాత, ఆ నేతలు బయటకు రాకుండా జీవితాంతం తన చుట్టూ తిరిగేలా, తన అజెండాకే పరిమితమయ్యేలా జగన్ వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఇదే పులివెందుల ఫ్యాక్షన్ సంస్కృతి అని, ఇప్పుడు అదే సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ప్రమాదకర ఆలోచనతో వైసీపీ పనిచేస్తోందని మండిపడ్డారు.
మంచి కుటుంబాల నుంచి వచ్చిన పలువురు నేతలను కూడా తప్పుదారి పట్టించి, వివాదాల్లోకి నెట్టేసి, చివరికి రాజకీయంగా దెబ్బతినేలా చేశారని నిమ్మల వ్యాఖ్యానించారు. కాపు నేతలతోనే సాటి కాపులను తిట్టించడం, వారిని ప్రజల ముందు బూతు నేతలుగా, రోత నేతలుగా నిలబెట్టడం జగన్ రాజకీయాల అసలు రూపమని ఆరోపించారు. నేరాలకు ప్రోత్సాహం ఇచ్చే, వ్యక్తిత్వాలను ధ్వంసం చేసే కర్మాగారంలా వైఎస్సార్సీపీ మారిపోయిందని, అదే సమయంలో నాయకత్వాన్ని తీర్చిదిద్దే పార్టీగా తెలుగుదేశం నిలుస్తోందని అన్నారు.
కాపు సమాజానికి న్యాయం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉందని, కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మెంటే పద్మనాభం, యర్రా నారాయణస్వామి, తోట సీతారామలక్ష్మి, వంగా గీత, సి. రామచంద్రయ్య, సానా సతీష్ వంటి కాపు నేతలకు గౌరవప్రదమైన అవకాశాలు ఇచ్చి, పెద్దల సభకు పంపి ఆదరించిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా జగన్ అధికారంలో ఉన్న సమయంలో జగన్, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వంటి కొద్దిమందికే ప్రాధాన్యత ఇచ్చి, కాపు నేతలను కేవలం అవసరం వచ్చినప్పుడే వాడుకుని, తర్వాత పక్కనపెట్టేశారని విమర్శించారు. కాపులను కరివేపాకుల్లా వాడుకున్న పార్టీగా వైసీపీ నిలిచిపోయిందని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా కాపు సమాజానికి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి నిమ్మల చెప్పారు. చదలవాడ కృష్ణమూర్తి, ఆది కేశవుల నాయుడు, పప్పల చలపతిరావు వంటి కాపు నేతలకు టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందని గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం తన అధికార కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి తనకు దగ్గరైన వారికే అవకాశాలు కల్పించాడని విమర్శించారు. కాపుల గురించి మాట్లాడే ముందు ఈ చరిత్రను వైసీపీ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు – పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తుండటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అభివృద్ధి, ఉపాధి, సామాజిక సమతుల్యతకు కొత్త దారులు తెరుచుకున్నాయని నిమ్మల పేర్కొన్నారు. ఈ ఇద్దరూ రామలక్ష్మణుల్లా కలిసి ఉన్నంతకాలం తమకు అధికారం రాదని అర్థమై, కాపు సమాజాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ జగన్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కులాల మధ్య గోడలు కూల్చి, అందరినీ కలుపుకుని వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన అయితే, కులాల మధ్య చీలికలు ఉంటేనే వైసీపీకి రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించి ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా క్వాంటం వ్యాలీ, పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల రాక, ఐటీ-ఎలక్ట్రానిక్స్ రంగాల పెరుగుదల వల్ల గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కాపు యువత కూడా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, సాంకేతిక రంగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. కాపు సమాజాన్ని ఓటు బ్యాంకుగా కాకుండా, ఆర్థికంగా బలోపేతం చేయడం, విద్యా-ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం కోసమే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాజకీయ లాభాల కోసం కాపు చరిత్రను వక్రీకరించడం, సమాజాన్ని రెచ్చగొట్టడం, అపోహలు సృష్టించడం ద్వారా ఎవరూ ఎక్కువకాలం ప్రజలను మోసం చేయలేరని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. కాపు సమాజం తెలివైనది, చైతన్యవంతమైనది, రాజకీయంగా చురుకైనదని, ఎవరు నిజంగా తమకు న్యాయం చేశారో, ఎవరు వాడుకుని వదిలేశారో బాగా తెలుసని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాపుల పాత్రను తగ్గించేందుకు, వారిని ఒకరిపై ఒకరిని ఎగదోసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ దుష్ప్రచారాలను కాపు సమాజం నమ్మదని ధీమా వ్యక్తం చేశారు.
APNews


















