అక్రమంగా అమెరికాకు (US) వెళ్లే భారతీయులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తుండటం తెలిసిందే.
భారతీయులు ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లే పరిస్థితిని నివారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, కొందరు అత్యంత ప్రమాదకరమైన డంకీ మార్గాలను ఉపయోగించి అమెరికా చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో, గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి డంకీ రూట్ (Dunki Route) ద్వారా అమెరికా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.మృతుడిని గుజరాత్లోని సబర్కాంఠా జిల్లాకు చెందిన మోయద్ గ్రామ వాసి దిలీప్ పటేల్ (Dilip Patel)గా గుర్తించారు.
దిలీప్ పటేల్ అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకుని, ఇటీవల ఓ ఏజెంట్ను సంప్రదించారు.తన భార్య, పిల్లలతో కలిసి అమెరికా చేరేందుకు రూ. కోటి చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేయడంతో, కుటుంబం తమ భూమిని విక్రయించి అవసరమైన మొత్తం చెల్లించినట్లు స్థానికులు తెలిపారు.రెండు నెలల క్రితం దిలీప్ తన కుటుంబంతో కలిసి టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి నికరాగ్వాకు చేరుకున్నాడు.అక్కడి నుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తుండగా, మధుమేహం ఉన్న అతడికి అనారోగ్యం తీవ్రంగా పెరిగింది.ప్రయాణ సమయంలో అవసరమైన ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో దిలీప్ ఆరోగ్యం మరింత విషమించి, చివరికి కోమాలోకి వెళ్లి మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం అతని భార్యాబిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం.ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగశాఖ సహాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు.అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పటి నుంచో కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపించే చర్యలను వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలోనే, ఇటీవల 104 మంది భారతీయులను ప్రత్యేక సైనిక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.