రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రతి నాయకుడు “ప్రజాసేవే నా ధ్యేయం” అని చెబుతాడు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, సమాజ అభివృద్ధికి కృషి చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటిస్తాడు. కానీ కాలక్రమేణా ప్రజలు చూస్తున్న దృశ్యం అందుకు భిన్నంగా మారుతోంది. చట్టాలు రూపొందించాల్సిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని అధికారాన్ని, సంపదను కూడబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నేతల వరకు కొందరిలో కనిపిస్తున్న ఆడంబర జీవనం, వాహనాల శ్రేణులు, పైరవీలు, అక్రమ దందాల ఆరోపణలు ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
అయితే ఇదే రాజకీయ రంగంలో పదవులను సంపాదనకు సాధనంగా కాకుండా, ప్రజాసేవకు వేదికగా భావించిన నాయకులు కూడా ఉన్నారు. అధికారాన్ని ఆస్వాదించకుండా బాధ్యతగా స్వీకరించిన వారు ఉన్నారు. ప్రజల డబ్బును తమ డబ్బుగా భావించని వారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుమ్మడి నర్సయ్యలాంటి నేతలు ఒకవైపు ఉంటే, దేశ రాజకీయాల్లో అదే తరహా నిరాడంబరతకు, నిజాయితీకి, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచిన నాయకుడు జార్ఖండ్కు చెందిన గిరిజన ప్రజానాయకుడు కరియా ముందా.
దేశ రాజకీయ చరిత్రలో ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో కొనసాగి కూడా అవినీతి ఆరోపణలకు దూరంగా నిలవడం చాలా అరుదైన విషయం. ఆ అరుదైన గౌరవాన్ని సంపాదించిన నాయకుల్లో కరియా ముందా పేరు ముందు వరుసలో ఉంటుంది. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ప్రజల మధ్యనుంచి వచ్చిన వ్యక్తి తన మూలాలను మరచిపోకూడదనే విషయాన్ని ఆయన జీవితం నిరూపించింది.
1936 ఏప్రిల్ 20న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంతి జిల్లా అనిగర గ్రామంలో ముండా గిరిజన కుటుంబంలో జన్మించిన కరియా ముందా, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికల వరకు ఎదిగారు. రాంచీ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. విద్య, సామాజిక చైతన్యం, గిరిజన సంక్షేమం పట్ల ఉన్న ఆసక్తి ఆయనను ప్రజాజీవితంలోకి తీసుకువచ్చింది.
భారతీయ జనతా పార్టీ ఏర్పడకముందే భారతీయ జనసంఘ్ ఉద్యమాల్లో పాల్గొన్న కరియా ముందా, గిరిజన ప్రాంతాల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత జార్ఖండ్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసిన ప్రధాన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.రాజకీయాల్లో ఆయన ఎదుగుదల వ్యక్తిగత ప్రభావంతో కాకుండా ప్రజల విశ్వాసంతో జరిగింది. ఖుంతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నిక కావడం ఇందుకు నిదర్శనం. 1977, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇది జార్ఖండ్ రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డు.
కేంద్రంలో ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా, గ్రామీణ పరిశ్రమల మంత్రిగా, బొగ్గు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2009లో లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆయన పేరును సమర్థించాయి. నేటి రాజకీయ వాతావరణంలో ఇలాంటి ఏకాభిప్రాయం అరుదైన విషయం.
అయితే ఆయన గొప్పతనం పదవుల్లో కాదు. పదవులు ముగిసిన తర్వాత ఆయన ఎలా జీవించారన్నదే ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెడుతుంది.దేశ పార్లమెంటులో కీలక పదవులు నిర్వహించిన వ్యక్తి అంటే ప్రజల ఊహల్లో భారీ భవనాలు, భద్రతా వలయాలు, విలాసవంతమైన జీవితం కనిపిస్తాయి. కానీ కరియా ముందా జీవితం అందుకు పూర్తి భిన్నం.
పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఆయన తన గ్రామానికే వెళ్లిపోయేవారు. అనిగర గ్రామంలోని సాధారణ మట్టి ఇంట్లో నివసించేవారు. వ్యవసాయ పనులను స్వయంగా చేసుకునేవారు. కూరగాయలు, ధాన్యాలు పండించుకొని జీవించేవారు. గ్రామస్థులతో కలిసి సామాన్యుడిలా మెలిగేవారు. ఆయన ఇంటి గుమ్మం వద్ద అధికార హంగులు కనిపించవు. ఆయన జీవనశైలిలో రాజకీయ అధికారపు ఆడంబరం కనిపించదు.
అందుకే ప్రజలు ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగా కాదు, విలువలతో జీవించిన వ్యక్తిగా గుర్తుంచుకుంటున్నారు.
పద్మభూషణ్ నుంచి పియం కేర్స్ ట్రస్ట్ వరకు
దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2019లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అది కేవలం ఒక వ్యక్తికి లభించిన పురస్కారం కాదు. నిజాయితీ రాజకీయాలకు, నిరాడంబర జీవనానికి, నిస్వార్థ ప్రజాసేవకు లభించిన గౌరవం.
2020లో ఏర్పాటు చేసిన పియంకేర్స్ (PM CARES ) ట్రస్ట్లో కూడా కరియా ముందాను ట్రస్టీగా నియమించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.టి. థామస్లతో పాటు ఆయనకు చోటు కల్పించడం ఆయనపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసానికి నిదర్శనం. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య సంక్షోభాల్లో ప్రజలకు సహాయం అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ ట్రస్ట్లో ఆయన భాగస్వామ్యం కావడం ఆయన ప్రజా జీవిత విశ్వసనీయతను మరింత స్పష్టంగా తెలియజేస్తుంది.
కరియా ముందా జీవితాన్ని చూస్తే ఒక ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయాలు నిజంగా ప్రజాసేవ కోసమేనా? లేక అధికార, ఆస్తుల సమీకరణ కోసమా? నేటి తరానికి రాజకీయాలు అంటే హోదాలు, హంగులు, ప్రచారాలు, కోట్లాది రూపాయల ఎన్నికల ఖర్చులు గుర్తుకొస్తున్నాయి. కానీ కరియా ముందా వంటి నాయకులు రాజకీయాల అసలు అర్థం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమేనని గుర్తుచేస్తున్నారు.
ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి వద్ద భారీ ఆస్తులు లేవు. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తిపై అవినీతి ఆరోపణలు లేవు. లోక్సభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన నాయకుడు మట్టి ఇంట్లోనే జీవించాడు. ఇవన్నీ నేటి రాజకీయ వాతావరణంలో అసాధారణంగా కనిపించవచ్చు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇవే నిజమైన ప్రమాణాలు కావాలి.నాయకులు ఎంత సంపాదించారన్నది చరిత్ర గుర్తుంచుకోదు. ఎంత పెద్ద కాన్వాయ్లో తిరిగారన్నదీ గుర్తుండదు. కానీ ప్రజల కోసం ఎంత నిజాయితీగా జీవించారన్నది మాత్రం తరాలు గుర్తుంచుకుంటాయి. కరియా ముందా అలాంటి అరుదైన నాయకుడు. రాజకీయాల్లో విలువలు ఇంకా బతికే ఉన్నాయని, ప్రజాసేవ ఇంకా సాధ్యమేనని, అధికారంలో ఉన్నా సాధారణ జీవితాన్ని గడపవచ్చని ఆయన నిరూపించారు.
నేడు రాజకీయాలపై విశ్వాసం కోల్పోతున్న సమాజానికి, ప్రజాస్వామ్యంపై సందేహాలు పెరుగుతున్న యువతకు, పదవిని సేవగా భావించే నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న దేశానికి కరియా ముందా జీవితం ఒక సందేశం.
అధికారాన్ని సంపాదించడం గొప్ప విషయం కాదు… అధికారంలో ఉండి కూడా మనిషిగా మిగలడం గొప్ప విషయం. కరియా ముందా అదే చేసి చూపించారు.
చందమూరి నరసింహరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.
KariaMunda


















