ఓవైపు ట్రాఫిక్, మరోవైపు చినుకు పడితే రోడ్లపై నిలిచిపోయే నీళ్లు.. నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై మరో పిడుగు లాంటి వార్త. భాగ్యనగరంలో నివసించడం భారంగా మారిపోయింది. ఇంటి అద్దెలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ లో సౌకర్యవంతమైన ఇళ్లు దొరకాలంటే అధిక అద్దెలు చెల్లించాల్సిందే. కొవిడ్ తర్వాత భాగ్యనగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత తాజాగా మరోసారి ఇళ్ల అద్దెలు పెరిగినట్లు తాజా నివేదిక ద్వారా అర్థం అవుతోంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. ప్రస్తుతం దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటి. అటు టెక్, ఐటీ సంస్థలు.. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంది భాగ్యనగరం. అయితే తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో ఆఫీస్ స్థలాల అద్దెలు భారీగా పెరిగినట్లు తెలిపింది. ముంబై టాప్ ప్లేస్ లో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
అనరాక్ అందించిన నివేదిక ప్రకారం.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(MMR) ఇప్పుడు అత్యధిక ధర కలిగిన కమర్షియల్ మార్కెట్ గా నిలిచింది. ముంబై నగరంలోని ఆఫీస్ స్థలాల అద్దెలు టాప్ రేంజ్ లో పెరిగిపోయాయి. దీంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య మార్కెట్ గా ఉంది. ఇక ఈ అద్దెల పెరుగుదలలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు అనరాక్ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది.ముంబైలో గతంతో పోలిస్తే 28శాతం అద్దెలు పెరిగాయట. 2022లో చదరపు అడుగు రూ. 131 ఉండగా.. 2025లో చదరపు అడుగు రూ. 168కు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 నుంచి 2025 మధ్యలో ముంబైతోపాటు దిల్లీ, హైదరాబాద్ నగరాల్లోనూ అద్దెలు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆఫీసు స్థలాల అద్దెలు గత నాలుగేళ్లలో 24.1 శాతం పెరిగింది. ఇక దిల్లీలో 20శాతం పెరిగింది. బెంగళూరులో 15.8 శాతం పెరిగింది. పుణెలో 11 శాతం, చెన్నై లో 9.1 శాతం ఆఫీస్ స్థలాల అద్దెలు పెరిగినట్లు అనరాక్ సంస్థ నివేదికలో తెలిపింది.
హైదరాబాద్ లో ఏటేటా అద్దెలు పెరుగుతున్నట్లు అనరాక్ సంస్థ పేర్కొంది. ఆఫీసు స్థలాల అద్దెలు చదరపు అడుగు ధర 2022 లో రూ. 58 , 2023లో రూ. 64, 2024లో రూ. 66, 2025లో రూ. 72 గా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది.