కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశాలు పతాక శీర్షికల్లో వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఏర్పాటు చేసిన మీడియా చిట్ చాట్ అనంతరం టీవీ చానళ్లలోనూ బ్రేకింగ్ న్యూస్ గా కవిత వ్యాఖ్యలు కనిపించాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అదేమంటే.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. గులాబీ పార్టీలో పెను కలకలాన్ని రేపుతున్న బిడ్డ కవితపై ఫామ్ హౌస్ లో ఉన్న బాపూ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఎందుకుంటే.. తనకు కానీ తన పార్టీకి కానీ కించిత్ నష్టం వాటిల్లేలా వ్యవహరించే వారి విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఎంతో సన్నిహితులైన వారిని సైతం ఆయన విడిచిపెట్టింది లేదు. ఆయనకు కోపం వస్తే పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ లాంటి వారికి సైతం కఠిన శిక్షలు (తమ సొంత మీడియా సంస్థలో ఫోటో దగ్గర నుంచి ఎలాంటి వార్త పబ్లిష్ కాకుండా చూడటం) వేయటం తెలిసిందే. అలాంటప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కవిత అంశంపై బాపూ రియాక్షన్ ఏమిటి? అన్నది ప్రశ్న.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కవిత చేస్తున్న వ్యాఖ్యలపై కేసీఆర్ గుంభనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో సన్నిహితుల వద్ద తప్పించి..ఆయన ఈ విషయం మీద మాట్లాడలేదంటున్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆయన గుర్రుగా ఉన్నప్పటికి.. ఇప్పటికిప్పుడు స్పందించాలన్న ఆలోచనలో లేదన్నట్లుగా చెబుతున్నారు. సంక్షోభాలు.. సవాళ్లు బీఆర్ఎస్ కు.. కేసీఆర్ కు కొత్తేం కాదు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు.. ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
అయితే.. అవన్నీ ఒక ఎత్తు తాజాగా జరుగుతున్నది మరో ఎత్తు. ఏ రాజకీయ అధినేత అయినా వారి గురించి..వారి కుటుంబంలోని అంశాల మీద విరుచుకుపడే కేసీఆర్ కు తొలిసారి తన సొంత కుటుంబంలో చోటు చేసుకున్న పంచాయితీని సరిచేసే అంశంపై కాస్తంత కన్ఫ్యూజన్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అదే పనిగా స్పందించే కన్నా.. వేచి చూసే ధోరణి మంచిదన్న ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. కవిత ఎపిసోడ్ కు సంబంధించిన పరిణామాలపై అతిగా స్పందించకుండా.. ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావాలన్న సంకేతాలు తమ సొంత మీడియా సంస్థలకు అందినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే వేచి చూసే ధోరణి తప్పించి.. విరుచుకుపడకుండా ఉండాలన్న నిర్ణయానని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా కవితకు నోటీసులు అన్న ప్రచారం జోరుగా సాగినా.. గురువారం రాత్రి వరకు అలాంటిదేమీ లేకపోవటం గమనార్హం. కవిత విషయంలో తొందరపాటు వద్దొన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
కవిత తన స్వరాన్ని పెంచారు. తాజాగా చిట్ చాట్ నిర్వహించిన సందర్భంగా ఆమె ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఎవరిని టార్గెట్ చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాధానాలు లభిస్తాయి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని కుండ బద్ధలు కొట్టిన ఆమె.. మునిగే నావలో నేనెందుకు చేరతా? అన్న సూటి ప్రశ్నతో పాటు.. ఒకవేళ చేరితే నాకు వచ్చే లాభం ఏమిటి? అన్న ప్రశ్నను సంధించారు.
అదే సమయంలో బీజేపీని పార్టీలో కలిపేందుకు వందశాతం ప్రయత్నాలు జరిగాయని.. తాను జైల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలిపే ప్రతిపాదన తీసుకొస్తే తాను వ్యతిరేకించినట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ ను స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాదు.. అవసరమైతే తాను జైల్లో ఆర్నెల్లు కాదు ఏడాది అయినా ఉంటానని.. విలీనం మాత్రం చేయొద్దని చెప్పటం ద్వారా.. కేసీఆర్ కు సంబంధం లేకుండా పార్టీ విలీనంపై బీజేపీతో రాయబారాలు జరిగియాన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
తనను కేసీఆర్ నుంచి విడదీసే కుట్రలు.. పార్టీకి.. కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తనను పార్టీ నుంచి బయటకు పంపితే ఎవరికి లాభం? అన్న ప్రశ్నను సంధిస్తూ.. ఆ ముగ్గురు అన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారు. ‘‘మీడియా సెల్ పెట్టుకొని దాడులు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్ మెసేజ్ లు పెడితే సరిపోతాయా? ట్వీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలి. పార్టీ ఎమ్మెల్సీ అయిన నాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు స్పందించటం లేదు? పెయిడ్ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్ మీడియాలో మహాభారతం కేరక్టర్లు వేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మంచిదేనా?లీకు వీరులను కట్టడి చేయకుండా పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తే భయపడేది లేదు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు మొత్తం కేటీఆర్ ను ఉద్దేశించి చేసినవే అన్న మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ సోషల్ మీడియా అంశాల్ని చూసుకునేది కేటీఆర్ అన్న విషయం అందరికి తెలిసిన నేపథ్యంలో.. కవిత మాటలు ఆయన్ను ఉద్దేశించి చేసినవనే చెప్పాలి.
తాను పార్టీ పదవుల్ని ఎప్పుడూ అడగలేదని.. ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటానన్న కవిత.. ‘నేను నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించను. నల్లి కుట్ల రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశం పైనైనా నేరుగా మాట్లాడతా’ అన్న మాట రాజ్యసభ సభ్యుడు సంతోష్ ను ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. మరో ముఖ్యనేత హరీశ్ ను ఉద్దేశించి కూడా ఆమె కీలక వ్యాఖ్య చేశారు. ‘బీజేపీ నాయకుడి ఆసుపత్రిని ప్రారంభించింది ఎవరో చెప్పాలి’ అన్న వ్యాఖ్య హరీశ్ ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు చెప్పాలి. ఆమె మాటల్లో ఎక్కువగా కేటీఆర్ కు తగిలేలా ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే చిట్ చాట్ పేరుతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ చుట్టు దెయ్యిలు తిరుగుతున్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని చెప్పకనే చెప్పినట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పక తప్పదు.