మెగా డీఎస్సీ 2025 నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మెగా డీఎస్సీపై పేపర్ లీకైందన్న ప్రచారం నుంచి కమ్మ కులానికే ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణల వరకు రోజుకో ఫేక్ ప్రచారాన్ని జగన్ చేస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా ప్రజల ముందు చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి లోకేష్, ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి రోజు నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు తాగునీటి సరఫరా, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అండర్గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మంగళగిరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు తీసుకురావడంలో ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని లోకేష్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంగళగిరికి నిధులు మంజూరు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వాసిగా ఈ ప్రాజెక్టులన్నింటినీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
పాత మంగళగిరిలోని బిట్రావారి వీధి, దింపుడు కళ్లం ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ సందర్శించారు. దాదాపు 2.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మహాప్రస్థానం ప్రజలకు గౌరవప్రదమైన అంత్యక్రియల సదుపాయాలను అందించేందుకు రూపొందించబడింది. ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణంతో ఈ ప్రాజెక్టు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.
అలాగే మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో అభివృద్ధి చేసిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ను మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారు. సెల్కాన్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద రూ.3.3 కోట్ల వ్యయంతో ఈ పార్క్ను అభివృద్ధి చేసింది. సుమారు 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ నడక మార్గాలు, విశ్రాంతి ప్రాంతాలు, హరిత వాతావరణం, ఆధునిక సదుపాయాలతో పార్క్ను తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి అంశంపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. అమరావతిపై జగన్కు ఉన్న కక్షకు వెస్ట్ బైపాస్ ప్రాజెక్టే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాజధానికి సరైన రహదారి అనుసంధానం లేకుండా, ఒక్క ఎగ్జిట్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వెస్ట్ బైపాస్కు తగిన ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
NaraLokesh


















