వారసులు లేని భూ యజమాని చనిపోయినట్లు తెలియగానే, అతని సమీప బంధువులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై రూ.వంద కోట్లకు పైగా విలువైన ఆస్తిని కాజేశారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వీలునామా నకిలీదని తేలడంతో ఈ విషయం బయటపడింది. నకిలీ పత్రాలు సృష్టించిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వారసులమని చెప్పి :చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన పట్లోళ్ల (ముత్తెగారి) ప్రతాప్రెడ్డి భూస్వామి. ఇతనికి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతాప్రెడ్డికి వివాహమైనా సంతానం లేదు. పదేళ్ల కిందట భార్య అనసూయ మరణించగా, 2018లో ప్రతాప్రెడ్డి కూడా మరణించారు. దూరపు బంధువులు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ఫిరోజ్గూడకు చెందిన గుమ్మల జగన్మోహన్ రెడ్డి అలియాస్ మోహన్ రెడ్డి(67), అతని భార్య సురేఖ (60), వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన పట్లోళ్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామానికి చెందిన ఇందిరాదేవి, గుమ్మళ్ల ప్రసన్న, గుమ్మల అనంత్రెడ్డి, గుమ్మల సత్య నారాయణరెడ్డి, గుమ్మల మధుసూదన్రెడ్డి తదితరులంతా కలిసి పథకం వేశారు.
దత్తత తీసుకున్నారని నమ్మించి :మోహన్ రెడ్డి, సురేఖ దంపతులు ప్రతాప్రెడ్డికి తల్లి తరఫు బంధువులు. ప్రతాప్రెడ్డి తనను దత్తత తీసుకున్నారని, ఆధార్, రేషన్ కార్డులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మోహన్రెడ్డి సృష్టించాడు. 2018 అక్టోబరు 9న ప్రతాప్రెడ్డి మరణించగా, అంతకు ఏడాది ముందు అనగా 2017 డిసెంబరు 3న ఆయన ఒక వీలునామా రాశారని, దాని ప్రకారం మరణానంతరం భూములు, ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఇందుకు రామకృష్ణారెడ్డి, ఇందిరాదేవి సాక్ష్యమని నకిలీ పత్రం సృష్టించాడు.
రెవెన్యూ అధికారులను నమ్మించి :50కి పైగా ఎకరాలను మోహన్ రెడ్డి, సురేఖల పేర్ల మీదికి, మిగిలిన భూమిని ఇతర నిందితుల పేర్ల మీదకు బదిలీ చేయించుకున్నారు. ప్రతాప్రెడ్డి బ్యాంకు ఖాతాలోని రూ.19 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్రెడ్డి తండ్రి తరఫు బంధువు పట్లోళ్ల రామేశ్వర్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి వీలునామా అసలైందో కాదో తేల్చాలని పోలీసులను ఆదేశించింది.
నివేదికతో గుట్టు రట్టు :2023 సెప్టెంబరు 7న చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు మోహన్రెడ్డి సమర్పించిన వీలునామాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ పత్రం నకిలీదని తేలింది. ప్రతాప్ రెడ్డి ఇతర సంతకాలతో పోల్చి చూడగా, ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు 2017కు ముందు మోహన్రెడ్డి వద్ద ఉండే రేషన్, ఆధార్ కార్డుల్లో తండ్రి పేరు హనుమంతురెడ్డి అని ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు రెండ్రోజుల క్రితం మోహన్ రెడ్డి ఆయన భార్య సురేఖను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.